Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
jyotishyam vignaanam

ఈ సంచికలో >> శీర్షికలు >>

బృహస్పతి కోవెల - కర్రా నాగలక్ష్మి

bruhaspati temple

 ఆలంగుడి గురు స్థానం

యీ సంవత్సరం ఆంగ్ల తేదీల ప్రకారం జూలై 14న మనం గోదావరి పుష్కరాలు జరుపు కుంటున్నాం .

యీ పుష్కరాల గురించి  క్లుప్తంగా చెప్పుకుందాం . నవగ్రహాల్లో ముఖ్యమైనది అయిదవది అయిన గురుగ్రహం లేక బృహస్పతి జాతక చక్రంలో రాశి  మారినపుడు హిందూ దేశంలో వున్న పవిత్రమైన పన్నెండు నదులకు పుష్కరం యేర్పడుతుంది . అంటే గురువు వోకటో రాశి అయిన మేష రాశి నుంచి వృషభరాశి కి  మారినపుడు పుష్కరం యేర్పడుతుంది . ఆలా రాశి మారినపుడు పుష్కర పురుషుడు భక్తుల పాప ప్రక్షాళన చేసేందుకు ఆ యా నదులలో ప్రవేశించి పుష్కర దినములు ఆ నదులందు వుండి  భక్తులను అనుగ్రహిస్తాడు . పుష్కరము అనగా పన్నెండు అని అర్ధం . గురువు వొక రాశినుండి మరోకరాశిలోకి మారడానికి సుమారు కొంచము తక్కువగా సంవత్సర కాలం పడుతుంది . అంటే పన్నెండు నెలలు .

గురువు పన్నెండు రాశులలో ప్రవేశించి నపుడు యేయే నదులకు పుష్కరం యేర్పడుతుందో తెలుసుకుందాం . 

 మేషం లో గంగానదికి , వృషభంలో నర్మదకి  , మిధునం లో సరస్వతికి , కర్కాటకం లో  యమునకి , సింహం లో గోదావరికి , కన్య లో కృష్ణ కి , తుల లో కావేరికి , వృఛ్చికం లో భీమా కి ధనుస్సులో తపతి కి , మకరం లో తుంగభద్ర కి , కుంభం లో సింధు కి , మీనం లో ప్రాణహిత కి పుష్కరాలు జరుగుతాయి .
గురుగ్రహం అనుగ్రహం వుంటే అన్నిటా విజయం సిద్దిస్తుందిట అలాంటి గురు గ్రహానికి కోవెల వుంటే ? అక్కడ అర్చనలు చేసుకుంటే యింకెంత పుణ్యమో కదా ? అందుకే హిందూ దేశం లో వున్న యేకైక  అతి పెద్దదైన బృహస్పతి కోవెల గురించి తెలుసు కుందాం .

యిది తిరువారూర్ జిల్లలో , వెళంగిమాన్ తాలుకాలో వెళంగిమాన్ ఊరికి 9 కిమీ దూరంలో వున్న ఆలంగుడి గురించి తెలుసుకుందాం .       చోళదేశంలో వున్న 274 పుణ్య స్థానాలలో కావేరీ నదీ దక్షిణ తీరాన  127 పుణ్యస్థానాలున్నాయి . వాటిలో 98వ పుణ్యస్థానం గా గుర్తించబడింది ఆలంగుడి .

కుంభకోణానికి 17కిమి.దూరంలో తిరువరూర్ జిల్లాలో వెళంగిమాన్ తాలుకాలో వున్న ఆలంగుడి అనే వూరిలో దైత్యులగురువైన బృహస్పతికి చాలా పెద్ద కోవెల వుంది . నవగ్రహ కొవెళ్లలో మూలవిరాట్టు శివుడు , వాస్తు శాశ్త్రాన్ని అనుసరించి ఏ గ్రహం ఎటు వైపు వుండాలో అటువైపు ఆ గ్రహం మండపం లో కొలువై వుండి  పూజలు అందుకుంటూ వుంటారు .

ముఖ ద్వారం లోంచి లోపలి రాగానే ఎదురుగా చక్ర పుష్కరిణి వుంటుంది . దీన్ని విష్ణుమూర్తి తన చక్రం తో సృషించినట్లు చెప్తారు దానికి యెదురుగా వినాయకుని గుడి  వుంటుంది . యీ వినాయకుని కలంగమల్ కట్ఠ  వినాయకుడు అని అంటారు .

యీ కోవెల అమృత పుష్కరిణి మధ్యలో వున్నట్లు చెప్పబడింది . కాని యిప్పుడు యీ కోవెల చుట్టూ ఎటువంటి పుష్కరిణి కనబడదు .  కావేరి , కోలిదాం , వెన్నారు నదులు సంగమించిన పరమ పవిత్ర మైన ప్రదేశంగా పురాణాలలో చెప్పబడింది .

యిక్కడ మూలవిరాట్టు శివుడు ఆపత్సహాయేశ్వరుడు అనే పేరుతొ కొలువై వున్నాడు .

