Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
story reviews

ఈ సంచికలో >> శీర్షికలు >>

సాహితీవనం - వనం వేంకట వరప్రసాదరావు.

sahiteevanam
పాండురంగమాహాత్మ్యం

అత్యుత్తముడైన దైవము, అత్యత్తమమమైన  తీర్థము, అత్యుత్తమమైన క్షేత్రము ఒకేచోట  ఉన్న స్థలం ఏది స్వామీ? అని అగస్త్యుడు 
అడిగిన  ప్రశ్నకు అందుకు సమాధానము  యివ్వగలవాడు పరమశివుడే అనిచెప్పి  ఆయనను వెంటబెట్టుకుని కైలాసానికి వెళ్ళాడు
కుమారస్వామి. అదే ప్రశ్నను తన తండ్రిని  అడిగాడు. పరమశివుడు పరమానందభరితుడై అటువంటి పుణ్యక్షేత్రము పాండురంగమే అని చెప్పి, పుండరీక మహర్షి చరిత్రమును  చెప్పనారంభించాడు. ఆ సందర్భంగా పుండరీకుడి గుణ శీలాదులను వర్ణించి, ఆతడి  తపోనిష్ఠకు మెచ్చి శ్రీహరి అతడిని కరుణించడం గురించి వర్ణిస్తున్నాడు పరమశివుడు.

విపులవీక్షణ శక్తిచే వెండి కుండ
లీంద్రతలిమాంగ రుచిసుధ యెత్తి క్రోలి 
సంతత వ్రతకల్పనా జాయమాన
దుస్తరక్లేశమంతయుఁ దొలఁగఁ ద్రోచి            (తే)

విపులమైన వీక్షణాశక్తితో, చక్కగా చూస్తూ, శేషశాయిరూపము అనే అమృతాన్ని త్రాగి, నిరంతరమూ వ్రతముతో, తపస్సుతో కలిగిన దుర్భరమైన బాధను మరిచిపోయినాడు  పుండరీకుడు. యిది ఈ పద్యానికి లోగడ మహానుభావులు ఐన వ్యాఖ్యాతలు భావించిన 
తాత్పర్యము.

అల్పజ్ఞుడు ఐన ఈ వ్యాసకర్తకు మాత్రం యిక్కడ 'యోగమార్గములో, కుండలినీ  శక్తిని మేలుకొలిపి, సహస్రారములో సహస్రదళ పద్మములో తన ఇష్టదైవాన్ని చూసి, ఆ అనుభూతి యనే అమృతాన్ని, ఆ దర్శనము అనే అమృతాన్ని కడుపారా త్రాగి, మరలా (వెండి)కనులు విప్పార్చుకుని తన ఎదురుగా సాక్షాత్కరించిన స్వామిని లౌకికచక్షువులతో  దర్శించాడు పుండరీకుడు' అని తెనాలి రామకృష్ణుడు భావించినట్లు అనిపించింది. సాహసమును పెద్దలు మన్నింతురుగాక. ఇంతకుముందు పుండరీకుడు యోగమార్గములో  కుండలినీ శక్తిని సాధించి, పరమాత్ముడిని దర్శించుకున్నాడు అని స్పష్టంగా చెప్పిఉన్నాడు  తెనాలి రామకృష్ణుడు. కుండలినీశక్తి సర్పాకృతిలో ఉంటుంది అనీ విపులంగా చర్చ  చేసుకున్నాము మనము. దానినే యిక్కడ చెబుతున్నాడు రామకృష్ణుడు.

ఆవు నదల్చు పచ్చ వెదురంఘ్రియుగాంతర వీథి నూఁది య
గ్రావనిఁ దేజరిల్లు కటిహస్తసమన్వితుఁ, గౌస్తుభాంకు, నిం
దీవిభు, నింద్ర నీలనిభ దేహుఁ గనుంగొని హర్షవర్షధా
రా విలమానసుండగుచు నమ్ముని కృత్యవిమూఢబుద్దియై               (ఉ)

ఆవులను అదిలించడానికి ఉపయోగించే పచ్చని వెదురును రెండుకాళ్ళ మధ్యన  యిరికించుకుని(??!!)తన ఎదురుగా తేజస్సుతో వెలుగుతున్న మూర్తిని చూశాడు  పుండరీకుడు. తెనాలి రామకృష్ణుని భావాలు ఒక్కొక్కచోట చాలా విచిత్రంగా,  ఉలికిపడేట్లుగా, అంచనాలకు అందకుండా ఉంటాయి. అలాంటిదే ఈ ప్రయోగము! ఆ సమయానికి తన కుటీర ప్రాంతములో గోవును మేపుతున్నాడు పుండరీకుడు. మనసుకు  మాత్రము ఆ ఆది గోపాలకుడి రూపును మేపుతున్నాడు. లౌకిక కర్మలను నిర్వర్తిస్తూనే నన్ను  నిరంతరమూ ఎడబాయక సేవించుకొనవచ్చు అని శ్రీ కృష్ణుడు ఋషిపత్నులకు, గోపికలకు  చెబుతాడు, సర్వకాల సర్వావస్థలలో నన్ను ధ్యానించుకోవడం కన్నా మిన్నయైన పూజ, భక్తీ  లేదు అని చెబుతాడు, దానిని యిక్కడ నాటకీయంగా చెబుతున్నాడు తెనాలి రామకృష్ణుడు. తన కనుల ఎదురుగా కనిపించిన ఆ దివ్యమంగళ విగ్రహాన్ని చూశాడు పుండరీకుడు. నడుముపై చేతులను ఉంచుకున్నవాడిని, కౌస్తుభమణితో వెలుగుతున్ నవాడిని చూశాడు.  యిందిరా రమణుడిని, యింద్రనీలమణికాంతులను వెలయించే శరీరకాంతిని గలవాడిని  చూశాడు. సంతోషము అనే వర్షధారలచే తడిసిన మనసుతో, సంభ్రమంతో, ఏమీ పాలుపోనివాడిలా, నిశ్చేష్టుడై చూస్తుండిపోయాడు. ఇక్కడ మరలా ధ్వని ఏమిటంటే, యింతవరకూ యోగమార్గంలో  సహస్రారంలో ఆయనను చూసిన అమృతపు జల్లు, యిప్పుడు ప్రత్యక్షంగా చూసిన ఆనందపు 
వర్షపు  జల్లు, తనివిదీరా తడిసి ముద్దయైపోయాడు పుండరీకుడు!

