Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
navvunalugu yugaalu

ఈ సంచికలో >> శీర్షికలు >>

హిమగిరి కైలాశ దర్శనం (రెండవ భాగం) - కర్రా నాగలక్ష్మి

ఖాట్మండు లోయలోని దర్శనీయ స్థలాలు


ఖాట్మండు లోని " త్రిభువన అంతర్రాష్ట్రీయ విమానాశ్రయం " నుంచి మా వసతి హోటలుకి చేరు కొనేసరికి పొద్దున్న తొమ్మిదిన్నర గంటలయింది . ఆ రోజు మా లోకల్ సైట్ సీయింగు ని వుపయోగించు కోవాలని మా టూరు గైడుకి చెప్తే అతను మాకు కారు ఏర్పాటు చేసేరు జూన్ మాసపు మొదటి వారం లో పగట పూట ఉష్ణోగ్రత సుమారు 18 డిగ్రీలు వుండంతో మేము వూలు బట్టలు కట్టుకోవలసిన అవసరం కలిగింది .

నేపాలు రాజధాని ఖాట్మండు నగరం గురించి కొన్ని పౌరాణిక , చారిత్రాత్మక వివరాలు తెలుసుకుందాం . శివపురాణం లోని కోటి ఋద్రసంహిత లో చెప్పిన ప్రకారం పశుపతినాథ్ మందిరం నయపాల నగరం లో వున్నట్లు చెప్పబడింది . నయపాల అనే పేరు కాలక్రమాన్ని నేపాల్ గా మారి వుండ వచ్చు . చారిత్రిక ఆధారాలకి ముందు యీ ప్రాంతాన్ని కుంతిపుర గా వ్యవహరించే వారు . మహాభారతం లోని కుంతికి యీ కుంతిపుర కి యేమాత్రమైనా సంబంధం వుందేమో అనడానికి నాకు ఆధారాలు దొరకలేదు . కుంతి అంటే లక్ష్మి అని పుర అంటే నివాసస్థలం అని అర్ధం . స్వయంభూ పురాణం ప్రకారం యీ లోయ పెద్ద సరస్సుగా వుండేది . మంజుశ్రీ అనే బోదిసత్వుడు సరస్సులోని నీటిని తన తపశ్శక్తి తో మాయం చేసి ఆ ప్రదేశంలో మహానగరం నిర్మించమని ఆ ప్రాంతపు రాజైన ధర్మాకరుని అజ్ఞాపించెనట . ధర్మాకరుడు ఆ ప్రాంతంలో అందమయిన పట్టణాన్ని నిర్మంచి దానికి మంజు పట్టణం అని పేరు పెట్టెనట .

   దర్బారా స్కేర్(రాచ కూడలి )
 
 ఇక చారిత్రాత్మక ఆధారాల ప్రకారం 1596లో మల్ల వంశానికి చెందిన లక్ష్మీనరసింహ మల్ల రాజు మొత్తం కఱ్ర తో యెక్కడా లోహం వుపయోగించ కుండా  ( మేకులు మొదలయినవి ) పెద్ద కోవెల నిర్మించేడు . దానిని ఖాఠ్ మండపం అని పిలిచేవారు . కాలక్రమేణా అది ఖాట్మండు గామారింది .


