Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
avee - ivee

ఈ సంచికలో >> శీర్షికలు >>

వాస్తు-వాస్తవాలు - సూర్యదేవరవేణుగోపాల్. M.A(జ్యోతీష్యం)

 

విష్ణు ఆలయాలకు వెనుక భాగంలో, శివుని ఆలయానికి ఎదురుగా మరియు దేవి ఆలయాలకు పార్శ్వ భాగంలో ఉన్న స్థలాలు మంచివి కావు. ఇటువంటి స్థలంలో గృహాన్ని నిర్మించి నివశిస్తే అనేక నష్టాలు ఏర్పడి జీవితంలో అభివృద్ది ఉండదు. కాబట్టి ఇటువంటి స్థలాలను వదలివేయుట మంచిది. కానీ నేటి పరిస్థితులలో ఈ విధంగా వదలివేయుట చాలా కష్టం. కనుక  వీటి ఛాయ పడిన మేరకు స్థలంను వదలి మిగిలిన స్థలంలో గృహం నిర్మించుకోవచ్చును.ఈ క్రింది శ్లోకం పరిశీలించండి……..

శివదృష్టి,ర్విష్ణుపృష్టంచ, దుర్గాయా పార్శ్వతో దృశమ్
విఘ్నేశ స్యోర్ద్వ దృష్టించ, తీక్షణ మాహు ర్మనీషీణా

 “భృగు మహర్షి “

శివాలయానికి ఎదురుగా ఉండే ఇంటికి శివ దృష్టి వేధ కలుగుతుంది. విష్ణు ఆలయాలకు వెనుక భాగంలో ఉండే గృహానికి విష్ణు వేధ కలుగుతుంది. విఘ్నేశునుకి  ఉర్ద్వ దృష్టి ఉంటుందని భృగు మహర్షి వివరించారు. ఎత్తుగా ఉండే నిర్మాణాలకు సమీపంలో గణేశ్ ఆలయం ఉంటే గణపతి వేధ  కలుగుతుంది. ఆలయప్రహరికి ఇంటికి మధ్య  కనీసం 18 నుండి 20 అడుగుల  వెడల్పుతో రోడ్ తీసి మిగిలిన  స్థలంలో ఇంటిని నిర్మిస్తే దేవతా వేధలు ఉండవు. కనుక ఆలయాల సమీపంలో ఇంటిని నిర్మించేటప్పుడు ఈ జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి . ఈ నియమాలన్నీ మానవుని ప్రశాంతతకు కోసం రూపొందించబడినాయి. ఆలయాలకు దగ్గరగా ఉంటే జన సమ్మర్ధం ఎక్కువుగా ఉంటుంది. ప్రశాంతతకు భంగం ఉంటుంది. అందుకనే ఇటువంటి నియమాలు రూపొందించబడినాయి. గృహంలో జరిగే కార్యక్రమం వేరు ఆలయంలో ఉండే కార్యక్రమం వేరు. గృహాలలో జరిగే శుభ, అశుభ కార్యక్రమాల వల్ల ఆలయంలోని దేవునికి, ఇంకా ఆలయం ను సందర్శించే భక్తులకు మైల, ఇతర సమస్యలు రాకుండా వుండడానికే ఆలయాలకు దూరంగా ఉండాలని  వాస్తు చెపుతుంది


స్థలాలు కొనే ముందు స్థలం ఎక్కడ ఉన్నదో జాగ్రత్తగా పరిశీలించాలి. నైసర్గిక వాస్తు చాలా ముఖ్యమైనది. మన స్థలంలో  ఎటువంటి మార్పునైనా చేసుకోగలం. కానీ మన చుట్టూ ఉన్న పరిసరాలను మార్చలేము. కనుక నైసర్గిక వాస్తును గమనించాలి. పరిశ్రమలు, పెద్ద నిర్మాణాల విషయంలో మరీ జాగ్రత్త అవసరం. ఎందుకంటే స్థలనిర్ణయంలో పొరపాట్లు జరిగితే పరిశ్రమలు దానిపై ఆధారపడి జీవించేవారు తీవ్రంగా నష్టపోతారు. శుభాలను కలిగించే దిశలు బలంగా ఉన్న స్థలాలను ఎంచుకోవాలి. నష్టాలు కలిగించే దిశలు బలహీనంగా ఉండే స్థలంలో ఇటువంటి నిర్మాణం చేయాలి. శుభాలను ప్రసాదించే తూర్పు ఉత్తరం ఈశాన్య భాగాలు పల్లంగా ఉండి  దక్షిణం,పశ్చిమం ప్రాంతాలు మెరకగా ఉన్న స్థలాలో పరిశ్రమలు నిర్మించాలి. ఇటువంటి స్థలాలకు తూర్పు,ఉత్తరం, ఈశాన్య ప్రాంతాలలో నదులు, నీటి ప్రవాహం ఉంటే బాగా రాణిస్తాయి. పరిశ్రమలు స్థాపించేటప్పుడు దక్షిణ,పశ్చిమ నైరుతి దిక్కులలో ఎత్తైన పర్వతాలు, నిర్మాణాలు ఉన్న స్థలాలను ఎంచుకోవాలి.

