Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
kaman veedhi kathalu

ఈ సంచికలో >> కథలు >> తలవొంపు

talavonpu

"అయ్య గారండీ...అయ్య గారండీ" అని ఇంటి బయట నుండి కేకలు వినబడటంతో, చదువుతున్న పేపర్ను పక్కన పడేసి కూర్చున్న ఈజీ చైర్ లో నుండి లేచి గుమ్మం దగ్గరకు వచ్చేడు కేశవ రావ్.

వాకిట్లో నడుం చుట్టూ తుండు కట్టుకుని నిలబడున్న పనివాడు కనిపించేడు.

"ఏవిట్రా ఆ అరుపులు...ఏదో కొంపలు మునిగి పోయినట్లు"

"అవునండయ్యా...నిజంగానే మన కొంప మునిగిందయ్యా. మన చిన్నయ్య గారు ఆ నూకాలమ్మ కూతురితో రైలు స్టేషన్లో కనిపించేరండి"

"ఏవిట్రా వాగుతున్నావ్" కళ్ళు పెద్దవి చేసేడు కేశవరావ్.

“నే సెప్పేది నిజమేనండయ్యా...నా కళ్ళారా చూసేనయ్యా. ఇద్దరి సేతుల్లోనూ సూటు కేసులున్నాయండయ్యా...ఈ ఇషయాన్ని మీ కాడ సెప్పాలని ఎంటనే లగెత్తుకుని ఈడకొచ్చేనయ్యా"

"సావిత్రీ" అంటూ పెద్దగా అరిచేడు కేశవరావ్.

"ఏమిటండీ అలా అరిచేరు!" వంట గదిలోనుండి పరిగెత్తుకొచ్చిన కేశవరావ్ భార్య సావిత్రి  భర్తను చూస్తూ ఆశ్చర్యంగా  అడిగింది.

"కిష్టుడు గదిలో ఉన్నాడో లేడో చూడు" భార్యను ఆదేశించేడు కేశవ రావ్.

"గది లోనే ఉంటాడు...నిద్రలో నుండి ఇంకా లేచుండడు" చెప్పింది సావిత్రి.

"చెప్పింది చెయ్యి" భార్యను గదమాయించేడు కేశవ రావ్. వెంటనే పరుగు లాంటి నడకతో మేడ పైకి వెళ్ళింది సావిత్రి. కొడుకు  క్రిష్ణా రావ్ గది తలుపును రెండు సార్లు తట్టింది. మూడో సారి గది తలుపు మీద తట్టినప్పుడు తలుపులు కొంచంగా తెరుచుకున్నాయి. దాంతో సావిత్రిలో భయం పుట్టుకొచ్చింది. ధైర్యం తెచ్చుకుని లోపలికి వెళ్ళి చూసింది. కొడుకు మంచం మీద లేడు. బాత్ రూం లో ఉన్నాడేమోనన్న అనుమానంతో అటు తిరిగింది. బాత్ రూం తలుపు తెరిచే ఉంది. బాత్ రూములో కూడా కొడుకు కనిపించక పోయే సరికి సావిత్రి గుండె గుభేలు మంది.

 కొడుకు గదిలో నుండి పరుగు లాంటి నడకతో బయటకు వచ్చి "కిష్టుడు రూములో లేడండి"  మేడపై నుండే భర్తకు విన బడేలా చెప్పింది సావిత్రి. ఆమె గొంతులో వొణుకు చోటు చేసుకోవటం ఎవరికైనా అర్ధమై పోతుంది.

భార్య  మాట వినగానే నెత్తి మీద బరువు పడినట్లు పక్కకు ఒరిగిన కేశవరావ్ పడి పోకుండా ఉండటానికి దగ్గరున్న గుమ్మాన్ని పట్టుకున్నాడు. "ఎంత పని చేసేడు!...కుటుంబ గౌరవానికి తల వొంపులు తీసుకు వచ్చేడే...గౌరవంగా బ్రతుకుతున్న నన్ను తల వంచుకునేలా  చేసేడే" అనుకుంటూ కుంగి పోతూ పక్కనున్న గుమ్మం మీద కూర్చుండి పోయేడు.

