Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
humour interview

ఈ సంచికలో >> శీర్షికలు >>

ఆది శంకరులవారి జన్మ స్థలం - కర్రా నాగలక్ష్మి

అనే మంత్రం పఠించగానే  ప్రతి హిందువుకి గుర్తు వచ్చేది జగద్గురు ఆది శంకరాచార్యులు మాత్రమే.ఏ మంత్రమైనా గురు ముఖత నేర్చుకోనక పోయినట్లయితే ఆ మంత్ర ఫలం దొరకదు అని మన పూర్వీకుల అభిప్రాయం. మంత్రాలు అంటే గాయత్రి మంత్రం దగ్గరనుంచి సహస్ర నామాలు సూక్తాలు మొదలయినవి అన్నీ  .కాని కలియుగములో సరియైన గురువులు లేకపోవడం వలన దైవస్మరణ చేయడం మానవులు మరచి పోతారని ఒక చిన్న సవరణ కుడా చేసేరు . అదే ముందు పూజలో కూర్చోగానే శంకరాచార్యుని  మనస్సు లో తలచుకొని పై మంత్రం చెప్పుకొని మిగతా పూజ గాని మంత్రం పారాయణ గాని చేసుకోవాలని. బౌద్ద , జైన , క్రైస్తవ , ముస్లిం , మతాలు ప్రాచుర్యం లో ఉండి హైదవమతం మరుగున పడుతున్న సమయంలో సాక్షాత్తు పరమశివుడు  హైందవ మతాన్ని రక్షించే ఉద్దేశంతో కేరళ లోని ఓ అగ్రహారంలో " శివ , గురు ఆర్యాంబ " దంపతులకు క్రీస్తు శకము 788 లో జన్మించేరు . తన యేడవ యేట తండ్రిన పోగొట్టుకొని ఎనిమిదవ  యేడు రాకముందే వేదాలను,ఉపనిషత్తులను వ్యాఖ్యానించ సాగేరు .అతని పదహారవ యేట  ఒకనాడు పూర్ణా  నదిలో స్నానం చేస్తున్న అతనిని మొసలి పట్టుకొనగా మృత్యువు ఆసన్నమైనది కావున సన్యసించుటకు అనుమతిని యిమ్మని తల్లిగారిని వేడుకొనగా  ఆమె అనుమతించెను . వెంటనే మొసలి శంకరుని విడిచిపెట్టెనట .         ముసలి తల్లిని బంధువుల సహాయమున విడిచిపెట్టి ,ఆమె శంకరా అని పిలిచినంతనే వస్తాననే వాగ్దానము చేసి కాశి కి వెళ్లిపోయేరు . అక్కడనుంచి బద్రినాధ్ లో స్వామిగోవిందపాద ఆచార్య దగ్గర సన్యాసం పుచ్చుకొని అనేక శాస్త్రాలు అభ్యసించి , అద్వైతమును బోధిస్తూ భాగవతం , వేదాలు , ఉపనిషత్తులను వ్యాఖ్యానిస్తూ తన తర్కశాస్త్రం తో ఎందరో పండితులను వోడించసాగేరు . అదే క్రమములో మండన మిశ్రుని ఓడించి, అతని భార్య భారతి వేసిన కామశాస్త్రమునకు సంభందించిన ప్రశ్నకు జవాబు కొరకై పరకాయ ప్రవేశ విద్య నుపయోగించుకొని ఆ ప్రశ్నకు కుడా సరియైన సమాధానము నిచ్చి ఆ పందెము నెగ్గెను. ఒప్పందము ప్రకారము మండన మిశ్రుడు శంకరాచార్యుని గురువుగా స్వీకరించి సన్యాసమును  స్వీకరించి సురేశ్వర ఆచార్యుడయ్యెను. మహా యిల్లాలైన భారతియును భర్తను అనుసరించెను. శంకరాచార్యులు శ్రింగేరిలో మొదటి పీఠమును స్థాపించి దానికి సురేశ్వర ఆచార్యుని పీఠాధిపతిని చేసెను. దుర్వాసుని శాపగ్రస్తులైన బ్రహ్మ , సరస్వతులే మండనమిశ్రుడు, భారతి అని యెరిగిన శంకర భగవద్పాదులు భారతీ దేవిని పూజించుకొనుటకై శారదాపీఠమ్ స్తాపించేరని చెప్తారు.  

