మెగాస్టార్ హీరోగా తెరకెక్కుతోన్న 'సైరా నరసింహారెడ్డి' సినిమా సెట్స్ మీదకి వెళ్లేందుకు అంతా సిద్ధమైంది. అక్టోబర్లో సినిమా సెట్స్ మీదకు వెళుతోంది. టైటిల్ మోషన్ పోస్టర్ సంచలనాలకు కేంద్ర బిందువయ్యింది. సినిమా సెట్స్మీదకు వెళితే సరికొత్త రికార్డులు షురూ అయినట్లే. రోజుకో సెన్సేషనల్ న్యూస్తో 'సైరా నరసింహారెడ్డి' వార్తల్లో నిలవడం ఖాయం. హాలీవుడ్ టెక్నీషియన్లను ఈ సినిమా కోసం వినియోగించనున్నారు. తెలుగు సినిమానే, అలాగే ఇది ఇండియన్ సినిమా కూడా. 'బాహుబలి' స్థాయిలో సినిమాని తెరకెక్కించబోతున్నారట. అదే స్థాయిలో ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారట కూడా. ఈ సినిమా బడ్జెట్కి ఆకాశమే హద్దు.
రామ్ చరణ్ నిర్మాణంలో కొణిదెల ఆర్ట్స్ బ్యానర్లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఈ చిత్రం రూపొందుతోంది. బడ్జెట్ విషయంలో ఎక్కడా రాజీ పడేది లేదనీ రామ్ చరణ్ ముందు నుండీ చెబుతూనే ఉన్నారు. చిరంజీవితో పాటు బిగ్బీ అమితాబ్ బచ్చన్, బ్యూటీ నయనతార, రైజింగ్ స్టార్ జగపతిబాబు, కన్నడ స్టార్ సుదీప్ ఇలా ప్రముఖ తారాగణం ఈ సినిమాలో కనిపించబోతున్నారు. సురేందర్రెడ్డి డైరెక్షన్లో తెరకెక్కుతోంది ఈ చిత్రం. షూటింగ్ మొదలైతే, శరవేగంగా చిత్రీకరణ పూర్తి చేయాలనే ఆలోచనతో ఉన్నట్లు తెలియవస్తోంది. పరుచూరి బ్రదర్స్ ఈ సినిమాకి కథనందించారు. 2018 వేసవిలో 'సైరా నరసింహారెడ్డి'ని' ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే యోచనలో ఉన్నారు చిత్ర దర్శక నిర్మాతలు.
|