Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
mallelateerdham

ఈ సంచికలో >> శీర్షికలు >>

వాతావరణం - సూర్య తాపం . - హైమాశ్రీనివాస్,

vatavaranam -  suryatapam

సాధారణంగామనం వాతావరణం బావులేదనో, వాతావరణం వేడిగా ఐపోతునందనో అంటాం, ఈ వేసవికాలంలో  వాతావరణాన్ని గురించీ అనేకమార్లు అనుకుంటూనే ఉంటాం, అసలు వాతావరణం అంటేఏమిటీ? ఈ సూర్య తాపం ఇలా ఎందుకు ఉంటున్నదీ? ఈవేసవిలో గాలి ఎందుకు వేడెక్కిపోతున్నదీ? ఇదంతా కేవలం ఋతుప్రభావమేనా? మానవతప్పిదం ఏమన్నాఉందా? ఇలా ఎండ వేడి 40, 45 డిగ్రీలవరకూ ఇంకా పైనా పెరిగిపోటానికి కారణం ఏంటీ? అనుకుంటే అసలుఈ వాతావరణాన్ని గురించీ కొద్దిగా చెప్పుకుందాం.  

గాలి  భూగోళాన్నంతా ఆవరించి  ఉంది.ఈ గాలినే శాస్త్ర వేత్తలు వాతావరణం అంటారు.  ఈ వాతావరణం  భూమండలంపై 200 మైళ్ళ ఎత్తు వరకూ వ్యాపించి ఉంది. ఆ పైన ఆకాశం శూన్యంగా ఉంటుంది. వాతావరణంలో ఆక్సిజన్, నైట్రొజన్ ,ఆర్గాన్, నియాన్, అమోని యా, నీటి ఆవిరి ఇంకా అనేక  వాయువులు సూక్ష్మ రేణువుల రూపంలో  మిళితమై ఉంటాయి. వాతావరణాంలో నూటికి   78 వంతు లు  నత్రజని, 21 పాళ్ళు ప్రాణవాయువు ఉండగా ,నీటి ఆవిరి, బొగ్గుపులుసు వాయువు ఇంకా ఇతరవాయువులూ, ధూళికణాలూ, నూటికి ఒక్క వంతు మాత్రమే  ఉంటాయి. ఒక ఘనపు అంగుళం వాయువులో 300 బిలియన్  రేణువు లుంటాయి.బిలియన్ అంటే వందకోట్లు. వాతావరణం  భూమినుండీ దూసుకు పోకుండా భూమ్యాకర్షణ శక్తి దానిని అరికడుతూ ఉంటుంది .భూగోళంతో పాటుగా వాతావరణం నిరంతరం కదులుతూ ఉంటుంది. వాతావరణం ఈ భూమిమీది  జీవకోటి నంతా రక్షిస్తూ ఉంటుంది. సూర్య కిరణాల వేడికి జీవరాసులు నశించ  కుండా ఈ వాతావరణం కాపాడు తుంటుంది  .సూర్యుని నుండీ వచ్చే కొన్నిరకాల కిరణాలు నేరుగా మీద పడితే ప్రతిజీవీ  మరణిస్తుంది.  ఇట్టి ప్రమాదకరమైన కిరణాలనుండీ వాతావరణం  జీవరాసులను  రక్షిస్తూ ఉంటుంది. మానవులూ, భూమి మీద జీవించే అనే కానేక అన్ని జీవులూ  ఆరోగ్యంగా బ్రతికేందుకు సరిపోయే వేడిమిని మాత్రమే ఈ వాతావరణం భూమి మీదకు రానిస్తుంది. 

సూర్యుడు అస్తమించ గానే భూమి మీద వేడి తగ్గిపోకుండా వాతావరణం అడ్డుకుంటుంది .ఇలావాతా వరణం భూమి మీది వేడిని నిలిపి ఉంచక పోతే సూర్యాస్తమయం కాగానే  విపరీతమైన శీతలం భూమిని ఆవరిస్తుంది.అంత చలిలో ఏజీవీ బ్రతకలేదు.భూమి చుట్టూ ఉండే వాతావరణం ఒక రక్షణ వలయంలా ఒక రక్షణ తొడుగులా ఉండి జీవులను కాపాడు తున్నది  .  