అమృతమంథనం జరుపుతున్నప్పుడు పుట్టిన హాలాహల ప్రభావంతో స్వర్గలోకం  , భులోకం  , పాతాళ లోకాలు కంపించి పోయేయి . పరమ శివుడు దేవతల కోరికని మన్నించి హాలాహలాన్ని మింగిన ప్రదేశం యిది అని అంటారు . తమిళం లో " ఆలం " అంటే విషం " కు(గు)డి " తాగటం అని అర్ధం . అందుకు యీ వూరికి ఆలంగుడి అనేపేరొచ్చింది . ఆపత్సమయంలో యీశ్వరుడు ఆదుకున్నాడు కాబట్టి యిక్కడ యీశ్వరునికి ఆపత్సహాయేశ్వరుడు అనే పేరొచ్చింది . యిది స్వయంభూ లింగం .

నవగ్రహ స్థలాలలో ముందుగా ములవిరాట్టుని దర్శించుకొని తరువాత అమ్మవారిని దర్శించు కున్న తరువాతే అక్కడ వున్న గ్రహాధిపతిని దర్శించుకోవాలి . యిక్కడ అమ్మవారిని ఉమామ్మై లేక శుక్రవార అమ్మ అని అంటారు . పేరులో ఉన్నట్లే యీ అమ్మ వారికి యిక్కడ శుక్రవారం నాడు పూజ చేస్తే ఉమాదేవి ప్రసన్న మౌతుందని యిక్కడి నమ్మకం . అందుకే స్తానికులు యీమెని " శుక్రవార అమ్మ " అనికూడా అంటారు . 

యీ కోవెల ముందు ఎవరు నిర్మించేరు అనేదానికి ఆధారాలు లేవు , కాని శుకుడు , విశ్వామిత్రుడు , అగస్యుడు మొదలయిన పురాణపురుషులు , ఆది శంకరాచార్యులు  యీ ఆపత్సహాయేశ్వరుడు ని పూజించి తరించేరని గ్రంధస్థం చెయ్యబడింది .

' గు ' అంటే చీకటిని 'రు' అంటే పోగొట్టేవాడు అని అర్ధం . బృహస్పతిని 'గురువు' అజ్ఞానంధకారాన్ని పోగొట్టే వాడు అని పిలుస్తారు .   ఆంగీరస మహామునికి అతని భార్య శ్రద్దకి బృహస్పతి జన్మించేడు . యితనికి శుభ , తార అని యిద్దరు భార్యలు .యీ గ్రహం అనుకూలంగా వుంటే విద్య , జ్ఞానం , విజయం , ఆధ్యాత్మికత వుంటాయని పెద్దలు చెప్తారు . యితని వాహనం ఏనుగు , యిష్థ మైన పువ్వు తామర పువ్వు , రంగు పసుపు , లోహం బంగారం , రత్నం జాతి పచ్చ ( సఫైర్) , నక్షత్రాలు పునర్వసు , విశాఖ , పూర్వాభాద్ర లకు అధిపతి .

యీ పుణ్య ప్రదేశాన్ని కాశి అరణ్యం , తిరుయేరుంపూలై అని కుడా అంటారు .

యీ కోవెల మహిమని తెలియ  జేసే కొన్ని కధలు ప్రచారం లో వున్నాయి . అవి 

  సుందరమూర్తి స్వామి అనే భక్తుడు ఆపత్సహాయేశ్వరుని దర్శించు కోడానికి కావేరి నదిని దాతే క్రమంలో వరదలో చిక్కుకు పోతాడు , యీశ్వరుడు పడవవానిగా వచ్చి సుందరమూర్తిని కావేరి ప్రవాహం నుంచి కాపాడేడుట . యీ కోవెలలో సుందరమూర్తి ధక్షిణామూర్తి ని దర్శించుకోగానే అతనికి జ్ఞానోపదేశం కలిగిందట .  

యీ కోవెలలో సుందరమూర్తి స్వామి విగ్రహం వుంది దాని పై మసూచి మచ్చలుంటాయి అందుకు యీ క్రింది కధ చెప్తారు .

తిరువారూర్ ని చోళరాజులు పరిపాలించే కాలం లో వో రాజు ( పేరు తెలీలేదు ) ఆలంగుడి కోవేలని దర్శించుకొని అక్కడ వున్న సుందరమూర్తి అందమైన విగ్రహాన్ని చూసి మనసు పడి తిరువారూర్ తీసుకొని వెళ్తాడు . ప్రధాన పూజారి తిరిగి విగ్రహాన్ని ఆలంగుడి తెచ్చేందుకు మారు వేషంలో తిరువారూర్ వెళ్లి సుందరమూర్తి విగ్రహాన్ని వస్త్రాలలో చుట్టి వుయ్యాలలో  తీసుకోని వస్తుండగా రాజబటులు తనిఖీ చేస్తూ వుంటే పూజారి తన బిడ్డకు మసూచి సోకిందని అందుకు బిడ్డను కప్పి అరణ్యం లోకి తీసుకొని పోతున్నానని చెప్తాడు . మసూచి ( స్మాల్ పాక్స్ ) అంటురోగం కాబట్టి రాజభటులు విగ్రహం వున్న ఉయ్యాలను తనిఖీ చెయ్యకుండా పంపించేస్తారు . పూజారి ఆలంగుడి కోవేలకి చేరిన తరువాత వస్త్రములు తొలగించి చూడగా విగ్రహానికి మసూచి మచ్చలు వుండటం చూచి ఆశ్చర్య పడతాడు . యిప్పటికి విగ్రహం పైన యీ మచ్చలు  చూడొచ్చు .

