ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ ఇటీవల నందమూరి హీరోలతో వెంట వెంటనే రెండు సినిమాలు చేశాడు. ఎన్టీయార్తో పూరి చేసిన 'టెంపర్' సినిమా మంచి విజయాన్ని అందుకుంది. కళ్యాణ్రామ్ హీరోగా పూరి జగన్నాథ్ రూపొందించిన 'ఇజం' సినిమా అంచనాల్ని అందుకోలేకపోయినా, ఓ మోస్తరు విజయాన్ని చవిచూసింది. ఇప్పుడు ఇంకోసారి నందమూరి హీరోతోనే పూరి జగన్నాథ్ సినిమా చేయబోతున్నాడని సమాచారమ్. ఆ నందమూరి ఎవరో కాదు, నందమూరి నటసింహం బాలకృష్ణేనని సినీ వర్గాల్లో టాక్ వినవస్తోంది. 'గౌతమి పుత్ర శాతకర్ణి' సినిమా తరువాత మంచి మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ చెయ్యాలనే ఆలోచనతో బాలకృష్ణ ఉన్నారట.
ఇది హీరోగా బాలకృష్ణకి 101వ సినిమా కానుంది. ముందుగా 101వ సినిమాని కృష్ణవంశీ డైరెక్షన్లో చేయాలనుకున్నారు బాలయ్య. అయితే కొన్ని కారణాలతో 'రైతు' ఆలస్యమయ్యేలా ఉందని సమాచారమ్. తనతో రెండు వరుస హిట్ సినిమాలు రూపొందించిన బోయపాటి శ్రీను వైపు బాలకృష్ణ ఆలోచనలు సాగినప్పటికీ బోయపాటి వేరే సినిమాలతో బిజీగా ఉండడం వల్ల ఆ ఛాన్స్ పూరి జగన్నాథ్కి దక్కిందట. అయితే కృష్ణవంశీ 'రైతు' ఆగిపోలేదనీ, అది బాలకృష్ణకు 102వ చిత్రం కావొచ్చుననీ సినీ వర్గాల్లో గుసగుసలు వినవస్తున్నాయి. ఏదేమైనా పూరి జగన్నాథ్ సినిమాల్లో హీరో చాలా డిఫరెంట్గా ఉంటాడు. ఆ డిఫరెంట్ యాటిట్యూడ్కి బాలయ్య పవర్ తోడైతే అది సూపర్ హిట్ అవ్వకుండా ఉంటుందా?
|