తల్లి వయసు భారంతో నూతిలో నీరు తోడుకొనుటకు ఆశక్తురాలై , మూడు మైళ్ళ దూరంలో వున్న పూర్ణా నది వరకు నడువలేక శంకరుని ప్రార్ధించగా శంకరులవారు ప్రత్యక్షమై తన కాలితో పూర్ణా నదీ గమనాన్ని నిర్దేశిస్తూ తమ పెరటిలోనుంచి వెళ్ళునట్లు చేసేరట .కాలితో నదీ గమనాన్ని నిర్దేశించిన ప్రదేశం కావడంతో ఈ ఊరికి "కాలడి  (కాలు ఇడి )"అనే పేరు వచ్చింది. ఆ తరువాత శంకరాచార్యులు పూరి , ద్వారక , బదరి పీఠాలను , ద్వాదశ జ్యోతిర్లింగములను అష్టాదశ శక్తి పీఠాలను స్థాపించేరు . శంకరులు ఆర్యాంబ అవసాన దశలో వచ్చి ఆమెకు అంత్యక్రియ చేయుటకు నంభూద్రి  బ్రాహ్మణులు సన్యాసి అంత్యక్రియలు చెయ్యరాదని వ్యతిరేకించి సహాయ పడుటకు నిరాకరించగా , ఇద్దరు బ్రాహ్మణులు శంకరుల సహాయమై వచ్చి ఒకరు తలను వేరొకరు కాళ్ళను పట్టుకొని ఆమెను చితి పైన పెట్టి దహన సంస్కారమునకు అగ్ని దొరకనందున శంకరులు తన అరచేతులను మథించి అగ్నిని పుట్టించి దహన సంస్కారమును కావించేరు .శంకరులను వ్యతిరేకించిన కాలడి గ్రామము లోని నంబూద్రి వంశం నశించెనని , శంకరులకు సహాయపడిన రెండు బ్రాహ్మణ కుటుంబాల వంశజులు యిప్పటికినీ శంకరుల జన్మస్థల ప్రాకారంలోనే వుంటున్నారని పూజారులు చెప్పేరు . అలాగే శంకరులు కనక ధారా స్తోత్రం పఠించి బంగారు ఉసిరికల వర్షం యే యింట్లో కురిపించేరో ఆ వంశస్తులు యిప్పటికి అదే యింట్లో వుంటున్నారని ఆగ్రామం కాలడి కి ముప్పై కిలోమీటర్ల దూరంలో వుందని చెప్పేరు.
శంకరులు తన ముపైరెండవయేట జోషి అనే గ్రామం లో మఠం స్థాపించి (అదే నేటి జోషి మఠ్ )బదరి మీదుగా కేదార్ చేరుకొని అక్కడి శివలింగంలో ఐక్యంఅయ్యేరని భక్తుల నమ్మిక.

ఐతే ఇప్పుడు ఈకాలడి గ్రామం చిన్న పట్నంగా మారింది . కొచ్చిన్  -- శోరనుర్ రైలు మార్గంలో కాలడి రైలు స్టేషను వుంది . కొచ్చిన్ నుంచి సుమారు ఇరవై , ఇరవైరెండు కిలోమీటర్ల దూరంలో వుంది . కొచ్చిన్ నుంచి రాష్ట్రరోడ్డురవాణా వారి బస్సు సౌలభ్యం వుంది. కొచ్చిన్ ఎయిర్పోర్ట్ కి ఎనిమిది కిమీ. . దూరం . ఆటో వాళ్ళు  నూరు లేక నూటయిరవై రూపాయలు తీసుకుంటారు.

చూడవలసిన ప్రదేశాలు అన్ని ఒకే చోట ఉన్నాయి. సుస్వరాల వేద విద్యార్ధుల వేదోఛ్చారణ కి రకరకాలైన పక్షి కూతలు పక్క వాద్యాలు కాగా మన వీనులకి విందై మన మనస్సులకి ఆహ్లాదకరంగా ఉంటుంది.

ఇది ముఖ్య ద్వారం దీనికి ఒక వైపు కనకధార స్తోత్ర మహిమా రెండవ వైపు మొసలి శంకరులని పట్టుకొనడం చిత్రికరించబడి ఉన్నాయి 
నాలగాడుగులు ముందుకి వెళ్తే ఎదురుగా ముఖ్యద్వారం . ఎడమ వైపు వేదపాఠశాల కుడి వైపు కృష్ణ మందిరం దాని పక్కనే వేద విద్యార్ధుల వసతి గదులు ఇంకా కొంచం ముందుకి వెళితే మెట్లు పూర్ణా నది స్నాన ఘాట్ . నిర్మలంగా నిశ్చలంగా కొబ్బరి మామిడి వనాల మధ్య నుంచి ప్రవహిస్తున్న పూర్ణా నది కనులకు విందు చేస్తుంది . మనసుకి సేద దీరుస్తుంది.