యీ కోవెల గురించిన మరో కధ

పూర్వం ముచుకంఠ చక్రవర్తి దగ్గర అముదాకరుడు మహా మంత్రి గా వుండేవాడుట , ఆతను పూనుకొని యీ కొవెల కట్టించి అనంతమైన పుణ్యం సంపాదించెనట , అది తెలుసుకున్న ముచుకంఠ చక్రవర్తి ఆ పుణ్యం లో సగం తనకు ధార పొయ్యమని కోరగా అముదాకరుడు అంగీకరించలేదు . ఆగ్రహించిన చక్రవర్తి మహామంత్రిని హతమారుస్తాడు . చక్రవర్తి ననే అహంకారంతో వున్న చక్రవర్తికి ప్రతీ రోజు యీ కోవెల లోంచి ' అముదాకరా ' అనే పిలుపు ప్రతిద్వనించేదిట , ఆ ప్రతిద్వనితో భయకంపితుడైన చక్రవర్తి ఆపత్సహాయేశ్వరుని శరణు వేడుకొని అతని భక్తుడుగా మారుతాడు , తరువాత ఆ  ధ్వనులు వినిపించలేదుట .

కలంగమల్ కట్థ వినాయకుని కధ

వినాయకుడు  యీ ప్రదేశంలో గజముఖాసురుడిని వధించెనట అందుకు యీ వినాయకుడిని కలంగమల్ కట్థ వినాయకుడు అని అంటారు యిక్కడ పార్వతీ దేవి శివుని వివాహం చేసుకోవాలనే సంకల్పం తో తపస్సునాచరించి శివుని మెప్పు పొందిందిట . అందుకని యిక్కడ పుణ్య స్త్రీ లు శుక్రవారము నాడు తమ మాంగల్యానికి వుండే పసుపు తాడును మార్చుకుంటే వారికి అఖండ సౌభాగ్యం కలుగుతుంది అని పార్వతీదేవి వరమిచ్చిందిట .

యీ కోవెల ప్రాంగణం లో యివి కాక , సప్తలింగాలు , వీరభద్రుడు , ముచుకంఠుడు , కాశీవిశ్వనాథుడు , విశాలాక్షి , కుమారస్వామి , తిరువక్కరసు , చంద్రుడు , సూర్యుడు మొదలయిన దేవతా మూర్తులు వున్నాయి .

పునర్వసు నక్షత్ర జాతకులు సంవత్సరానికి వోకసారైనా వచ్చి యీ కోవెల ప్రాంగణంలో కనీసం రెండు నుంచి మూడు గంటల పాటు గడపితే బృహస్పతి అనుగ్రహిస్తాడుట .

యిక్కడ ముఖ్యం గా జరిగే వుత్సవాలు

1) గురుగ్రహం గడి  మారినప్పుడు 2) చైత్ర పూర్ణిమ  3) తైపూసం 4) మహా మాఘి ( మాఘ పూర్ణిమ 5) ఫల్గుణ ఉత్తరం 6) రాతా యాత్ర 7) 1008 శంఖ తీర్ధ స్నానం 

యీ ఉత్సవాలు అత్యంత భక్తి  శ్రద్దలతో జరుపుకుంటారు .

యీ క్షేత్రం నీదమంగళం రైల్ స్టేషన్ నుంచి 7 కిమీ దూరంలోను ,  కుంభకోణం నుంచి మన్నార్ గుడి వెళ్ళే దారిలో  కుంభకోణం రైల్ స్టేషన్ నుంచి 17 కిమీ ల దూరంలో వుంది . యీ ప్రదేశం పచ్చని వరిపోలాలతోను , అరటి , కొబ్బరి , చెరకు పొలాలతోనూ ,పంట కాలువలతోను కొనసీమను తలపిస్తూ వుంటుంది . కుంభకోణం లో మన్నార్ గుడి బస్సు యెక్కితే వో అరగంటలో ఆలంగుడి  చేరుకోవచ్చు  . ఉత్సవాలు జరిగే రోజులలో కోవెల యిరవైనాలుగు గంటలు భక్తుల కొరకు తెరిచే వుంటుంది .

మరిన్ని శీర్షికలు
padyam - bhavam