కామెడీ హీరో సునీల్, యాక్షన్ హీరోగానూ సత్తా చాటుకునేందుకు సిక్స్ ప్యాక్ ఫిజిక్ సాధించాడు. అయితే మాస్ హీరోగా సునీల్ని నిలబెట్టే సక్సెస్ ఇంకా ఆయనకు అందలేదు. అయినప్పటికీ విభిన్న చిత్రాలు చేస్తూ హీరోగా తన ఇమేజ్ని నిలబెట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు ఒకప్పటి కమెడియన్, ప్రస్తుతం హీరోగా హల్చల్ చేస్తున్న సునీల్. విలక్షణ చిత్రాల దర్శకుడనిపించుకున్న క్రాంతి మాధవ్, సునీల్కి ఇటీవల ఓ కథ చెప్పాడట. అది సునీల్కి నచ్చడంతో వీరిద్దరి కాంబినేషన్లో సినిమా ఫైనల్ అయ్యింది. పరుచూరి కిరీటి ఈ చిత్రానికి నిర్మాత. త్వరలోనే ఈ చిత్రం సెట్స్పైకి వెళుతుందని సునీల్ చెప్పాడు. క్రాంతి మాధవ్ చెప్పిన కథ బాగా నచ్చిందనీ, సినిమాకి కమర్షియల్ హంగులూ ఉంటాయని, ప్రతి ఒక్కరూ మెచ్చేలా చిత్రం రూపొందుతుందని సునీల్ వివరించాడు. సునీల్ సరసన ఓ ప్రముఖ హీరోయిన్ ఈ చిత్రంలో నటించే అవకాశం ఉంది. 'ఓనమాలు', 'మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు' చిత్రాలకు దర్శకత్వం వహించాడు క్రాంతి మాధవ్. మంచి కథ, కథనాలు ఆ చిత్రాలకు సక్సెస్ని అందించాయి. ఆలోచింపజేసే కథా, కథనాలతో సినిమాలు చేయడం అతి తక్కువమందికే చెల్లుతుంది. ఆ కోవకే చెందుతాడు క్రాంతి మాధవ్. కమర్షియల్ అంశాలతోపాటు మెసేజ్ కూడా ఇచ్చేలా క్రాంతి మాధవ్ రూపొందిస్తున్న చిత్రంతో సునీల్ మంచి విజయం నమోదు చేయాలని ఆశిద్దాం.
|