'సినిమా ఉన్నంత సేపు దాసరి మనతో ఉన్నట్లే.. సినిమా లేకపోవడమన్నది ఈ భూమ్మీద జరగని పని కదా. అలాగే దాసరి కూడా లేరన్న మాట జరగని పని. ఏ తెలుగు దర్శకుడికి ఎక్కడ గౌరవం దక్కినా అందులో దాసరి గారుంటారు..'ఈ మాటలంటున్నది ఎవరో కాదు ప్రముఖ డైరెక్టర్ క్రిష్. ఈ విధంగా ఆయనపై తనకున్న అభిమానాన్ని చాటుకున్నారు క్రిష్. ఒక్క క్రిష్కే కాదు. ఇలాంటి అనుభూతి ప్రతీ ఒక్క తెలుగువారిలోనూ ఉంది. అదే అందరిలోనూ దాసరి కలిగించిన స్ఫూర్తి. ఈ స్పూర్తి ఎప్పటికీ తెలుగు సినిమా పరిశ్రమలో కొనసాగాలి. అదే ఆయనకి ఇచ్చే నిజమైన గౌరవం. అనారోగ్యంతో ఈ నెల 17న కిమ్స్ ఆసుపత్రిలో చేరిన దాసరి 30న కన్ను మూశారు.
తెలుగు సినిమాకి పెద్దన్న ఇక లేరు అన్న మాట విని టాలీవుడ్ ఇండస్ట్రీ ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురైంది. ఆయన మరణం ఎవ్వరూ జీర్ణించుకోలేకపోయారు. ఈ జనరేషన్, ఆ జనరేషన్ అనే తేడా లేకుండా సినీ, రాజకీయ ప్రముఖులంతా ఆయన మృతి పట్ల సానుభూతి తెలిపారు. తెలుగు ఇండస్ట్రీలో ఏ చిన్న సమస్య వచ్చినా పెద్దాయన దాసరి ఉన్నారులే అనే పెద్ద దిక్కును కోల్పోయింది ఇండస్ట్రీ. 151 సినిమాలకు దర్శకత్వం వహించిన దర్శకుడిగా ఆయన ఘనత కెక్కారు. నాటి 'తాతా మనవడు' సినిమా దగ్గర్నుంచీ నేటి 'ఎర్రబస్సు' వరకూ ఆయన దర్శకత్వంలో సినిమాలు వస్తూనే ఉన్నాయి. దర్శకత్వం ఒక్కటే కాదు దాసరి బహుముఖ ప్రజ్ఞాశాలి. అందుకే కథ, మాటలు, స్క్రీన్ప్లే, పాటలు, నిర్మాత, దర్శకత్వం దాసరి నారాయణరావు అనే టైటిల్ కార్డులో మొట్టమొదటి చిట్ట చివరి వ్యక్తి మీరే అని ప్రముఖ దర్శకుడు వైవియస్ చౌదరి వ్యాఖ్యానించారు. ఆయన సినీ ప్రస్థానం మాటల్లో చెప్పదగ్గది కాదు. దాసరి ఓ వ్యక్తి కాదు ఓ మహా అద్భుత శక్తి.
|