"ఏమైందండీ... " భర్త దగ్గరకు వచ్చిన సావిత్రి  కేశవ రావ్ ను చూసి అడిగింది.

"నీ కొడుకు చేసిన ఘన కార్యమే"

"ఏం చేసేడండి"

"ఏం చేసేడని నిదానంగా అడుగుతావేం...మన కుటుంబ గౌరవానికి తల వొంపులు తీసుకొచ్చే నీచమైన పని చేసేడే నీ కొడుకు... ఈ ఊళ్ళో నన్ను తల దించుకునేలా చేసేడే"

 "అదే ఏం చేసేడని అడుగుతున్నా"

"ఆ నూకాలమ్మ కూతురితో ఊరు వదిలి వెళ్ళి పోయేడు...రైల్వే స్టేషన్లో వాలిద్దరినీ సూట్ కేసులతో చూసేడట మన ఏకాంబరం" అంటూ లేచి నిలబడి మీసాలు మెలేస్తూ "వదలను...కుటుంబ గౌరవానికి కళంకం తీసుకు వచ్చిన వాడిని వదలను. కులం తక్కువ దానితో కులకటానికి ఇన్నేళ్ళు పెంచి పోషించిన తల్లి తండ్రులనే వదులుకుంటాడా?...కుల గౌరవాన్ని, పెద్ద వాళ్ళని తల వొంచుకునేలా చేయడానికా వాడు చదువుకుంది.? వదలను...వదలను...మనకూ, మన కుటుంబ గౌరవానికీ తల వొంపులు తీసుకు వచ్చిన వాడ్ని వదలను" ఎర్ర బడ్డ కళ్ళతో అటూ ఇటూ తిరుగుతూ పూనకం వచ్చిన వాడిలా చిందులు వేసేడు కేశవ రావ్.

పని వాళ్ళు, విషయం తెలుసుకున్న ఊరి పెద్దలు అప్పుడే కేశవరావ్ ఇంటి ముందు గుమికూడేరు.

"ఏవండీ...మీరు ఆవేశ పడకండి...మీ ఆరోగ్యం దెబ్బ తింటుంది" భయ పడుతూ చెప్పింది భార్య సావిత్రి.

"ఆవేశ పడకుండా ఎలా ఉండనే...నీ కొడుకు చేసిన పనిని సమర్ధించ మంటావా? లేక ఇంట్లో నుండి కులం తక్కువ  దానితో ఊరు వదిలి పారిపోయి మన కుటుంబ గౌరవానికి తల వంపులు తీసుకు వచ్చిన ఆ పిరికి వాడిని మన్నించ మంటావా?...వదలనే...వాడిని, దానిని ఇద్దరినీ వదలను..." పూనకం వచ్చిన వాడిలా ఊగి పోయేడు కేశవ రావ్.

"వదలద్దండి...వాడిని వదిలేయమని నేనటం లేదు. మీరు ఆవేశం తగ్గించుకుని...ఏం చేయాలో నిదానంగా ఆలోచించమని  చెబుతున్నాను" అన్నది సావిత్రి.

ఆ మాటకు కొంచం శాంతించిన కేశవ రావ్ ఇంట్లోకి వెళ్ళి పోయేడు.

అక్కడ గుమి కూడిన వారందరూ తమ తమ పనులకు వెళ్ళి పోయేరు.

****************************

రైలులో వస్తున్న వాళ్ళని తీసుకు వెళ్ళడానికి కేశవ రావ్ మరియూ అతని నమ్మిన బంటు చెంచలయ్య రైల్వే  ప్లాట్ ఫారం మీద నిలబడున్నారు.

 గౌతమీ ఎక్స్ ప్రెస్ ఒకటో నెంబర్ ప్లాట్  ఫారం లోకి వచ్చి ఆగింది.

అందులో నుండి క్రిష్ణా రావ్, అతనితో పాటు హేమ దిగేరు. దిగిన వెంటనే వారిద్దరికీ కేశవ రావ్, చెంచలయ్య కనిపించేరు. వారిద్దరినీ చూసి ఆశ్చర్యపోయిన  క్రిష్ణా రావ్, హేమలకు చెమటలతో పాటు గుండె ధడ ఒక్క సారిగా పట్టుకున్నాయి.

