ఎప్పుడూ రొటీన్ కమర్షియల్ సినిమాలే చేసుకుంటూ పోతే ఎలా? అన్న ఆలోచన యంగ్స్టర్స్లోనే కాదు, సీనియర్ హీరోల్లోనూ కలుగుతోంది. అందుకే అందరూ ఇప్పుడు ప్రయోగాత్మక సినిమాలవైపు అడుగులేస్తున్నారు. నాగార్జున 'ఊపిరి', 'ఓం నమో వెంకటేశాయ' సినిమాలు చేస్తే, చిరంజీవి రీ-ఎంట్రీలో ఫక్తు కమర్షియల్ సినిమా చేసినా, తదుపరి సినిమాగా ఓ ప్రయోగాత్మక సబ్జెక్ట్పై దృష్టి సారించాడు. రామ్చరణ్ కూడా అంతే. 'ధృవ' సినిమా తరువాత చరణ్, సుకుమార్తో చేస్తున్నది ప్రయోగాత్మక సినిమానే. ఈ కోవలో విక్టరీ వెంకటేష్ కూడా చేరాడు. 'దృశ్యం', 'గోపాలగోపాల', 'గురు' ఇలా అన్నీ ప్రయోగాత్మక చిత్రాలే. ఈ బాటలోనే మరో డిఫరెంట్ సబ్జెక్ట్ని వెంకటేష్ ఓకే చేశాడని సమాచారమ్. క్రిష్ డైరెక్షన్లో ఈ చిత్రం రాబోతోంది.
సీనియర్ హీరోల్లో బాలకృష్ణ కూడా 'గౌతమి పుత్ర శాతకర్ణి' అనే ఎవరూ టచ్ చేయని సబ్జెక్ట్తో ఈ సంక్రాంతికి సత్తా చాటాడు. వెంకటేష్ 'గురు' విడుదలకు సిద్ధంగా ఉంది. ఇది బాలీవుడ్ సినిమా 'సలా ఖదూస్' సినిమాకి రీమేకే అయినా, తెలుగు సినీ ప్రేక్షకులకు ఇది చాలా కొత్త సబ్జెక్ట్గా చెప్పవచ్చు. ఏదేమైనప్పటికీ సినిమా సినిమాకీ ప్రయోగాత్మకమైన కథల్ని ఎంచుకుంటున్నవారందరినీ అభినందించి తీరాలి. తెలుగు సినిమా దేనికీ తక్కువ కాదని నిరూపించడానికి సీనియర్లు, జూనియర్లు పోటీ పడ్తోంటే, ఆ పోటీని చూసేందుకు చాలా ముచ్చటగా ఉంది.
|