ఇది పూర్ణా నది
అక్కడ నుంచి వెనక్కి వచ్చి ముఖ్య ద్వారం లోపల ప్రవేశిస్తే ఎడమ వైపు అష్టదళ పద్మం ఆకారంలో శారదా దేవి మందిరం చుట్టూ అమ్మవారి యొక్క అవతారాలైన మహేశ్వరీ , కౌమారి , వైష్ణవి , వారాహి , ఇంద్రాణి మరియు చాముండా దేవిలు వుండగా శారదాదేవి బ్రాహ్మి గా యిక్కడ పూజలందు కుంటోంది . రోజూ దేవికి కుంకుమార్చన శంకరుల కాలం నాటి నుంచి జరుగుతోంది . నిత్య అన్నదానం జరుగు తోంది . ఆ పక్కనే ఒక దీపస్థంభం ఉంది అదే శంకరుల జన్మించిన స్థలమని  కోవెల పుజారి చెప్పేరు. ఆ స్థంభానికి ఎదురుగా వున్న బృందావనమే ఆర్యాంబ పార్ధివ శరీరమునకు చితి పెట్టిన స్థలం. ఆ పక్కనే హోమకుండం . ముఖ్య మైన పర్వ దినాలలోను నవరాత్రులలోను హోమం జరుపుతారుట . వైశాఖ శుక్ల తదియనాడు 36 మంది ఋత్వికులతో వెయ్యియెనిమిది మార్లు కనకధార స్తోత్ర పఠన  జరుగుతుంది . ఆ పూజకై వుపయోగించిన బంగారు , వెండి అమలకములు ( ఉసిరిక) , కనకధారా యంత్రములను భక్తులకు విక్రయించడం జరుగు తోంది. బృందావనానికి ఎదురుగా సాక్షి గణపతి మందిరం వుంది వినాయక చవితికి , సంకష్ట చతుర్దశికి  గణపతి హోమం కుడుములతో జరుగుతుంది . సాక్షి గణపతి కోవేలకి ఎడమ వైపున అంటే శారదాదేవి కోవెలకి యెడమ వైపున  షోడశదళ పద్మం ఆకారంలో శంకరులవారి మందిరం ఉంది. అక్కడ ఓ అరగంట సేపు కూర్చొని నాకు వచ్చిన అన్ని స్తోత్రాలు చదువుకొని ప్రశాంతమైన మనస్సుతో ఆప్రదేశాన్ని విడిచి పెట్టి రాలేక రాక తప్పక బయటికి వచ్చేం .

ఇది కృష్ణ మందిరం

బయట నున్న కృష్ణుని కోవెలలో renovation పని జరుగు తోంది . ఆ కృష్ణుని విగ్రహం గురువాయుర్ మందిరం లో ఉన్న విగ్రహాన్ని పోలి ఉంటుంది . తల్లి పూజ కోసమై కృష్ణ విగ్రహం కావాలని శంకరులని కోరగా శంకరులు తన స్వహస్తాలతో తయారు చేసి ప్రతిష్ఠించిన విగ్రహం యిది . ఇక్కడ నిత్యం పురుషసూక్త అర్చన మొదలైన పూజలు కృష్ణాష్టమి మెదలయి పర్వదినాలలో విశేష పూజలు జరుగు తన్నాయి .    కాలడి బస్సు స్టాండు కి ఎదురుగా పెద్ద స్తూపం ఉంది అందులో శంకరా చార్యులవారి జీవిత కధలని చిత్రాలలో పామరులకి కుడా అర్ధమయే తీరులో చిత్రికరించేరు . దాని పక్కనే సంస్కృత విద్యాపీఠమ్ ఉంది అందులో సంస్కృతం లో M.A వరుకు బోధన జరుగుతోంది.   భోజన సదుపాయాలు, రవాణా సౌకర్యాలు బాగున్నాయి . హిందువు అని చెప్పుకొనే ప్రతి ఒక్కరు ఈ ప్రదేశాన్ని దర్శించుకుని హిందూ మతాన్ని కనుమరుగై పోకుండా రెండు చేతులు అడ్డు పెట్టి కాపాడిన సాక్షాత్తు శిపస్వరూపమైన ఆదిగురువు  శంకర భగవద్పాదులకు మన కృతఙ్ఞతలు తెలుపుకునే బాధ్యత మనపైన వుంది .

మరిన్ని శీర్షికలు
Mulakkada Pulusu