"రా క్రిష్ణా...ఎలా ఉన్నావు. ఆరు నెలలో ఇంత చిక్కి పోయేవేం.....సరే రా...ఇంటికి వెడదాం. మీ ఇద్దరినీ ఈ ఊరికి రప్పించటానికే నూకాలమ్మకు యాక్సిడెంట్ అని అబద్దం చెప్పేను. మీరూ వచ్చేసేరు. బయట కారు నిలబడుంది...వచ్చి ఎక్కు" కొడుకు  క్రిష్ణా రావును చూస్తూ, మీసాలు తిప్పుకుంటూ, చిరు మందహాసంతో అతని ఎదురుగా వెళ్ళేడు కేశవరావ్.

"నాన్నా...హేమ..." అని చెప్పి ముగించేలోపు  క్రిష్ణా రావ్ చెంప చెల్లు మనేలా గట్టి  దెబ్బ వేశేడు తండ్రి  కేశవ రావ్. కొడుకు గొంతు వెనుక తన బలమైన చేతులు వేసి అతన్ని తోసుకుంటూ  రైలు స్టెషన్ బయటకు వచ్చేడు. అక్కడ  నిలబడున్న కారు తలుపులు తెరుచుకున్నాయి.  క్రిష్ణా రావును అందు లోకి తోసి బంధించేడు కేశవ రావ్.

కారు తమ ఊరి వైపు వెళ్ళే రోడ్డు ఎక్కింది.

********************************

రైల్వే స్టేషన్లో తన కళ్లేదుట జరింగింది చూసి పిచ్చెక్కిన మనిషిలా నిల బడి పోయింది హేమ. తన కళ్ళేదుటే తన భర్త  క్రిష్ణా రావును అతని తండ్రి కొట్టి లాక్కు పోవడం ఆమె మనసును కలవర పెట్టింది. "ఏం చెయ్యాలి...ఇప్పుడేం చేయాలి" అనుకుంటున్న హేమకు తాను ఏమీ చేయ లేనని అర్ధమవడానికి పది నిమిషాలు పట్టింది. మనుష్యులే లేని చిట్టడవిలో వదిలి పెట్ట బడ్డ అనాధ లాగా ప్లాట్ ఫారంపై  నిలబడింది.

తల్లికి ఏమీ అవ లేదనే తృప్తి ఆమె మనసును శాంత పరుస్తున్నా...కడుపులో శిశివుతో ఇంటికి వెడితే తల్లి ఒప్పుకుంటుందా? ఆరు నెలల క్రింద తల్లికి చెప్పకుండా క్రిష్ణా రావుతో ఈ ఊరు వదిలి వెళ్ళి పోవటం, తల్లికి యాక్సిడెంట్ అని తెలిసిన వెంటనే తిరిగి ఊరికి వచ్చిన తనకు రైల్వే స్టేషన్లో జరిగిన అవమానం ఆమె కళ్లేదుట మారి మారి వస్తుంటే హేమకు ఏడుపు ఆగ లేదు. తన భవిష్యత్తు, తన బిడ్డ భవిష్యత్తు గురించిన ఆలొచన రాగానే కళ్ళు తుడుచుకుని బస్ స్టేషన్ కు వెళ్ళింది. బస్సులో ఎక్కి కూర్చుంది. బస్సు బయలు దేరింది.

భర్త  క్రిష్ణారావ్ ఎలకల బోనులో చిక్కుకున్నట్లు అతని తండ్రి దగ్గర దొరికి పోయిన సంఘటన ఆమె మనసు నుండి దూరమవడానికి నిరాకరించింది. క్రిష్ణా రావ్ చెంప మీద చెల్లు మని పడిన దెబ్బ, తన  చెంప మీద పడినట్టు చెంపంతా నొప్పి పుట్టింది.

బస్సు దిగేటప్పటికి చీకటి పడింది. ధైర్యం తెచ్చుకుంటూ తన గుడిసె వైపుకు వెళ్ళింది. గుడిస ముందు నిలబడి "అమ్మా" అని పిలిచింది.

