కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీయార్ హీరోగా రూపొందుతున్న 'జనతా గ్యారేజ్' విడుదలకు సిద్ధమయ్యింది. అతి త్వరలో ఈ సినిమా ఆడియో విడుదల కానుంది. సెప్టెంబర్ తొలి వారంలోనే ప్రేక్షకుల ముందుకు రానున్న 'జనతా గ్యారేజ్'పై భారీ అంచనాలున్నాయి. ఎంతటి అంచనాలున్నా ఆ అంచనాల్ని అందుకోవడం కొరటాల శివ ప్రత్యేకత. 'మిర్చి', 'శ్రీమంతుడు' చిత్రాలతో సంచలన విజయాల్ని అందుకున్న ఈ దర్శకుడి నుంచి వస్తున్న సినిమా కావడంతోపాటుగా 'టెంపర్', 'నాన్నకు ప్రేమతో' చిత్రాలు ఇచ్చిన సక్సెస్తో మంచి ఊపు మీదున్న ఎన్టీయార్ నటిస్తున్న ఈ సినిమాపై అంచనాలకు ఆకాశమే హద్దు అన్నట్లుగా ఉంది.
మలయాళ సూపర్ స్టార్ మోహన్లాల్ ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో కనిపిస్తారు. టీజర్స్కి విపరీతమైన స్పందన రావడంతో సినిమాపై అంచనాలు ఇంకా ఇంకా పెరిగిపోయాయి. ఎన్టీయార్ సరసన ఈ చిత్రంలో సమంత, నిత్యామీనన్ ఆడిపాడనున్నారు. ప్రీ రిలీజ్ టాక్ కారణంగా రికార్డు స్థాయిలో సినిమాకి బిజినెస్ అయినట్లుగా తెలియవస్తోంది. ఓవర్సీస్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మాత్రమే కాకుండా, తమిళనాడు, కర్నాటక, మలయాళంలోనూ సినిమాకి బిజినెస్ క్రేజ్ చాలా బాగా ఉంది. మలయాళంలో మోహన్లాల్ కారణంగా ఈ సినిమాకి విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. ఈ అంచనాల్ని 'జనతా గ్యారేజ్' టీమ్ నిజం చేస్తే, మొత్తం టాలీవుడ్ గత రికార్డులన్నీ ఈ సినిమాతో కొల్లగొట్టడానికి ఛాన్సుంటుంది.
|