మనకి పొరుగింటి పుల్ల కూర అంటే మక్కువెక్కువ. టాలీవుడ్లో ముద్దుగుమ్మల విషయానికే వస్తే, ఎంతో మంది తెలుగు భామలు బోలెడంత టాలెంట్ ఉండీ, ఇక్కడ అవకాశాలు దొరక్క పర భాషా చిత్రాల్లో సత్తా చాటుతున్నారు. ఎందుకంటే వారి ప్లేస్లో ఇక్కడ పరభాషా ముద్దుగుమ్మలు తమ హవా చూపిస్తున్నారు. అందుకే మన తెలుగు వాళ్లకి మంచి ఆదరణ దక్కాలంటే వారిని తగు విధంగా ప్రోత్సహించాలంటున్నారు డైరెక్టర్ ఇంద్రగంటి మోహన్ కృష్ణ. డైరెక్షన్లో ఈయనది ఓ ప్రత్యేక శైలి. 'అష్టా చెమ్మా' సినిమాని తెలుగు నటీనటులతో తెరకెక్కించారు.
ఈ సినిమాతోనే నాని, స్వాతి వంటి వారు తెలుగు తెరకు పరిచయం అయ్యారు. అదో డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీ. ఎన్ని సార్లు చూసినా బోరే కొట్టదు. ఆ తర్వాత ఇటీవల వచ్చిన 'జెంటిల్మెన్' సినిమాతో మరో డిఫరెంట్ కాన్సెప్ట్ని పరిచయం చేశాడు. అలాగే యంగ్ హీరో నానిలోని నెగిటివ్ షేడ్స్ని కూడా బాగా వాడుకోవచ్చునని ఆయన ఈ సినిమా ద్వారా నిరూపించారు. తాజాగా ఈయన డైరెక్షన్లో ఎ గ్రీన్ ట్రీ ఎంటర్టైన్మెంట్స్ సంస్థ ఓ సినిమా రూపొందిస్తోంది. ఈ సినిమాలో ఇంద్రగంటి అందర్నీ తెలుగు వాళ్లనే నటీ నటులుగా తీసుకున్నారట. అవసరాల శ్రీనివాస్, అడవి శేష్, ఈషా, అదితి మ్యానికల్లు ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఈ ఇద్దరు ముద్దుగుమ్మలు అక్షరాలా పదహారణాల తెలుగమ్మాయిలు అంతేకాదు ఈ సినిమాకి పని చేసే టెక్నీషియన్స్ కూడా తెలుగు వాళ్లే కావడం విశేషం.
|