ఎవరై ఉంటారనుకుంటూ ఇంటి బయటకు వచ్చిన నూకాలమ్మకు కూతురు హేమ కనబడటంతో కొయ్య బారి నిలబడి పోయింది. ఆరు నెలల కిందట తనతో చెప్పకుండా,  క్రిష్ణారావ్ తో ఊరు వదిలి పారి పోయిన కూతురు ఇప్పుడు కడుపులో బిడ్డతో తిరిగి రావటం...నూకాలమ్మ జీర్ణించుకో లేక పోయింది. ఇంట్లోకి రమ్మనాలా...లేక తిరిగి వెళ్ళి పొమ్మనాలా? కన్న ప్రేమ కూతుర్ని తిరిగి వెళ్ళమని చెప్ప గలదా?...హేమ చేతులు పుచ్చుకుని ఇంట్లోకి తీసుకు వెళ్ళింది. నులక మంచం మీద కూర్చున్న హేమకు  మంచి నీళ్ళు ఇచ్చి, ఆమె దగ్గరగా నేలపై కూర్చుంది నూకాలమ్మ.

"నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళి పోయిన  రోజు, నువ్వెక్కడికి వెళ్ళేవో, ఎందుకు వెళ్ళి పోయేవో తెలియక నా మనసు ఎంత గిల గిలా కొట్టుకుందో తెలుసా. ఏం చేయాలో తెలియక, ఎవరికి చెప్పాలో తెలియక సతమతమవుతున్న నాకు ఏడు కొండలు వచ్చి జరిగిన విషయం చెప్పటంతో నా గుండె జారి పోయింది. ఏ నిమిషంలో ఏం కబురొస్తుందో, లేక కేశవ రావ్ మనుష్యులు వచ్చి నన్నేం చేస్తారో నన్న భయం నాలో జ్వరం తీసుకు వచ్చింది. ఇంట్లో నుండి బయటకు వెళ్ళ లేదు. రెండు రోజులైనా ఎవరూ రాక పోయే సరికి మనసు కొంచం కుదట పడింది. కానీ భయం పోలేదు...కేశవ రావ్ ఎందుకు వూరికే ఉన్నాడు?...లేదు...ఏదో ప్లానులొ ఉండే ఉంటాడని అనిపించింది...మీరెక్కడున్నా వెతికి పట్టుకుని చంపేస్తాడని మాత్రం అర్ధమయ్యింది. ఇన్నిరోజులూ ఏం కబురు వస్తుందో ననే భయం తోనే గడిపేను. కానీ నువ్విలా ప్రాణాలతో తిరిగొస్తావని నేను కలలో కూడా అనుకో లేదు...అసలేం జరిగింది చెప్పు" తల వంచుకుని ఏడుస్తునే ఉన్న కూతురు హేమను అడిగింది.

కళ్ళు తుడుచుకుంటూ జరిగిందంతా తల్లితో చెప్పింది హేమ.

 "సరే...జరిగిందేదో జరిగిపోయింది. నీ తల రాత ఎలా రాసుందో అలాగే జరుగుతుంది...దాన్నెవరూ మార్చ లేరు. కానీ ఇంకేదో చేసేద్దామని మాత్రం మరో కొత్త ఆలొచన పెట్టుకోకు. మన మేమిటో, మన కులమేమిటో, సంఘంలో మన స్థానమేమిటో అర్ధం చేసుకుని ఈసారన్నా తెలివిగా ప్రవర్తించు...నేను బ్రతికున్నంతవరకూ నిన్ను కడుపులో పెట్టుకుని కాపాడుతాను...ఆలేస్యమైంది...భోజనం చేసి పడుకో" అన్నది నూకాలమ్మ.

తల్లి ప్రేమను అర్ధం చేసుకున్న హేమ "అమ్మా...నన్ను క్షమించు" అంటూ తల్లి కాళ్ళ మీద పడ్డది. కూతుర్ని లేపి అభయంగా తన హృదయానికి హత్తుకుంది నూకాలమ్మ.

ఆ రాత్రంతా ఏడుపుతో గడిపింది హేమ.

 ***************************************

మరుసటి రోజు ప్రొద్దున పెరట్లో పాత్రలు కడుగుతోంది నూకాలమ్మ.

 "నూకాలమ్మా...నూకాలమ్మా..."........ఎవరో తనని పిలుస్తున్నారని, కడుగుతున్న పాత్రను పక్కన పడేసి, చేతులు కడుక్కుని ఇంటి బయటకు వచ్చింది నూకాలమ్మ.

