'మిస్టర్ పెళ్ళి కొడుకు', 'భీమవరం బుల్లోడు' చిత్రాలు నిరాశపరచడంతో లోపమెక్కడుందో తెలుసుకుని, సరిదిద్దుకోడానికి బ్రేక్ తీసుకున్నాడు హీరో సునీల్. కమెడియన్గా కెరీర్ పీక్స్లో ఉన్నప్పుడు హీరోగా వచ్చిన అవకాశాల్ని సద్వినియోగం చేసుకున్న సునీల్, 'మర్యాదరామన్న', 'పూలరంగడు' చిత్రాలతో కమర్షియల్ హీరో అయిపోయాడు. ఈ హీరో ఇకపై కూడా అదే సక్సెస్ జోరు కొనసాగిస్తాడట. వంశీకృష్ణ ఆకెళ్ళ దర్శకత్వంలో ఒక సినిమా, 'జోష్' ఫేం వాసు వర్మ డైరెక్షన్లో ఇంకో సినిమా చేస్తున్నాడు సునీల్. ఈ రెండు చిత్రాలూ ఒకదాని తర్వాత ఒకటి వచ్చి ఘనవిజయం సాధిస్తాయని సునీల్ నమ్మకంతో ఉన్నాడు. వాసువర్మ సినిమాకి 'కృష్ణాష్టమి' అనే టైటిల్ పెట్టారు. వంశీకృష్ణ ఆకెళ్ళ దర్శకత్వంలో రానున్న సినిమా కోసం బాలీవుడ్ హీరోయిన్ ప్రాచీదేశాయ్ని సంప్రదించారట. ఆమె గ్రీన్ సిగ్నల్ కూడా చెప్పిందని సమాచారమ్. సునీల్ అంటే డాన్సులే డాన్సులు. ఆ డాన్సులు ఆశించే అభిమానులనీ, సునీల్ సినిమాలనుంచి కామెడీని ఆశించే అభిమానుల్నీ నిరాశపరచకుండా ఉండేలా సునీల్ తన రెండు కొత్త సినిమాల్నీ ప్లాన్ చేసుకున్నాడని సమాచారమ్. అలాగే, నెగెటివ్ యాంగిల్లో కామెడీ విలనిజం పండించాలనే కోరిక తీర్చుకోవడానికి కూడా ప్రయత్నిస్తున్నాడట సునీల్. దానికి తగ్గ కథ ఒకటి సునీల్ విన్నాడనీ, ఓ యువ దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తాడనీ గుసగుసలు వినిపిస్తున్నాయి తెలుగు సినీ పరిశ్రమలో. వివరాలు పూర్తిగా తెలియవలసి ఉంది.
|