మా టూరు లో  ముందుగా మమ్మల్ని దర్బార్ స్కేర్ ( రాచకూడలి) కి తీసుకు వెళ్ళేరు . అక్కడ వున్న రెండంతస్తుల కఱ్ర మండపం కనువిందు చేసింది . రాజభవనానికి ప్రవేశద్వారం దత్తాత్రేయ కూడలి నుంచి దర్బారు కూడలికి మార్చేరు . ఆ వూరికి ఖాట్మండుగా పేరుతెచ్చిన కఱ్ర మండపం అదే . ఆ కఱ్ర మండపం
 యెంతో ముద్దుగా కనిపించంది . రెండంతస్తుల ఆ కట్టడానికి ఒకే మాను నుంచి తీసిన కలపను వుపయోగించేరని తెలియగానే ఆ మాను యెంత పెద్దదో మా వూహకు అందలేదు . నేపాలు రాజు భీరేంద్ర పరిపాలనలో వుండగా అంటే2000సం.. లో మేము నేపాలు వచ్చము . తరువాత
 నేపాలుకు పన్నెండు సంవత్సరాల తరువాత వచ్చేము .అప్పటి యిప్పటి పరిస్తితులను అంచనా వేస్తే ఆ దేశపు అభివృద్ధి రాజు భీరేంద్ర మరణానంతరం ఆగిపోయిందని అనిపించింది . దేశంలో రాజకీయ పరిస్తితులు అస్తవ్య
స్తంగా వుంటే దేశం ఆర్థికంగా యెంత వెనుక బడుతుందో అనడానికి మన పొరుగు రాజ్యమైన నేపాలే వుదాహరణ .

ఆరేడు శతాబ్దాలుగా అన్ని 
రకాలయిన వాతావరణ ఒడిదుడుకులకు తట్టుకొని నిలబడ్డ కఱ్ర మండపం , యింకా చుట్టుపక్కల వున్న మరికొన్ని భవనాలు 2015 ఏప్రెల్ 26 న సంభవించిన భూకంపానికి తట్టుకోలేక నేల కూలాయు అనే విషయం మాకే కాదు యీ మండపాన్ని సందర్శించుకున్న ప్రతీ ఒక్కరికి జర్ణించుకోలేని విషయం . ఈ మంటపానికి పక్కగా వున్న హనుమను ఢక్క అనే మందిరాన్ని చూసుకొని పశుపతినాథ్ మందిరం వైపుకి మాప్రయాణం సాగించేము .రాజ వీధి లోంచి ప్రయాణించి హైవే మీదకు చేరడానికి వుపయోగించిన ోడ్డు యెక్కడా వుందో తెలీని పరిస్థతి . రాజ వీధి తప్ప నేపాలులో రోడ్డ్స అన్నీ గోతులు , గొప్పులే . ఓ ఆరేడు కిలోమీటర్ల ప్రయాణం నలభై నుంచి గంట పట్టిందంటే రోడ్ల పరిస్తితి ఆలోచించండి .కారు దిగి కోవెల వరుకు వున్న ఆ కాస్త దూరం నడిచే లోపల రుద్రాక్షలు అమ్మేవారు , పూజాసామగ్రి కొనమని వెనుక బడేవారు చాలా యిబ్బంది పెట్టేరు . మేము ముందుగా దైవదర్శనానికే ప్రాధాన్యత యివ్వాలని కైలాశ శిఖర దర్శనానంతరమే రుద్రాక్షలు మొదలయినవి కొనాలని నిర్ణయించు కోవడంతో తిన్నగా కోవెల ద్వారంలోకి ప్రవేశించాం .
 
పశుపతినాథ్ మందిర పడమటి ద్వారం నందిని కూడా చూడొచ్చు .


శివుని పవిత్రనివాస స్థలాలు గా చెప్పబడే 275 పాతాళ పేత్ర స్థలాలలో ఒకటైన   పశుపతినాథ్ కోవెల భాగమతీ నదీ తీరాన 264 హెక్టార్ల విస్తీర్ణం గలగిన పెద్ద మందిర ప్రాంగణం . యిందులో 518 చిన్న పెద్ద శైవ , వైష్ణవ మందిరాలు  , మందిరాన్ని శతృవుల భారి నుండి కాపాడేందుకు నియమింప బడ్డ పోలీసు వారి నివాసాలను కలిగివుంది . లోపలఅంతా రాతి పలకలు పరచబడి న నేల , రాతి మెట్ల తో పెద్ద నీరులేని తటాకాన్ని కూడా చూడొచ్చు . ఈ ప్రాంగణానికి నాలుగు వైపులా ద్వారాలు వున్నా భద్రతాదృష్ట్యా మూడుద్వారాలు మూసివేసేరు  పడమట ద్వారానికి యెదురుగా పెద్ద కంచు నంది వుంటుంది . వాసుకి మందిరం , ఉన్మత్త భైరవ మందిరం , సూర్యనారాయణ మందిరం , కీర్తి ముఖ భైరవ మందిరం , బూఢా నీలకంఠ మందిరం , హనుమాన్ మందిరం , 184 శివలింగాల మందిరం ముఖ్యంగా చూడ తగ్గవి . 