"అయ్య గారు నిన్ను పిలుచుకు రమ్మాన్నారు" చెప్పేడు ఏకాంబరం.

నూకాలమ్మ వొళ్ళు జలదరించింది. చీర కొంగుతో మొహం మీద పట్టిన చెమటను తుడుచుకుంటూ "వస్తున్నా...నువ్వు ముందు పద" అన్నది.

"లేదు...దగ్గరుండి తీసుకు రమ్మన్నారు" చెప్పేడు ఏకాంబరం.

"సరే ఉండు...ఒక్క నిమిషంలో వస్తాను" అని చెప్పి ఇంట్లోకి వెళ్ళి, దేవుడి ఫోటోకు దణ్ణం పెట్టుకుని ఇంటి బయటకు వస్తుంటే "నేనూ రానా" కూతురు హేమ అడిగింది.

"వద్దు...నిన్ను రమ్మని  చెప్ప లేదు. నే వెళ్ళొస్తా...నువ్వు జాగ్రత్త" కూతురు జవాబుకు ఎదురు చూడకుండా బయటకు వచ్చి, ఏకాంబరాన్ని చూసి "పద" అంటూ బయటకు నడిచింది.

కేశవ రావ్ ఇంటి దగ్గరకు వెడుతుంటే నూకాలమ్మ కాళ్ళలో వొణుకు మొదలయ్యింది.నెమ్మదిగా నడుచు కుంటూ కేశవ రావ్ ఇంటి గేటు దాటి కాంపౌండ్ లోపలికి వెళ్ళింది. అక్కడ కేశవ రావ్ తో పాటు చెంచలయ్య, మరో ఇద్దరు ఊరి పెద్దలు కుర్చీలేసుకుని కూర్చోనున్నారు. చుట్టూ జనం ఉన్నారు. నూకాలమ్మను చూసిన వెంటనే గుమి కూడిన జనం పక్కకు తప్పుకుని ఆమెకు దోవ వదిలేరు. నేరారోపణ మోప బడిన ఒక ఖైదీ లాగా, వాళ్ళ ముందుకు వెళ్ళి, నేరస్తులు బోనులో నిలబడే విధంగా తల దించుకు నిలబడింది నూకాలమ్మ.

"నూకాలమ్మా...జరిగిందేదో జరిగి పోయింది. నా కొడుకు నీ కూతుర్ని లేపుకు పోయేడని నేను చెప్పను...నీ కూతురే నా కొడుకును లేపుకు పోయింది. ఏది ఏమైనా నీ కూతురి కడుపులో పెరుగుతున్న బిడ్డకు నా కొడుకు కారణం అయ్యేడు...కానీ, నా కొడుకు నీ కూతురి మెడలో తాలి కట్ట లేదు...రిజిస్టర్ మ్యారేజీ చేసుకో లేదు. అందు వలన విడాకులకు అవసరం లేదు. అయినా సరే నేను యాబై వేల రూపాయలు డబ్బిస్తాను. తీసుకు వెళ్ళు...నీ కూతురు నా కొడుకును మర్చి పోవాలి" చెప్పేడు కేశవ రావ్.తలెత్తి కేశవ రావును చూసే ధైర్యం లేక, తల దించుకునే కొంగుతో కళ్లు తుడుచుకుంటూ మౌనంగా నిల బడింది నూకాలమ్మ.

"ఏం...సమాధానమే లేదు" కఠినంగా అడిగేడు కేశవ రావ్.      "మీరు చెబితే సరే నండి" అన్న నూకాలమ్మ చేతుల్లో యాబై వెల రూపాయలను ఉంచేడు కేశవ రావ్ గుమాస్తా.....అంతే. కేశవ రావ్ లేచి ఇంట్లోకి వెళ్ళి పోయేడు...ఆ తరువాత మిగిలిన వారందరూ అక్కడి నుండి కదిలి వెళ్ళి పోయేరు.