విలిఖితమో! శిలాక్రుతమొ! విస్మృతి రూపు వహించెనో! యనన్ 
జలనవిదూరుఁడయ్యుఁ , దొలుసావి పయోధరధారఁ దోఁగున
య్యిలఁ దలయెత్తు క్రొత్తపులునేపున, వే పులకల్ తనూలతన్
మొలవఁగ నున్న నవ్వి యదుముఖ్యుడు తాపసముఖ్యు నిట్లనున్             (చ)

విలిఖితము అంటే చక్కగా లిఖింపబడినది, చిత్రింపబడినది, అంటే చిత్తరువు.  బొమ్మలా నిలుచుండిపోయాడు పుండరీకుడు. శిలాకృతిలా శిల్పంలా నిలుచుండిపోయాడు. ఉలుకూ పలుకూ లేదు. ఆ సాక్షాత్కరించిన మాయలవాడు ఒక్క నవ్వు నవ్వాడు. ఎలా 
నవ్వాడూ అంటే, శ్రావణమాసపు తొలి వర్షపు చినుకులకు తలలెత్తే కొత్త మొలకలలాగా  నిలువెల్లా 'వేల'పులకలు మొలిచేట్లుగా, వెంటనే పులకలమొలకలు తలెత్తేట్లుగా నవ్వాడు. అంత అందంగా, మాయగా, హాయిగా, చిలిపిగా నవ్వి, ఆ యదుముఖ్యుడు శ్రీకృష్ణుడు 
తాపసముఖ్యుడు ఐన పుండరీకుడితో యిలా అన్నాడు.

'నిచ్చలు నిచ్చలోఁ బొదలు నీ పితృభక్తికి, జ్ఞానశక్తికిన్,
మెచ్చితి, వచ్చితిన్ గరము నీయెడ; నీయెడ యేల? వేడుకొ
మ్మిచ్చెదఁ జెచ్చెరన్ వలయునీప్సితముల్ శతమేని; దీననే 
పొచ్చెము నొచ్చెమున్ జొరదు భూసురకేసరి! నమ్ము' నావుడున్     (ఉ)

'ఎల్లపుడూ నీ మనసులో మెదిలే నీ పితృభక్తికి, నీ జ్ఞాన శక్తికి మెచ్చాను. నీకు వరమును  యివ్వడానికి యిక్కడికి వచ్చాను. యింకా తాత్సారము ఎందుకు? వెంటనే నీకు యిష్టము  ఐన కోరికలు వందయైనా సరే, కోరుకో! యిచ్చెదను. యిందులో ఏ తేడా గీడా  రాదు, 
బ్రాహ్మణకేసరీ, నా మాటలను నమ్ము' అన్నాడు ఆ స్వామి.

భస్మోద్దూళన పాండురాంగము రమాప్రాణేశు పాదద్వయిన్ 
విస్మేరాంబుజగామి హంసమిది నా వే వ్రాల్చుచున్ లేచి 'దే
వాస్మాకం శరణం త్వమేవ గతిరన్యా నాస్తి దుర్వాసనా 
పస్మారం హర' యంచుఁ బల్కి మఱియున్ భక్తుండు భక్తిస్పృహన్    (శా)

విస్మేర అంబుజగామి ఐన హంసలాగా, వికసించిన పద్మమును చూసి చటుక్కున వాలే  హంసలాగా, ఈ పరమహంస ఐన పుండరీకుడు ఆ పాదములు అనే పద్మములను చూసి  వాటిమీద వాలిపోయాడు! పుండరీకుని శరీరము కూడా భస్మముతో, అంటే ధూళితో, తెల్లగా ఉన్నది! ఆ రమాప్రాణనాథుని పాదాలమీద పడి, లేచి ' దేవా! నాకు నీవే శరణము! వేరే ఎవరూ లేరు! నా జన్మ జన్మల దుర్వాసనలను హరింపజేయి స్వామీ! సంచిత, ప్రారబ్ధ  కర్మముల వాసనలతోబాటు ఆగామి దుర్వాసనలను కూడా నాశనం చేసెయ్యి స్వామీ, యిక కర్మక్షయము కావాలి, జన్మరాహిత్యం కావాలి, ముక్తి కావాలి! అందుకు 'అన్యథా  శరణం నాస్తి! త్వమేవ శరణం మమ! తస్మాత్ కారుణ్యభావేన రక్ష రక్ష జనార్దనా!'
అని ఆ భక్తుడు పుండరీకుడు భక్తి స్పృహతో యిలా ఆ దేవదేవుడిని స్తుతించడం  మొదలుబెట్టాడు.

(పాఠకమిత్రులకు, 'గో తెలుగు' మిత్రులకు, నూతన ఆంగ్ల సంవత్సరశుభాకాంక్షలతో, 

కొనసాగింపు వచ్చేవారం)
మరిన్ని శీర్షికలు
bad habits part  in heart  attack