Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> శీర్షికలు >>

సామాన్యుడి అసహనం - అనంత

                                                         సింగపూర్  పాఠం - 1

కేవలం 719.1 చదరపు కిలోమీటర్ల  ( 277.6 చదరపు మైళ్ళు) వైశాల్యం ఉన్న సింగపూర్ దేశం( నగర దేశం-city state ) ఈనాడు ఆగ్నేయాసియా దేశాల్నే కాక ప్రపంచంలో ఇంకా చాలా దేశాల్ని ప్రశ్నించే స్థితికి వెళ్ళింది.


చాలా దేశాల్లో ఆయా దేశాల సామాన్య ప్రజలు సింగపూర్ ని చూపిస్తూ వాళ్ళ నాయకుల్ని కడిగిపారేస్తున్నారు. అసహనానికి లోనవుతున్నారు. నీతి నిజాయితీలు, తెలివి తేటలు, సృజనాత్మక శక్తి, నిరంతర శ్రమ లేని నాయకుల మూలంగానే ఆయా దేశాలు భ్రష్టు పట్టిపోయాయి. తద్వారా ఆయా దేశాల సామాన్య ప్రజలు పడరాని ఇక్కట్లు పడుతున్నారు.

ఇతరుల్ని చూసైనా నేర్చుకోకపోతే సామాన్య ప్రజల అసహనం ఆగ్రహం క్రింద మారటానికి ఎక్కువ కాలం పట్టదు. ఈ హెచ్చరిక ఎవరికంటే, భారత్, శ్రీలంక, పాకిస్థాన్, బంగ్లాదేశ్, ఇండోనేషియా, కాంబోడియా, లాంటి లంచగొండితనం పెట్రేగిపోయి ఉన్న దేశాల పాలకులకు.

ఇక సింగపూర్ విషయానికొస్తే తూర్పు నుంచి పడమరకు కేవలం 27 కిలోమీట్ర్లే ఉంటుంది. ఉత్తరం నుంచి దక్షిణానికి కేవలం 193 కిలోమీటర్లే.

ప్రధాన భూభాగం 50 చదరపు కిలోమీటర్సే. (31 చదరపు మైళ్ళు.)

పెద్దదేశాలైన మలేషియా-ఇండోనేషియా మధ్య ఉన్న ద్వీపమే సింగపూర్.

డైమండ్ షేప్ లో ఉండే ఈ ద్వీపం చాలా దశాబ్దాల క్రితం నుంచే డైమండ్ లా వెలిగిపోతోంది.

సింగపూర్ కి చుట్టూ సముద్రంలో ఉన్న 63 ద్వీపాలు సింగపూర్ కి చెందినవే.

1965 లో ఇండిపెండెన్స్ వచ్చిన ఈ దేశం ఆ దేశ నాయకుల నిజాయితీ, ముందుచూపు ఆ దేశ ప్రజల దేశభక్తి, క్రమశిక్షణ మూలంగా అనతి కాలంలోనే అత్యంత అభివృద్ధి చెందిన దేశంగా ఎదిగిపోయింది.

సింగపూర్ లో ఒక్క నది కాని, సహజమైన సరస్సు కాని లేవు.

వర్షపు నీరే మొదట్లో ప్రధాన ఆధారం. వర్షపు నీటిని వృధాగా పోనివ్వకుండా, మురికిలో కలవకుండా ఒడుపుగా ఏటవాలుగా తీసుకెళ్ళి, కృతిమంగా తవ్వుకున్న 5 జలాశయాల్లో నిల్వ చేసి, తరువాత వాటిని శుద్ధి చేసి ప్రజావసరాలకి వినియోగించుకొనేవారు.

పోను..పోను..వర్షాలు తగ్గిపోవటంతో, సముద్రపు నీటిని మంచినీరుగా మార్చే డిసాలినేషన్ ప్లాంట్స్ 3 నిర్మించుకున్నారు. అవి రివర్స్ ఓసిమోసిస్ పద్ధతిలో పని చేస్తాయి.

ఆ పైన వంటగానుగలనుంచి వచ్చే నీటిని మంచి నీటిగా మార్చుకొని పొదుపుగా తిరిగి వినియోగించుకోనారంభంచారు. బాత్రూంస్, లావెట్రిన్స్ నుంచి వచ్చే అపరిశుద్ధ జలాన్ని సయితం శుద్ధి చేసి వాటిని 300 పైగా ఉన్న పార్క్ లకి వినియోగించుకోవటం మొదలెట్టారు.

అయినా నీరు సరిపోకపోవటంతో పక్కనే ఉన్న మలేషియా, ఇండోనేషియా దేశాల నుంచి పైప్ లైన్స్ ద్వారా నీటిని దిగుమతి చేసుకోవటం ప్రారంభించారు.

ఎంత ప్లానింగ్...!!! ఎంత ముందు జాగ్రత్త....!!! ఎంత పొదుపు...!!! మరెంత పట్టుదల....కృషి....

ఆ దేశ నాయకులకున్న బుద్ధి కుశలత....క్రమశిక్షణ చూసైనా నేర్చుకోమని మనదేస సామాన్యులు తమ అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు మన నాయకులపై.ఇదంతా ఓ పక్కన పెడితే సింగపూర్ లో 50% గ్రీనరీ ఉంది. అందుకోసం నాలుగు రక్షిత అడవుల్ని పెంచి పోషించుకోవటమే కాకుండా, ప్రతి ప్రాంతంలో ఇబ్బడిముబ్బడిగా పచ్చని చెట్లు...ప్రధాన రహదారులు, వీధుల వెంట - ఇరువైపులా చెట్లు....మిగతా ప్రాంతాలతో పచ్చటి పచ్చిక మైదానాలు...ఎటు చూసినా పచ్చదనమే...

అందుకే సింగపూర్ ని గార్డెన్ సిటీ స్టేట్ అంటారు.

ఎంత చిన్న దేశం!!!

ఇండిపెండెన్స్ వచ్చింది 1965లో...

మనకొచ్చింది 1947 లో...

మనదేశంలో ఎన్ని నదులున్నాయి...? ఎన్ని సరస్సులున్నాయి...? ఎంత వర్షం కురిసేది ఒకప్పుడు...? పోనీ ఇప్పటికైనా నదుల జలాలు సద్వినియోగం అయ్యేది ఎంత? సముద్రం పాలు ఎంత?

మలేషియాలో సముద్రం మీద రైలు కం రోడ్ మార్గాలు ఏర్పాటు చేసుకొని పెట్రోలు. డీజిల్, గ్యాస్, ఎలక్ట్రిసిటీ ధాన్యం, కూరగాయలు దిగుమతి చేసుకొంటూ కూడా ఈనాడు తలసరి ఆదాయంలో భారత్ కంటే ఎంతో ముందుంది.

ప్రకృతిపరంగా సింగపూర్ కున్న గొప్ప అదృష్టం...సునామీలు, భూకంపాలు రాకపోవటం..

దురదృష్టాలూ లేకపోలేదు-తరచూ ఇండోనేషియా అడవుల్లో సంభవించే కార్చిచ్చు మూలంగా పొగ, ధూళీ రిపబ్లిక్ ఆఫ్ సింగపూ ని కమ్మేస్తుంటాయి.........

వచ్చే సంచికలో

సింగపూర్ పాఠం - 2

మరిన్ని శీర్షికలు
kathaa sameekShalu