తన కూతురు కడుపులో పెరుగుతున్న బిడ్డకు ఖరీదు కట్టి కేశవ రావ్ తన చేతిలో పెట్టిన డబ్బును చూసుకుంటూ ఏడుస్తూ బయటకు వచ్చిన నూకాలమ్మను ఏకాంబరం ఆపేడు..."చూడు నూకాలమ్మా... కేశవ రావ్ ఎందుకనో నీ మీద కరుణ చూపించేడు. అసలు నిన్నూ, నీ కూతుర్ని చంపేస్తాడేమో  అనుకున్నాం...ఇలా నీ చేతిలో డబ్బు పెట్టి, మిమ్మల్ని క్షమిస్తాడని నేను కలలో కూడా అనుకో లేదు. ఈ భూమ్మీద  మీకింకా నూకలుండబట్టే వదిలేసేడేమో ననిపిస్తోంది" అన్నాడు.

“నిజమే నూకాలమ్మా...ఈ మధ్య కుల గౌరవం, కుటుంబ గౌరవం, తమ వ్యక్తిగత గౌరవం మంట గలిపేరని ఎంతో మంది, తప్పు చేసింది తమ పిల్లలేనని కూడా చూడకుండా వారిని చంపేస్తున్నారు...పైగా ఆ నేరానికి "పరువు హత్య" అని గౌరవమైన  నామ కరణం చేసేరు. నీ కూతురి విషయంలో అలా జరగలేదని సంతోష  పడు...ఈ విషయాన్ని ఇంతటితో వదిలేయమని నీ కూతురితో చెప్పు" ఇంకొకరు  చెప్పేరు.

పిచ్చి పట్టిన దానికి మళ్ళే నూకాలమ్మ కాళ్ళీడ్చుకుంటూ ఇంటి వైపు నడిచింది.  

************************************

అమ్మ రాక కోసం పూరి గుడిసెలో ఎదురు చూస్తున్న హేమ అప్పుడే ఇంట్లోకి అడుగు పెడుతున్న తల్లిని చూసి "ఎందుకు రమ్మనారు?...ఏం చెప్పేరు?" అని అడిగింది.

కూతురు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పకుండా  కేశవ రావ్ ఇచ్చిన డబ్బును హేమ ముందు ఉంచి "ఈ డబ్బు తీసుకుని...క్రిష్ణా రావ్ ని నువ్వు మర్చి పోవాలట" అన్నది నూకాలమ్మ.

క్రిష్ణా రావ్ బిడ్డను తన కడుపులో మొస్తున్నందుకు కూలీగా ఈ డబ్బును ఇచ్చేరని అనుకున్నప్పుడు హామకి ఈ సముదాయం మీద, ఈ సంఘం మీద విరక్తి  ఏర్పడింది. ఇక మీదట క్రిష్ణారావ్ తన వాడు కాదు అన్న భావన కలిగినప్పుడు ఆమె కళ్ళల్లో నీళ్ళు జల పాతంగా ఉప్పొంగినై. అతనితో గడిపిన రోజులు, అతను తనకిచ్చిన మరో ప్రాణాన్ని మోస్తున్న అనుభూతులు...అన్నిటినీ మర్చి పోవాలా?...తన మీద, తన తల రాత మీద హేమ కు కోపం వచ్చింది. తమాయించుకుని, నిలకడ తెచ్చుకుని "ఆ డబ్బును బ్యాంకులో డిపాజిట్ చేయమ్మా" అని తల్లితో చెప్పింది.

కూతురి నోట ఆ మాట విన్నప్పుడు నూకాలమ్మ మొహం చిగురించింది...మనసు ఆనంద పడింది...డబ్బు డిపాజిట్ చేయమన్నందుకు కాదు...కూతురు ఇక మీదట క్రిష్ణా రావ్ మాట ఎత్తదని గ్రహించినందుకు.  

**************************************

 రోజులు గడిచినై.

 హేమకు ఆడ పిల్ల పుట్టింది. పుట్టిన బిడ్డతో  హేమను హాస్పిటల్ నుండి ఇంటికి తీసుకు వచ్చిన నూకాలమ్మకు ఇంటి గుమ్మం దగ్గర చిందర వందర జుట్టుతో, పిచ్చి వాడిలో నిలబడున్న క్రిష్ణా రావ్ కనబడ్డాడు.

ఏం జరుగుతుందో నన్న భయం పట్టుకుంది నూకాలమ్మకు.

