'పటాస్' సినిమాతో మాంచి సక్సెస్ అందుకున్న కళ్యాణ్ రామ్ 'షేర్' సినిమాతో మళ్లీ ఢీలా పడ్డాడు. దాంత తదుపరి చేయబోయే సినిమాని చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకున్నాడు. తాజాగా పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి ఒప్పుకున్నాడుట. కళ్యాణ్రామ్ కేవలం నటుడే కాదు, నిర్మాత కూడా. నిర్మాతగా ఎన్నో సాహసాలు చేశాడు. కొన్ని ఫెయిలయినా, నిర్మాతగా ప్రయత్నాలు మానలేదు. అయితే, పూరితో చేసే సినిమాలో కళ్యాణ్ రామ్ నటిస్తూ, నిర్మాణ బాధ్యతలు కూడా తీసుకోబోతున్నాడట. ఈ సినిమా ఏప్రిల్లో సెట్స్ మీదికెళ్లనుంది. ఇంతవరకూ తాను స్వీయ నిర్మాణం చేసుకున్న సినిమాలేమీ కళ్యాణ్రామ్ని నటుడిగా నిరాశపరచలేదట. కమర్షియల్ సక్సెస్ అనేది తన చేతుల్లో ఉండదంటాడు ఈ యంగ్ హీరో. కథ మీద ఎంతో నమ్మకం ఉండబట్టే, ఈ సినిమాకు తానే నిర్మాతగా వ్యవహరించాలని నిర్ణయించుకున్నాడట ఈ నందమూరి కుర్రాడు. ఈ ఏడాది నందమూరి వంశానికి అదృష్టం బాగానే కలిసి వచ్చింది. ఏడాది మొదట్లో వచ్చిన 'నాన్నకు ప్రేమతో', 'డిక్టేటర్' సినిమాలు విజయాన్ని అందుకున్నాయి. సాధారణంగా పూరీ సినిమా అంటే సెట్స్ మీదికెళ్లిందంటే చాలు, అతి తక్కువ టైంలోనే చిత్రీకరణ కంప్లీట్ చేసుకుంటుంది. అదే తరహాలో ఈ సినిమా కూడా వీలైనంత తొందర్లోనే ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే యోచనలో పూరీ ఉన్నట్లు సమాచారం.
|