Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
navvunalugu yugaalu

ఈ సంచికలో >> శీర్షికలు >>

సాహితీవనం - వనం వెంకట వరప్రసాద రావు

sahiteevanam
ఆముక్తమాల్యద

అన్నమాట ప్రకారం తన శరీరాన్ని ఆహారంగా   
సమర్పించడానికి  బ్రహ్మరాక్షసుడి వద్దకు తిరిగి వచ్చాడు మహాభక్తుడు, సత్యవ్రత నిష్ఠుడు అయిన మాలదాసరి. ఆ రావడం కూడా దిగులుగా, భయంగా రాలేదు. సంతోషంతో కేరింతలు కొడుతూ వచ్చాడు.సరదాగా పరిహాసం చేస్తూ, వినోదిస్తున్నట్లు 'నన్ను తినేసి నీ ఆకలి తీర్చుకోవయ్యా' అని అన్నాడు.

అనినఁ దత్సత్యమునకు నేత్రాంబు లురలఁ  
బ్రమద పులకితగాత్రుఁడై పాఱు టసుర 
యినుని మధ్యందినపుటెండ తనదు పెద్ద 
బట్టతల మించఁ బ్లవు జేరఁ బాఱుతెంచి

మాలదాసరి అలా పలుకగానే ఆతని సత్యవ్రత పాలనకు ఆశ్చర్యము, ఆనందము కలిగి, శరీరము పులకలెత్తి, కనులవెంట ఆనందబాష్పాలు రాలుస్తూ, మధ్యాహ్నపు సూర్యుని ఎండ తన బట్టతల మీద పది తళతళ మెరుస్తుండగా, ఆ మాలదాసరిని పరుగెత్తుతూ సమీపించాడు బ్రహ్మరాక్షసుడు.కొండయుఁబోలె భక్తి వల గొంచునె  వాఁడునిజద్రుమభ్రమీ హిండన వ్రాలుపాకాలపు టేనుఁగుఁబోలె నొసల్తదంఘ్రులం దుండ రొదన్మహాగిరులు హోరనఁ బ్రస్తుతి వ్రాలి దంష్ట్రికా దండము లెత్తి పట్టినపదం బొకఁడొక్కఁడ నెత్తిఁ జేర్చుచున్మాలదాసరిని సమీపించి, ఒక పెద్ద కొండలాగా శరీరం కదిలిపోతుండగా భక్తితో ప్రదక్షిణలు చేశాడు. 'పాకలము' అనే రోగము వచ్చిన మదపుటేనుగు తనను కట్టి ఉంచిన చెట్టు చుట్టూ తిరిగి తిరిగి నేలకు వ్రాలినట్లు పెద్ద ధ్వనితో నేలమీద మాలదాసరి పాదాల వద్ద పడిపోయాడు. ఏనుగులకు మదం ఎక్కువై, మాడు పగిలిపోయే పాకలం అనే రోగం వస్తుందిట, ఈ బ్రహ్మరాక్షసుడికి కూడా మదం పట్టింది యింతవరకూ. వాడి తల తిరిగేలా, మాడు పగిలేలా ఈ ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది. దాంతో ఆ ఏనుగు లాగే పడిపోయాడు, చెట్టువంటి మాలదాసరి పాదాల చెంత.రాయలవారి లోకజ్ఞానానికి 'పాకలం' అనే రోగపు ప్రస్తావన ఒక చిహ్నము అయితే, చెట్టులాగే పరోపకారం కోసం సర్వస్వాన్నీ నిస్వార్ధంగా అందించే మహానుభావుడు ఆ మాలదాసరి అని పోల్చి చెప్పడం రాయలవారికి మాత్రమే చెల్లిన రసగుళిక.కొండలు 'హోరు'మనేట్లు బిగ్గరగా మాలదాసరిని పొగుడుతూ తన దండములవంటి దంతములను, కోరలను పైకెత్తి, తలపైకెత్తి, నీళ్ళు నిండిన కన్నులతో మాలదాసరిని చూస్తూ, ఆతని పాదాలను పట్టుకున్నాడు. ఒక్కొక్క పాదాన్నే మార్చి, మార్చి తన నెత్తిన పెట్టుకున్నాడు. 

ఈసర్వంసహ దేవదానవమహీ భృన్మౌనివాచాతప 
శ్శ్రీసర్వస్వము నేతదన్యకృతులం జెప్పంబడు న్ఘోర మా
నీసత్యం బురరీకృతాంత మిల నెం తే వృద్ధనై మంటి నే
నాసత్యం బిఁక నిన్నుఁబోలెఁ గృతసంధా ధూర్వహు ల్లేమికిన్ 

ఈ సమస్త విశ్వములోని దేవతలు, దానవులు, చక్రవర్తులు, మునులు, ఎవ్వరిలోనూ నీ సత్యవాక్యపాలనము అనే తపస్సు లేదు. వారిది కేవలం వాచాతపస్సు మాత్రమే,చెప్పుకోడానికి మాత్రమే అది తపస్సు. వారి సత్యవాక్య పాలనం యితర విషయాలలో మాత్రమే ఉంటుంది, ఒకవేళ ఉన్నా, గిన్నా! యిలా తమ శరీరాన్ని సమర్పించుకునే విషయములో ఉండదు. భయంకరమైన నీ సత్యపు పరిధులను అంగీకరించి తీరాల్సిందే, ఎవరైనా! ఎంతోకాలమునుండి ఉన్నాను నేను. ఎంత చూశాను, ఎందరిని చూశాను! నీలాగా ఆడిన మాటను నిలబెట్టుకున్నవారు లేరు. నేను ప్రమాణపూర్వకంగా చెబుతున్నాను.

