మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (‘మా’) అనే చిన్న సంస్థ అధ్యక్ష పదవి కోసం జరుగుతున్న ఎన్నికలు, సినీ రంగంలో రాజకీయ అలజడికి కారణమయ్యాయి. చిన్న సంస్థగా ‘మా’ సంస్థను ఆ సంస్థ మాజీ అధ్యక్షుడు నాగబాబు అభివర్ణిస్తూ, ఎన్నికలు జరగడం మంచిదేగానీ, రాజకీయ విమర్శలు తగదని చెప్పారు. జయసుధ ప్యానల్ రాజకీయ విమర్శలు మొదలు పెట్టినప్పటికీ, ఈ రాజకీయాలు ఎన్నికల వరకేననీ ఆ తర్వాత అందరం కలిసే ఉంటామని ఆయన అన్నారు. సినీ కళాకారుల కోసం ‘మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్’ ఆరంభమైంది. చిరంజీవి వ్యవస్థాపక అధ్యక్షుడు. ఎక్కువ కాలం ‘మా’ అధ్యక్షుడిగా పనిచేసినవారిలో మురళీమోహన్ ఒకరు. పోటీలో ఉన్న జయసుధ, రాజేంద్రప్రసాద్ ఇద్దరూ సీనియర్లే. ఇద్దరికీ సినీ రంగంలో ఎవరితోనూ విభేదాలు లేవు. ఎవరు గెలిచినా, ఎవరు ఓడినా సినీ రంగంలో రాజకీయాలకు తావివ్వకుండా, తామంతా తెలుగు సినీ కళామతల్లి బిడ్డలమేననే భావనతో మెలగాలి. ఆధిపత్య పోరులో భాగంగా వివాదం మీడియాకి ఎక్కడంతో సినీ జీవులు సంయమనం కోల్పోతుండడంతోనే ఇదేదో పెద్ద వివాదంగా కనిపిస్తుంది. మురళీమోహన్ కూడా చాలా సౌమ్యుడే. ఆయన మద్దతిచ్చిన జయసుధ ప్యానల్ కూడా వివాదాన్ని రాజకీయం చేయకుండా ఉంటే మంచిదన్న ఆలోచనతోనే ఉన్నారని వినికిడి. అదే మంచిది కూడా.
|