పశుపతి నాథ్ కోవెల స్థానికుల నమ్మకాలననుసరించి పగోడా ఆకారం లో కట్టబడింది .రెండంతస్తుల ఈ నిర్మాణంలో కూడా కఱ్ర నే వుపయోగంచడం విశేషం . గోపురం పైభాగం రాగి తో మలచబడి తరువాత బంగారు పూత చేయబడింది . హిమపాతం జరిగే ప్రాంతాలలో యిప్పటి వరకు మేము చూసిన మందిరాల శిఖరాలు ఒకే మాదిరిగా కలప తో నిర్మించడం గమనించేము . ఈ కోవెల చతురశ్రాకారంలో వుండి యిరవైమూడు మీటర్ల యేడు సెంటీమీటర్ల యెత్తు కలిగివుంది . ఈ కోవెల 15 వ శతాబ్దం లో లిచ్చవి వంశానికి చెందిన సుపుష్ప రాజు అంతకు ముందున్న అయిదంతస్తుల లింగాకార కట్టడాన్ని చెదలు పాడు చెయ్యడం వల్ల  యిప్పుడున్న కోవెలని కట్టించేడు . నేపాలి గ్రంధాలయిన మహాత్మాయ , హిమఖండాల ప్రకారం క్రీస్తు శకం 400 సం.. నుంచి యీ కోవెల లింగాకారంలో వుండి పశుపతినాథ్  గా పిలువ బడుతోందని తెలుస్తోంది . ఈ కోవెల పదవ శతాబ్దంలో కూడా పునఃనిర్మించి నట్లు ఆధారాలు వున్నాయి . 
 
ముఖ్య ద్వారం లోంచి లోపలకి వెడితే విశాలంగా వుండే మండపం అక్కడ మరోద్వారం , అక్కడ నుంచే పశుపతినాథుని దర్శించుకోవాలి . ఈ కోవెలలో పూజారికి తప్ప వేరెవరికి గర్భగుడి లోకి ప్రవేశం లేదు . లోపలి గర్భగుడి కి నాలుగు వైపులా నాలుగు తలుపులు . వీటిని హారతి సమయానికి మాత్రమే తెరచి , ఆ సమయంలో అక్కడ వున్న వారికి నాలుగు ద్వారాల లోంచి పశుపతినాథుని నాలుగు నిజ ముఖాలను దర్శించు కొనే అవకాశం కలుగ జేస్తారు . ప్రతి ముఖానికి రెండు చేతులు , ఒక చేతిలో రుద్రాక్షమాల , రెండవ చేతిలో కమండలము వుండడం కూడా చూడొచ్చు . నిజ ముఖాలు అని యెందుకు అన్నానంటే హారతి తరవాత శివలింగానికి వెండి కవచం , వెండి పామును అలంకరిస్తారు . ముఖద్వారం మాత్రమే తెరచి వుంచుతారు . ఈ కోవెల పొద్దున్న 4 గం.. నుంచి రాత్రి 7 గం.. వరకు తెరిచే వుంటుంది కాని గర్భ గుడి పొద్దున్న 4 నుంచి మధ్యాహ్నం 12 వరకు తిరిగి సాయంత్రం 4 నుంచి రాత్రి 7 వరకు తీసి వుంచుతారు . విదేశీయులకు , అన్యమతస్తులకు $10 ప్రవేశ రుసుము వసూలు చేస్తారు , వారికి గర్భగుడిలోకి ప్రవేశం లేదు .