ఇలాంటి వాతావరణాన్ని మనం  అనేక కార్య క్రమాల  ద్వారా ధ్వంసం  చేసి మనకు మనమే హానిచేసుకుంటున్నాం.వాతావరణ సమ తుల్యతను నాశనం చేస్తున్నాం. అడ్డూ ఆపూలేకుండా అడవులనూ, చెట్లనూ నరికేస్తున్నాం, 30,40 అంతస్తులవరకూ అపార్ట్మెంట్స్ కట్టుకుంటూ పచ్చని చెట్లకు  చోటే లేకుండా చేస్తున్నాం, కొండలను  రాళ్ళ కోసం త్రవ్వి  ప్రకృతినే  నశింపజేస్తున్నాం. కొండలు, చెట్లూ వాతావరణాన్ని సమతుల్యం చేసి వర్షాలు సకాలంలో పడేలా చేస్తాయి, వా టిని నరికేయడం ద్వారా వాతావరణంలో సమతుల్యత పోయి వర్షాలు లేక, ఉష్ణోగ్రతలో  తీవ్రమైన మార్పులూ వచ్చేస్తున్నాయి.  

ఇక్కడ సూర్యుని  గురించీ  కొద్దిగా చెప్పుకోవాలి.సూర్య కుటూంబంలో ప్రధాన గోళం సూర్యుడే.సూర్యుడు స్వయం ప్రకాశం గల ఒక నక్షత్రం. సూర్యగోళం  ఘన పదార్ధ  రూపంలో కాక  వివిధ రకాల  వేడివాయువులతో  కూడి ఉన్న అగ్నిగోళం .ఈ వాయువుల్లో 67మూల పదార్ధాలు ఉన్నాయి.  సూర్యుని వ్యాసం  8,65,380 మైళ్ళు .సూర్యుని  ఉపరితల  తాపం  6వేల సెంటిగ్రేడ్ డిగ్రీలు. సూర్యుని ఉపరిభాగం  నుండీ జ్వాలలు  సెకండుకు 2 వందలనుండీ 3వందల మైళ్ళ వేగంతో  నిరంతరం  పైకి వస్తూ  ఉంటాయి.ఈ అగ్ని జ్వాలలు ఒక్కోసారి సూర్యుని ఉపరితలం నుండీ మూడు నుంచీ ఐదు లక్షల  మైళ్ళ వరకూ పైకి వస్తూ ఉంటాయి.సూర్యుని  లోని  పదార్ధం నిరం తరం వేడి వెలుతురూ  రూపంలో తరిగి పోతూ ఉంటుంది. ఇది సెకండుకు 24 లక్షల టన్నుల చొప్పున రోజుకు 20 వేల కోట్ల టన్నులు తరిగి పోతూ ఉంటుంది. మనం ఒక గాడి పొయ్యిలో కట్టెలు వేసి మండించి నట్లే నన్నమాట. 

సూర్యుని బరువు ఇలా తరిగిపోతూ ఉంటే 15 లక్షల కోట్ల సంవత్సరాలకు   పూర్తిగా సూర్యుడు అదృశ్యమైపోతాడు. సూర్యుడు లేందే భూమి వాతావరణం  పూర్తిగా చల్లబడి పోయి ప్రాణికోటి జీవించ లేదు. బహుశా అదే సృష్టి ముగింపేమో , ప్రళయమేమో! సూర్యగోళం  విశ్వంలోకి  ప్రతి సెకండుకూ 3.7 x 10 టుది పవరాఫ్ 26  వాట్ల శక్తిని   విడుదల చేస్తుంది. ఈశక్తిలో 1/2000000000 భాగం మాత్రమే భూమి గ్రహిస్తుంది.  కర్ర, నేలబొగ్గు, పెట్రోలియం మున్నగు పదార్ధాల శక్తికి  మూలాధారం సూర్యరశ్మి యే.  ప్రపంచం మొత్తంలో తయారయ్యే  విద్యూఛ్ఛక్తి కంటే   లక్షరెట్ల విద్యుఛ్ఛక్తిని  సూర్యుడు భూమికి సరఫరా చేస్తున్నాడు. దాన్నీ మనం సరిగా  సరైన రీతిలో ఉపయోగించుకోడం లేదు.  సోలార్ పవర్ తో వేడి నీరే కాక  ఇంట్లోకి అవసరమైన దీపాలన్నీ , ఇంటికి వంటకు కావల్సిన ఉష్ణాన్నీ కూడా ఉపయోగించు కోవచ్చు. భూమి మీద  ప్రసరించే సూర్య శక్తిలో 0.1 శాతం నుండీ 0.2 శాతం శక్తిని మాత్రమే మొక్కలు గ్రహిస్తాయి. కనుక వేసవి తాపం భరించలేక మనం బాధపడుతున్నాంకానీ వాతావరణ సమతుల్యత గురించీ మాత్రం ఏమాత్రం తాపత్రయపడటాంలేదు. రాబోయేతరాల కష్టాలగురించీ ఆలోచించడంలేదు. దానికై తగుప్రయత్నమూ చేయడాం లేదేమో!        

మరిన్ని శీర్షికలు
veekshanam