శ్మశానాలు ప్రక్కన ఉన్న స్థలం మంచిదికాదు. ఇటువంటి స్థలంలో నివశిస్తే మానసిక ఆందోళనలు, సమస్యలు వస్తాయని వాస్తు ఈ విధంగా నిర్దేశిస్తుంది. ఇంకా నది తో కోత పడిన స్థలం, పిడుగులు పడిన స్థలం, కుళ్లిన జంతు కళేబరాలు ఉంచే స్థలం, ఊడలు దిగిన వృక్షం ఉన్న స్థలం, కొండ యొక్క పాదం దగ్గర ఉండే స్థలం, కొలిమి పెట్టిన స్థలం, గానుగా సున్నం ఆడించిన స్థలం, విపరీతమైన రద్దీ,  జనసమ్మర్ధం ఉండే స్థలం, పుట్టలు,బొరియలతో నిండి ఉన్న స్థలం  మంచివి కావని వాస్తు చెపుతుంది. ఈ ఆదేశాలన్నీ మనిషి రక్షణ కోసం చెప్పబడినవి. కనుక యధాతధంగా కాకపోయిన, వీటిలో కొన్నిటి నైనా పాటించుట మంచిది.కొత్త స్థలం కొనే ముందు వర్గు ను కూడా పాటించితే మంచి ఫలితాలు ఉంటాయి.

ప్రస్తుత పరిస్థితులలో ఇన్ని వాస్తు నియమాలు పాటించడం కష్టం. కనుక ముఖ్యమైన వాస్తు నియమాలలో రాజీ పడకుండా స్థలంను ఎంపిక చేసుకోవచ్చు. కొన్నివాస్తు దోషాలు స్థలంలో ఉన్నాయి అని భావిస్తే అటువంటి స్థలంలో కనుక నిర్మాణం చేయవలసి వస్తే గృహ నిర్మాణానికి ముందే ఆ స్థలాన్ని దున్నించి నవధాన్యాలు వేయాలి. ఇంకా అటువంటి స్థలంలో కనీసం మండలం రోజుల పాటు ఆవులను ఉంచాలి. దోషాలు తొలగిపోతాయి. ఎటువంటి స్థలం అయిన గృహస్తుకు చిత్త శాంతిని ప్రసాదించాలి. అటువంటి స్థలంలో గృహాన్ని నిర్మించుకోవాలి.  ఈ శ్లోకాన్ని గమనించండి.......

మనస చక్షుషో ర్యత్ర సంతోషో జాయతే భువి
తస్యాం కార్యం గృహం సర్వైరీతి గర్గాది సమ్మతం

“వసిష్ట సంహిత.”

యజమాని మనసుకు, చూపులకు ఏ భూమి సంతోషమును కలిగిస్తుందో ఆ స్థలలంలోనే ఇంటిని నిర్మించాలని గర్గాది మహర్షులు చెప్పారని దీని భావం. ఈ శ్లోకం కూడా గమనించండి...

మనోరమా చ యా భూమి పరిక్షేత ప్రయత్నత:
సర్వేషాం చైవ వర్ణానాం సమభూమి సుభావహా.

“విశ్వకర్మ ప్రకాశిక”

ఏ భూమి యజమానికి మనోహరంగా ఉంటుందో దానిని పరిక్షించి గృహాన్ని నిర్మించాలని, ఎత్తుపల్లాలు లేని శాస్త్ర దూష్యం కానీ స్థలంలో ఇల్లుకట్టాలని దీని భావం. కనుక ఏ స్థలం మనసుకు ప్రశాంతతను ఇస్తుందో అటువంటి స్థలం లోనే గృహనిర్మాణం చేయాలని మన మహర్షులు ఉపదేశించారు.

నేటి కాలంలో స్థలం కొనుక్కునే ఇల్లు కట్టలంటే విపరీతమైన ఖర్చుతో కూడిన పని. అన్ని వాస్తునియమాలు పాటించి స్థలం కోనాలంటే నేటి కాలంలో కొంచెం కష్టం. కనుక ప్రధానమైన వాటిని పాటించి చిన్న చిన్న దోషాలుంటే సవరించి స్థలం కొనుక్కొని ఇల్లు కట్టుకోవచ్చు. వాస్తు నియమాలన్నీ మనిషి కి ప్రశాంతతను మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించటానికి ఉద్దేశించబడినవి. వీటిని పాటించుట ద్వారా మంచి జీవితం ఉంటుంది.

మరిన్ని శీర్షికలు
Lipoma & Ayurvedic Treatment in Telugu | లైపోమా కొవ్వు గడ్డలు | Dr. Murali