దాదాపు 400 కోట్ల రూపాయలు ఖర్చు చేసి మరీ 'రోబో 2.0' సినిమాని తెరకెక్కించారు. ఇంత భారీ ఖర్చుతో సినిమా తెరకెక్కించడం దర్శకుడు శంకర్కే చెల్లింది. శంకర్ సినిమాల్లో భారీతనం కొత్తేమీ కాదు. సినిమా సినిమాకీ ఆ భారీతనం పెంచుకుంటూ పోతుంటారాయన. సినిమా కోసం భారీగా ఖర్చు చేయడం మాత్రమే కాదు, ఆ సినిమాపై కనీ వినీ ఎరుగని రీతిలో అంచనాల్ని సృష్టించడంలోనూ శంకర్ ప్రత్యేకతే వేరు. అలాంటి శంకర్తో రజనీకాంత్ సినిమా అంటే ఆ అంచనాలకు ఆకాశమే హద్దు. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన 'శివాజీ', 'రోబో' సినిమాలు సంచలన విజయాల్ని అందుకున్నాయి. ఆ కోవలోనే ఇప్పుడు 'రోబో' సీక్వెల్ '2.0' ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
ఈ సినిమా ఆడియో విడుదల వేడుకని దుబాయ్లో అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. ఆ తర్వాత సినిమా టీజర్ని హైద్రాబాద్లో విడుదల చేస్తారు. అలాగే చెన్నయ్లో ఈవెంట్ని ప్లాన్ చేశారు. దేనికదే అన్నట్లుగా ఒక్కో ఈవెంట్నీ నభూతో నభవిష్యతి అనేలా ప్లాన్ చేశారట. ఈ ఈవెంట్స్ అన్నిటిలోనూ సినిమాకి చెందిన ముఖ్యమైన నటీనటులు, సాంకేతిక వర్గం హాజరవుతుందని సమాచారమ్. రజనీకాంత్ సినిమా అంటే దేశంలోని దాదాపు అన్ని భాషల్లోనూ క్రేజ్ సంపాదించుకుంటుంది. తెలుగులో స్టార్ హీరోల మార్కెట్కి ధీటుగా రజనీకాంత్ సినిమాలకు మార్కెట్ ఉంటుంది. హిందీలోనూ అంతే. తమిళంలో అయితే తిరుగే లేదు. ఏదేమైనప్పటికీ ఆకాశాన్నంటే అంచనాలతో ప్రేక్షుల ముందుకొచ్చేందుకు సిద్ధమవుతోన్న '2.0' విడుదలకు ముందే అత్యద్భుతమైన ఈవెంట్స్ మనల్ని రంజిపంజేయనుండడం వెరీ వెరీ స్పెషల్ కదా!
|