పాట, ఆట ఎవరికీ సొంతం కాదు. ఒక్కసారి ఏదన్నా పాట బయటకు వచ్చిందంటే, దాన్ని ఎవరైనా ఎలాగైనా పాడేసుకోవచ్చు. ఆట అయినా అంతే. అయితే ఇప్పుడు పాట వివాదాస్పదమవుతోంది. తన పాటని కొందరు సొమ్ము చేసుకోవడాన్ని ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ మేరకు ఆయన నోటీసులు పంపారు. ఆ నోటీసులు అందుకున్న వ్యక్తి ప్రముఖ గాయకుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం. సినీ రంగంలో ఇద్దరూ దిగ్గజాలే. ఒకరి స్థాయి తక్కువ ఇంకొకరి స్థాయి ఎక్కువ అని అనలేం. ఎందుకంటే పాటలు పాడటంలో బాలసుబ్రహ్మణ్యం స్థాయి ఎలాంటిదో, సంగీత దర్శకుడిగా ఇళయరాజా స్థాయి కూడా అంతే.
ఇద్దరికీ తెలుసు తమ పాట తమకు మాత్రమే సొంతం కాదని. సినిమా పాట పుట్టాలంటే దాని వెనుక పెద్ద కథే ఉంటుంది. సంగీత దర్శకుడు ట్యూన్ చెయ్యాలి, పాటల రచయిత ఆ పాటని రాయాలి. గాయకుడు లేదా గాయని ఆ పాటని పాడాలి. ఇదంతా జరగాలంటే నిర్మాత ఉండాలి. అలాగే ఎలాంటి పాట కావాలనేదానిపై దర్శకుడి ఆలోచన కూడా ముఖ్యం. కాబట్టి పాట ఏ ఒక్కరి సొత్తు అనుకోవడానికి వీల్లేదు. నిర్మాత నుంచి డబ్బు తీసుకోవడంతోనే సంగీత దర్శకుడు అయినా, పాటల రచయిత అయినా, గాయనీ గాయకులైనా ఆ పాట మీద హక్కులు కోల్పోతారనే వాదన ఒకటుంది. ఆడియో రైట్స్ అమ్మేయడంతోనే నిర్మాతకీ హక్కులు పోతాయనుకోవచ్చు. కాబట్టి పాట పేరుతో ఇద్దరు దిగ్గజాలు వివాదాల్లోకెక్కడం అర్థం లేని వ్యవహారమని పలువురు సినీ ప్రముఖులు అభిప్రాయపడటం జరుగుతోంది.
|