బాలయ్య నటించబోయే వందో సినిమా కోసం అనేక కసరత్తులు చేస్తున్నాడు. ఈ సినిమా తనకు ఎంతో ప్రతిష్ఠాత్మకమైనది అని అందుకే కథ, కథనం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు బాలకృష్ణ. చివరికి క్రిష్ డైరెక్షన్లో గౌతమీ పుత్ర శాతకర్ణి జీవితం ఆధారంగా రూపొందుతున్న కథకు ఓకే చేశాడు. ఈ సినిమాలో బాలయ్య సరసన హీరోయిన్గా నయనతార, త్రిషలలో ఎవరో ఒకరిని ఎంచుకునే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో తల్లి పాత్రకు ప్రాధాన్యత ఉన్నందున ఆ పాత్రకు సరిపోయే సీనియర్ నటి కోసం ఎంపిక జరుగుతోంది. బాలీవుడ్ నటి హేమా మాలిని పేరు పరిశీలనలో ఉంది. అంతే కాదు మరో స్పెషల్ ఎట్రాక్షన్ ఈ సినిమాలో బాలయ్య కొడుకు మోక్షజ్ఞ ఒక ప్రత్యేక పాత్రలో కనిపించనున్నాడట. బాలయ్యకు వందో సినిమా, కొడుకు మోక్షజ్ఞకు మొదటి సినిమా కానుందట. 'కంచె' సినిమాతో విజయాన్ని అందుకుని జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన క్రిష్ ఈ హిస్టారికల్ సబ్జెక్ట్తో కూడా ఖచ్చితంగా విజయం సాధిస్తాడని ఇండస్ట్రీ వర్గాలు నమ్మకం వ్యక్తం చేస్తున్నాయి. ఈ సినిమా కోసమే బాలయ్య డిఫరెంట్ గెటప్ని ట్రై చేస్తున్నారు. ప్రత్యేక మీసకట్టుతో కనిపిస్తున్న బాలయ్య బహుశా ఈ చిత్రంలో ఇదే మీసకట్టు మెయిన్టెయిన్ చెయ్యొచ్చునట.
|