పశుపతినాథుని కనిపించే నాలుగు ముఖాలు కాక ఐదో ముఖం శివలింగానికి కింద వైపున వుందని అంటారు . ఈ అయిదు ముఖాలు శివుని యొక్క అయిదు గుణాలయిన సద్యోజాతం , వామదేవం , తత్పురుషం , అఘోరం , ఈశాణాలకి ప్రతీకలు . అలాగే పంచ తత్వాలు (అగ్ని , భూమి , వాయు , జల , ఆకాశ ) కలిగి వున్న యేకైక శివలింగం కూడా యిదే . ద్వాదశ జ్యోతిర్లింగాలు శివునియొక్క శరీరభాగాలుగాను పశుపతినాథ్ ని శిరస్సు గానూ శివపురాణం లో వర్ణించడ బడింది . ద్వాపరయుగం లో మహాభారతానంతరము యెద్దురూపంలో పాండవుల నుంచి తప్పించుకు పారిపోతున్న శివుణ్ణి పట్టుకొనే  ప్రయత్నం లో భీముడు యెద్దు వెనుక కాళ్ళను పట్టుకొని అపాలని ప్రయత్నించగా భీముడు ప్రహార ధాటికి యెద్దు అయిదు ముక్కలు గావింప బడింది . యెద్దు యొక్క శరీరభాగాలు పడ్డ ప్రదేశాలు పంచకేదారాలు కాగా శిరశ్శు భాగం పశుపతినాథ్ లో పడింది అని కూడా శివపురాణం లో వుంది .

 కోవెల ప్రాంగణం

 పశుపతినాథుని నిత్య పూజల కొరకు భట్ వంశస్థులు , ఆది శంకరాచార్యులచే మొదటగా నియమింప బడ్డారు . వీరు కర్నాటక కి చెందినవారు . ఐతే యిది వంశపారంపర్యం కాదు . అవసరాన్ని బట్టి శృంగేరి మఠం లో ఋగ్వేదం , కాశీ లో పాశుపత యోగం , హరిద్వార్ లో శివఆగమ సామవేదం అభ్యసించిన వారిని పరీక్షించి నియమించడం జరుగుతుంది . భట్ లకు మాత్రమే శివలింగాన్ని తాకే హక్కు వుంటుంది . బండారీలు సుక్షత్రియులు , వీరు కోవెల కు నిత్యపూజాది కార్యక్రమాలకు కావలసిన సరకులను యేర్పాటు చేయుట మొదలయిన పనులు నిర్వర్తిస్తారు . వీరికి శివలింగాన్ని తాకే అర్హత లేదు . వీరు భట్ లకు సహాయకులుగా మాత్రమే వుంటారు . 2009 వ సంవత్సరంలో అప్పటి నేపాలు ప్రభుత్వం యీ పరంపరని కాదని నేపాలీ బ్రాహ్మణుల ను పూజారులుగా నియమించగా సాంప్రదాయక బ్రాహ్మణ సముదాయము నేపాలు ప్రభుత్వం పై కోర్టు లో కేసు వెయ్యగా కోర్టు ప్రభుత్వపు నియామకం చెల్లదని తీర్పు నిచ్చెను , ప్రభుత్వం ఆ తీర్పును అమలు పరచలేదు . బ్రాహ్మణ సముదాయము వారు ప్రజలు చేసిన సమ్మెల ఫలితంగా ప్రభుత్వానికి దిగిరాక తప్పలేదు . 

