అక్కినేని వారింట పెళ్ళి సందడి కనీ వినీ ఎరుగని రీతిలో కనువింద చేయనుంది. అక్కినేని అఖిల్, శ్రియా భూపాల్ ప్రేమకు పెద్దల ఆశీర్వాదం తోడవడంతో ఇద్దరూ త్వరలో పెళ్ళి పీటలెక్కనున్నారు. వీరిద్దరి నిశ్చితార్ధం డిసెంబర్లో హైద్రాబాద్లో ఘనంగా జరగనుంది. ఇక పెళ్లి విషయమైతే ఇంకా అద్భుత ఘట్టం కానుంది. వధూవరుల కోరిక మేరకు ఇటలీలో చెయ్యాలని నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లోనే ఇంతవరకూ ఎవ్వరూ చెయ్యనంత ఘనంగా అక్కినేని నాగార్జున ఈ పెళ్లి కార్యక్రమాలు నిర్వహించనున్నాడట. ఈ సందర్భంగా ఈ వివాహ వేడుకకి సినీ, రాజకీయ రంగ ప్రముఖులకు ఆహ్వాన పత్రికలు అందజేయనున్నారట. దాదాపుగా 600 మంది ప్రముఖులు ఈ వేడుకకి విచ్చేయనున్నారనీ సమాచారం. డిసెంబర్లో జరిగే నిశ్చితార్ధ వేడుకే పెళ్ళి వేడుక అనేంతలా అతిరథమహారుథులతో నిండిపోనున్నట్లు తెలియవస్తోంది. అక్కినేని వారింట బాండ్ బాజా మోగుతున్నందుకు అభిమానులు తమ ఇంట్లో సంబరం అనేంతలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే అక్కినేని అఖిల్ హీరోగా విక్రమ్కుమార్ దర్శకత్వంలో ఓ సినిమా సెట్స్ మీదకు వెళ్ళాల్సి ఉంది. అది ఎంగేజ్మెంట్కి ముందా? తర్వాతా? అనేదానిపై స్పష్టత లేదు. ఇంకో వైపున నాగచైతన్య, సమంత - అఖిల్ ఎంగేజ్మెంట్ వేడుకకి సంబంధించిన పనుల్ని నాగార్జునతో కలిసి చూసుకుంటున్నారట.
|