ఎట్టకేలకు రేష్మీ ప్రధాన పాత్రలో నటించిన 'గుంటూర్ టాకీస్' సినిమా ట్రైలర్ విడుదలయ్యింది. ఈ సినిమా ట్రైలర్ను నందమూరి నటసింహం బాలకృష్ణ చేతుల మీదుగా విడుదల కావడం విశేషం. చిన్న సినిమాలను తానెప్పుడూ ప్రోత్సహిస్తానని బాలకృష్ణ ఈ సందర్భంగా తెలియజేశారు. 'చందమామ కథలు' సినిమాతో నేషనల్ అవార్డును అందుకున్న ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కబోతోంది. ఈ సినిమాలో మంచు లక్ష్మి, శ్రద్దాదాస్, సీనియర్ నరేష్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. సిద్ధు జొన్నగడ్డ రేష్మీకి జంటగా నటిస్తున్నాడు. 'గుంటూర్ టాకీస్' అనే టైటిల్ మాస్ ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాకుండా ఈ సినిమా కథ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటుందని డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు తెలిపారు. 'జబర్దస్త్' ప్రోగ్రాం ద్వారా బుల్లితెరపై యాంకర్గా మంచి పేరు తెచ్చుకుంది రేష్మీ. ఈ సినిమాతో వెండితెర ప్రేక్షకుల అభిమానాన్ని కూడా పొందాలని ఆశిస్తోంది. ఖచ్చితంగా ఈ సినిమా తనకు మంచి పేరు తెచ్చిపెడుతుందనీ, ఒక నటిగా గుర్తింపు తెచ్చుకునే విధంగా ఈ సినిమాలో తన పాత్ర ఉండబోతోందనీ చెబుతోంది రేష్మీ. బాలయ్య చిన్న సినిమా ఫంక్షన్కి రావడంతో, ఇది చిన్న సినిమాలా కాకుండా, చిన్న సినిమాల్లో పెద్ద సినిమాలా మారిపోయిందని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
|