 ఈ కోవెలని గురించిన రెండు కథలు స్థల పురాణం గా యిక్కడి పూజారులు చెప్పేరు .మొదటిది 

 ఒక నాడు కైలాశవాసుడు వ్యాహ్యాళికై యీ ప్రదేశానికి వచ్చి , యీ ప్రదేశం యెంతో నచ్చడంతో అక్కడే వుండ దలచి అడవి దుప్పి ఆకారంలో తిరుగాడ సాగెను . కైలాశం లో శివుని కానక పార్వతి ఆందోళన చెంది మిగతా దేవీ దేవతలతో శివుని వెతుక సాగెను . దేవతలు యీ లోయలో అడవి దుప్పి రూపం లో వున్న శివుని కనుగొని అక్కిడకి వస్తారు . వారిని తప్పించుకు దుప్పి పారి పోతూ వుంటే దేవతలు వారింపజూస్తారు . అప్పుడు దేవతల చేతిలో దుప్పి కొమ్ము చిక్కి విరుగుతుంది . దేవతల స్పర్శ వల్ల శివుడు నిజరూపం లోకి వచ్చి దేవతల కోరిక మీద కైలాశానికి మరలుతాడు . ఆ కొమునే దేవీ దేవతలు , ఋషులు, మునులు శివునిగా పూజిస్తూ వుంటారు . యుగాలు మారి కలియుగ ప్రవేశంతో ఆ కొమ్ము మన్ను లో కప్ప బడి ఒక గొల్ల వానికి దొరుకు తుంది . ఆ కొమ్మును తాకగానే ఆ సామన్యుడు శివుని యొక్క మహిమలు చెప్పసాగేడు . అతను ఆ కొమ్ము పైన శివలింగాన్ని నిర్మంచి పూజింపసాగెను . అడవి దుప్పి కొమ్ము లో దర్శనం యివ్వటం వలన శివుడు పశువుల రక్షకుడిగా అవతరించెనని అతనికి పశుపతి నాథుడు అనిపిలువసాగెను . ఆది శంకరాచార్యుల వారు పశుపతి నాథుని దర్శించుకొని పశుపతి నాథుని  గురించి శివపురాణం మొదలయిన పురాణాలలో యీవివరణ వున్నట్లు దృవీకరించేరు .

 రెండవ కథ ప్రకారం శివుడూ పార్వతీ యుద్దరూ కూడా యీ ప్రదేశంలో జింకల రూపంలో చాలా కాలం వేడుకగా గడిపి తిరిగి కైలాశానికి మరలినప్పుడు ఆ ప్రదేశంలో తాను తిరుగాడిన దానికి గుర్తుగా స్వయంభూ గా వెలసి పశుపతినాథుడయ్యేడు . కలికాలంలో మోక్షప్రాప్తికి యాగాలు , క్రతువులు లేనందున పశుపతినాథుని దర్శించుకున్న మానవులకు మరేజన్మమందు పశువు జన్మపొందరని వరం ప్రసాదించి కైలాశానికి వెళ్ళిపోయెను .

మేము మందిరానికి చేరేసరికి 11-30 గం.. అవడంతో నిజదర్శనం కాలేదు . కాస్త నిరాశకు లోనయేం . 2000 సం..లో మేము మకరసంక్రాంతికి అక్కడ వున్నాం . అప్పుడు నిజరూప దర్శనం చేసుకున్నాము . సాయంత్రం నాలుగు గంటలకల్లా వచ్చి హారతి దర్శనం చేసుకున్నాము . రెండో సారి కోవెలని వెళ్ళడానికి మా టూరు లో లేనందున ఆ ఖర్చు వేరుగా పెట్టుకున్నాము .

ముఖ్యంగా యీ కోవెలలో మకరసంక్రాంతి , దసరా నవరాత్రులు , దీపావళి పండుగలు విశేషంగా జరుపుతారు .  నేపాలు లోని మిగతా దర్శనీయ స్థలాల గురించి వచ్చే సంచికలో చదువుదాం అంత వరకు శలవు.
మరిన్ని శీర్షికలు
book review