ఇతరులు నీకు నీడె మఱి యీధృతి నీస్మృతి నీఋతేరిత
స్థితగతి నీమురారిపద సేవన జీవనవన్మతిన్ సమా
దృతకలగాన సింధు లహరీ ప్లవన ప్లవభావ భా గురు 
శృతి తతబద్ధతుంబికి గురుంగుడినంబికృపావలంబికిన్

ధైర్యములో, జ్ఞానములో, ఆడినమాటను నిలుపుకోవడంలో నీకు యితరులు ఎవరైనా సాటి ఉన్నారా, లేరు. మురారిపదసేవనసర్వస్వమైన జీవనంలో నీకు సాటి వచ్చేవారుఎవరైనా ఉన్నారా, లేరు. అత్యంత ఆదరంగా అవ్యక్తమధురమైన గానామృతంలోతేల్చే దివ్యమైన తంత్రుల 'సొరకాయబుర్ర'ను వీణగా చేసి, గానసుధలను ప్రవహించడంలో యితరులు ఎవరైనా నీకు సాటి ఉన్నారా, లేరు. శీలములో, బుద్ధిలో, భక్తిలో, సత్యములో,గానములో, ధైర్యములో నీకు ఎవరూ సాటిలేరు!అనిన

నాతనిఁ గౌఁగిట నునిచి పలికె
వ్రత మొనర్పించి తని భాగవతవతంస 
మోయి రజనీచరేంద్ర నీయురుకృపాక
టాక్షమునఁ జేసి ధన్యుఁడనైతి ననఘ

బ్రహ్మరాక్షసుడు చేస్తున్న ప్రస్తుతికి, ఆతని ఆదరానికి ఆనందించి ఆతడిని కౌగలించుకుని భాగవత శ్రేష్ఠుడైన ఆ మాలదాసరి కృతజ్ఞతలు తెలిపాడు! ఓ నిశాచర రాజా! ఎలాగైతేనేం,నా వ్రతాన్ని పూర్తిచేసుకోడానికి సహకరించావు. నీ కరుణచేత, నా వ్రతానికి ఆటంకం లేకుండా పోయింది. అనఘా! నీవలన నేను ధన్యుడిని అయ్యాను అన్నాడు మాలదాసరి.అనఘా అని సంబోధించాడు, అంటే పాపరహితుడా అని పిలిచాడు. నన్ను తినాలి అనుకోవడం పాపమేమీ కాదు, నీకు భగవంతుడు యిచ్చిన ఆహార విధానాన్నే నీవు పాటించడం పాపమేమీ కాదు, నన్ను నిశ్చింతగా తినేసేయ్ అని ధ్వనిగా అంటున్నాడు.బ్రహ్మరాక్షసుడి వ్యవహారం, ఆ మన్నన, ఆ ఆదరము, భక్తి, ప్రస్తుతి చేయడం అంతా చూస్తున్నాడు కనుక, 'నన్ను మన్నించి వెళ్ళిపో నాయనా!' అంటాడేమో, అలా అని వదిలిపెడితే 'నా వ్రతాన్ని చెల్లించుకుని వచ్చి నీకు ఆహారాన్ని అవుతాను' అని తను చేసిన వాగ్దానము నెరవేరకుండా పోతుందేమో అని లోలోపల భయం ప్రారంభం అయ్యిందన్నమాట మాలదాసరికి. అలా ధ్వనిగా సూచనచేయడమే మహాకవుల లక్షణం,మహాకవి శ్రీకృష్ణదేవరాయల పాత్రపోషణలోని విలక్షణం. అందుకే అంతటితో ఆగిపోలేదు

మాలదాసరి.బాసలు బండికండ్లు
మరి ప్రాణభయంబున లక్షసేసినం 
గ్రాసము గృఛ్రలబ్ధ ముడుగ న్వసమే యిది నీక చెల్లె నో 
భూసురవంశపుణ్యజన పుణ్యజనాంకము తావకీనమే 
పో సమకూరెడిం గులము పొత్తున దైత్యుల కెల్ల నంకతన్

బాసలూ, బండి కండ్లూ, అంతా డొల్ల. నా గొప్పేముందయ్యా? ప్రాణభయంతో లక్ష బాసలు చెయ్యొచ్చు, అది అంత ఘనమైన విషయం ఏమీ కాదు. ఎంతో ప్రయాసపడి సంపాదించుకున్న తిండిని వదిలిపెట్టడం గొప్ప! అదేమంత సామాన్యమైన విషయము కాదు, అది నీకే చెల్లింది. కనుక ప్రాణభయముతో ఏవేవో బాసలు చేసిన నాకన్నా,దొరికిన తిండిని వదిలిపెట్టడానికి పూనుకున్న నువ్వు గొప్పవాడివి. బ్రాహ్మణ వంశంలో జన్మించిన ఓ పుణ్యాత్ముడా, ఓ బ్రహ్మరాక్షసుడా! పుణ్యపు జన్మ అన్నది నీకే చెల్లింది.నీకులంలో పుట్టిన కారణంగా రాక్షసులందరూ పుణ్యాత్ములైపోయారు పో! కనుక పుణ్యాత్ముడివి, మహానుభావుడివి, త్యాగశీలివి నువ్వే, నేను కాదు అన్నాడు మాలదాసరి

.(కొనసాగింపు వచ్చేవారం)
***వనం వేంకట వరప్రసాదరావు.
మరిన్ని శీర్షికలు
himagiri kailasa darshanam 9th part