 ఆటోలో నుండి దిగిన హేమ క్రిష్ణా రావ్ ను చూసి కూడా చూడనట్లు అతన్ని దాటుతుంటే "హేమా...నాతో మాట్లాడవా?...నా బిడ్డను నాకు చూపించవా?" అడిగేడు క్రిష్ణా రావ్.

హేమ క్రిష్ణా రావ్ కి సమాధానం చెప్పకుండా "అమ్మా...తాళం తీయ్" అన్నది.

కూతురి మాటలకు ధైర్యం తెచ్చుకున్న నూకాలమ్మ "చూడు బాబూ...అనవసరంగా గొడవ చేయకు. నీకు, నా కూతురికి ఎటు వంటి సంబంధం లేదు. డబ్బులిచ్చి సరి చేసేరు...మళ్ళీ హేమతో మాటలెందుకు" అన్నది.

 ఆమె మాటలు విన్న క్రిష్ణారావ్ ఒక్కసారి హేమ వైపు చూసేడు. హేమ తన ముఖాన్ని పక్కకు తిప్పుకుంది...అంతే క్రిష్ణా రావ్ ఇంకేమీ మాట్లాడకుండా అక్కడి నుండి బయలు దేరేడు. తిన్నగా సారా కొట్టు వైపుకు వెళ్ళేడు.

హేమ బిడ్డతో ఇంట్లోకి వెళ్ళింది.

**************************************

హేమకు డబ్బులిచ్చి కొడుకుతో ఆమె భందుత్వాన్ని తెంపేసిన కేశవ రావ్ కొడుకు క్రిష్ణా రావ్ కి తమ కులానికి చెందిన వేరే అమ్మాయితో పెళ్ళి సంబంధం కుదిర్చేడు. పెళ్ళి సంబంధం కుదుర్చుకున్న మూడు రోజుల తరువాత పెళ్ళి కూతురు తరఫు నుండి పెళ్ళి క్యాన్సెల్ చేసుకున్నామని  కబురు వచ్చింది.

క్రిష్ణా రావ్, హేమతో కలిసి ఊరు వదిలి పారి పోయి ఆరు నెలలు గడిపేడని తెలియటంతో క్రిష్ణా రావ్ కి పెళ్ళి కుదర లేదు. బయట ఊర్ల నుండి సంబంధాలు వెతుకున్నా అవి కూడా తప్పి పోవటంతో కేశవ రావ్ కి దిగులు పట్టుకుంది...క్రిష్ణా రావ్ తాగుడుకు అలవాటు పడి దానికి బానిసై పోయేడు. విపరీతంగా తాగటంతో మనిషి చిక్కి సల్యమై పోయేడు.

కొడుకును చూసి తల్లి సావిత్రి ఏడవని రోజు లేదు. కానీ భర్తతో మాట్లాడటానికి భయ పడింది. కానీ ఈ రోజు భర్త  దిగులుతో ఉన్నాడని తెలుసుకున్న ఆమె ఈజీ చైర్లో కూర్చున్న భర్త దగ్గరకు వెళ్ళి కూర్చుంది.

"ఏమండీ...ఆ రోజు మన కొడుకును, హేమ దగ్గర నుండి విడ దీయమని, అది గనుక జరగక పోతే హేమను చంపైనా కొడుకును తీసుకొచ్చి మన కుల గౌరవాన్ని కాపాడమని మిమ్మల్ని ఉసిగొల్పిన మన కులం వాళ్ళే ఈ రోజు మన కిష్టుడికి పిల్లనివ్వడానికి కాడుతున్నారు...వీళ్ళా కుల గౌరవాన్ని కాపాడే పెద్దలు. వీరి మాటలు వినా మనం వాలిద్దరినీ విడదీసింది...ఇంకా నయం కుల గౌరవం పేరిట వాళ్ళను హతమార్చలేదు. అలా చేసుంటే మీరు జైలుకు వెళ్ళేవారు...నేను ఒంటరి దాన్ని అయ్యే దాన్ని. కులం, కులం అంటూ అవతలి వారిని ఉసి గొల్పటమే తప్ప వారి వరకు వస్తే ఎలా తప్పుకుంటున్నారో చూసేరా. వీళ్ళ కోసం మన బిడ్డను మనం శిక్చించి, మనం పెద్ద తప్పు చేసేమండి...వాడేమై పోతాడో నన్న భయం నన్ను వేదిస్తోంది" అంటూ కొంగుతో కళ్ళు తుడుచుకుంది.

