'తెలుగు సినీ పరిశ్రమలో ఉన్నంత ఎక్కువమంది కమెడియన్లు ఇంకే భాషా సినీ రంగంలోనూ లేరు..' అని తెలుగు సినీ పరిశ్రమ మురిసిపోయేది. ఎంతమంది కమెడియన్లు ఉన్నా 'మేమంతా ఒకే కుటుంబం' అని చెప్పుకునేవారు తెలుగు సినీ కమెడియన్లు. ఆ ముచ్చట చూసి దేవుడికే కన్ను కుట్టిందేమో, తెలుగు సినీ కమెడియన్లపై కన్నేశాడు. మల్లికార్జునరావు, ఏవీఎస్, ధర్మవరపు సుబ్రమణ్యం తదితర ప్రముఖ కమెడియన్లు ఇటీవలి కాలంలో అకాలమరణం చెందారు. తాజాగా కొండవలస లక్ష్మణరావు హఠాన్మరణంతో తెలుగు సినీ పరిశ్రమ షాక్కి గురయ్యింది.
కల్లు చిదంబరం, ఆహుతి ప్రసాద్ లాంటి తారలూ నింగికేగడం తెలుగు సినీ పరిశ్రమకు తీరని లోటు. తెలుగు ప్రేక్షకులకు నవ్వులు పంచిన కమెడియన్లు, తమ కుటుంబ సభ్యుల్ని (తోటి కమెడియన్లు) కోల్పోయి కన్నీరు మున్నీరవుతున్నారు. అకాల మరణాలపై ఆవేదన చెందుతూ తెలుగు సినీ పరిశ్రమ యజ్ఞం కూడా చేపట్టింది. ఆ యజ్ఞం ఫలితాలనివ్వడంలేదా? దేవుడే కమెడియన్లను తన వద్దకు రప్పించుకుని, వారి హాస్యపు జల్లుల్లో తడిసి ముద్దవ్వాలని కుట్ర పన్నాడా? అర్థం కావడంలేదు. తనదైన టైమింగ్తో తెలుగు ప్రేక్షకుల్ని అలరించిన కొండవలస లక్ష్మణరావు, లేటు వయసులో స్టార్ అయ్యారు. ఆయన మరణం తెలుగు సినిమాకి పూడ్చలేని లోటు అనడం నిస్సందేహం.
|