గోదావరి అందాల్ని వంశీకన్నా గొప్పగా ఎవరు చూపించగలరు? సీనియర్ దర్శకుడు వంశీ ప్రత్యేకత అదే. వంశీ ఒక్కరే కాదు, ఎంతోమంది గోదావరి అందాల్ని ఎంతో గొప్పగా చూపించినా, గోదావరి అందాల్ని ఇంకా ఇంకా గొప్పగా చూపడానికి ఆస్కారముంది. అది గోదావరి అందాల గొప్పతనం. ఆ గోదావరి అందాల్ని ఇంకా అందంగా చూపించడానికి వంశీ మరోసారి సిద్ధమయ్యారు. మధుర శ్రీధర్ నిర్మాణంలో వంశీ దర్శకత్వంలో రూపొందుతున్న 'ఫ్యాషన్ డిజైనర్ సన్ ఆఫ్ లేడీస్ టైలర్' సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. సుమంత్ అశ్విన్ ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. అలనాటి మేటి చిత్రం 'లేడీస్ టైలర్' సినిమాకి ఇది సీక్వెల్.
ఆ సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికీ తెలుసు. ఆ స్థాయిలో ఇప్పుడీ 'ఫ్యాషన్ డిజైనర్ సన్ ఆఫ్ లేడీస్ టైలర్' కూడా విజయం సాధిస్తుందని దర్శక నిర్మాతలు అంటున్నారు. ఈ మధ్యనే ఈ సినిమాకి సంబంధించిన ఓ ఆడియో సింగిల్ని విడుదల చేశారు. అందులో ప్రధానంగా గోదావరి అందాల్ని దర్శకుడు వంశీ చిత్రీకరించిన తీరు అందర్నీ ఆకట్టుకుంటోంది. పాట చూస్తే, గోదావరి అందాల భాష కేవలం వంశీకి మాత్రమే తెలుసేమో అనిపిస్తుంది. ఈ చిత్రంలో సుమంత్ అశ్విన్ తరఫున మనాలి రాథోడ్, అనీషా ఆంబ్రోస్, మానస హీరోయిన్లుగా నటిస్తున్నారు.
|