"నిజమేనే...నేను చాలా పెద్ద తప్పు చేసేను...నా తప్పును నేనే సరి దిద్దుతాను...కిష్టుడుని కాపాడతాను" భార్యకు కేశవ రావ్ అభయమిచ్చేడు.

*************************************

ఆ రోజు సాయంత్రం కేశవ రావ్ హేమ గుడిసెకు వచ్చేడు. నూకాలమ్మ ఇంట్లో ఉన్న పాత  కుర్చీని తన చీర కొంగుతో తుడిచి అందులో ఆయన్ను కూర్చొమన్నది.

కేశవ రావ్ అందులో కూర్చున్నాడు.

"హేమా నిన్ను…నా కొడుకు దగ్గర నుండి విడదీసి, వాడికి మా కులం పిల్లతో పెళ్ళి చేయాలనుకున్నాను...అది కుదర్లేదు. ఇప్పుడు వాడు తాగి, తాగి వొళ్ళు పాడుచేసుకుని, నిన్నే తలచుకుని జీవిస్తున్నాడు. వాడ్ని ఇలాగే వదిలి పెడితే చచ్చి పోతాడు...కాబట్టి వాడిని నువ్వే పెళ్ళి చేసుకో...ఇద్దరూ రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుని సంతోషంగా ఉండండి" తన గంభీరాన్నీ, గౌరవాన్నీ, పరువు-మర్యాదలు అన్నిటినీ గాలికి వదిలేసి తప్పు తెలుసుకున్న వాడిలా చెప్పేడు కేశవ రావ్.

హేమ ఒక్క క్షణం ఆశ్చర్య పోయింది. ఇంత పెద్ద మనిషి తన గుడెసను వెతుక్కుంటూ వచ్చి...తన కొడుకును పెళ్ళిచేసుకుని, వాడికి ప్రాణ బిక్ష పెట్టమని అడగడం కేశవ రావ్ తన తప్పును తెలుసుకున్నాడని గ్రహించింది...కానీ ఆమె మనసు ఒప్పుకో లేదు.

"ఇప్పుడు మీరు మనసు మారి వచ్చేరు...మమ్మల్ని పెళ్ళి చేసుకోమంటున్నారు...కానీ మీ కొడుకు ఇప్పుడు పాత క్రిష్ణారావ్ కాదే?...తాగి, తాగి తన ఆరోగ్యాన్ని పాడు చేసుకున్న ఒక రోగి. అతన్ని పెళ్ళిచేసుకుని కొన్ని రోజులు సుమంగళిగా  బ్రతకటం కన్నా...జీవితాంతం నేను ఒంటరిగానే ఉండి పోతాను" చెప్పింది హేమ.

ఆమె మాటలు చెంప మీద కొట్టినట్టు అనిపించడంతో కేశవ రావ్ తల వొంచుకున్నాడు. ఇద్దర్నీ విడ దీసిన తప్పుకు తన కొడుకు బలి అవుతున్నాడన్న ఆలొచనతో కుచించుకు పోయేడు.

కొడుకు హేమతో పారి పోయినప్పుడు తన పరువు తీసేడని, తనకీ, తన కులానికీ తల వొంపులు తెచ్చేడని కుల అహంభావంతో వాళ్ళిదరినీ విడదీసేడు. కానీ ఈ రోజు హేమ అన్న మాటలు కేశవ రావును నిజంగానే తల దించుకునేలా చేసింది.

కులం పేరుతో వాళ్ళిదరినీ విడదీసి తనే తప్పు చేసేనని "ఇదే నిజమైన తలవొంపు" అని గ్రహించిన కేశవ రావ్ తన గంభీరాన్నీ, బెదిరించే చూపులనూ అక్కడే విడిచి పెట్టి తప్పు చేసిన మనిషిలా తల వొంచుకుని అక్కడి నుండి బయటకు వచ్చేడు.                          

మరిన్ని కథలు
manavatvam parimalinchina vela