త్రివిక్రమ్ - పవన్ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న సినిమా 'అజ్ఞాతవాసి'. ఈ సినిమా ఆడియో ఫంక్షన్ తాజాగా హైద్రాబాద్లో ఘనంగా నిర్వహించారు. ఈ ఫంక్షన్లో పవన్, త్రివిక్రమ్ ఇద్దరూ చాలా కొత్తగా కనిపించారు. సరికొత్తగా తమ ప్రసంగాలతో ఆకట్టుకున్నారు. ఇంతవరకూ త్రివిక్రమ్ ఇలా ఎప్పుడూ మాట్లాడలేదు. తన సినిమా గురించి కానీ, పవన్ కళ్యాణ్ గురించి కానీ ఇంతగా ఎప్పుడూ చెప్పలేదు. కానీ ఎందుకో ఈ సినిమా విషయంలో త్రివిక్రమ్ కొత్తగా ప్రవర్తించాడు. అసలే క్రేజీ కాంబినేషన్. ఆ కాంబినేషన్కున్న క్రేజ్ని ఎవ్వరు ఎంత ఎక్కువ చెప్పినా తక్కువే అవుతుంది. సినిమాకి పని చేసిన ప్రతీ ఒక్కర్ని పేరు పేరునా గుర్తు చేసి ప్రశంసించాడు త్రివిక్రమ్.
పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే ఆయన కూడా అభిమానులనుద్దేశించి చాలా మాట్లాడారు. 'నా హితులు, సన్నిహితులు, నేను చేయూతనందించిన వారూ నన్ను వదిలి వెళ్లినా, ఎప్పుడూ నా వెంట ఉన్నది మాత్రం అభిమానులే . ఆ ధైర్యంతోనే నేను ఇన్ని సినిమాలు చేయగలిగాను. లేదంటే 'ఖుషీ' తర్వాతనే సినిమాలు మానేయ్యాలనుకున్నాననీ.. మీరు చూపిన అభిమానమే 25 చిత్రాలు చేసేలా నన్ను ప్రోత్సహించిందనీ ఆయన అన్నారు. అంటే అభిమానుల కోసం ఇన్ని సినిమాలు చేశానని చెప్పాడంటే రాజకీయాల్లోకి వచ్చినా కానీ సినిమాలు చేస్తాననే క్లారిటీ ఇచ్చేశాడు. పవన్ స్టేజ్ మీద కనిపిస్తే అభిమానుల్ని కంట్రోల్ చేయడం చాలా కష్టం. కానీ త్రివిక్రమ్ ఆగమన్నట్లుగా చేయి చూపిస్తే చాలు అభిమానులు కంట్రోల్ అయిపోయారు. అంటే పవన్తో పాటు ఆయనకి అత్యంత సన్నిహితుడైన త్రివిక్రమ్పైనా అభిమానులకు అంత గౌరవం ఉంది. అలాగే ఈ కార్యక్రమం మొదట్లోనే ఇక్కడికి వచ్చిన అభిమానులందరూ జాగ్రత్తగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇంటికి వెళ్లాలని, అభిమానులకు ఏ చిన్న బాధ కలిగినా పవన్ చాలా బాధపడతాడనీ, అలాగే అభిమానులే పవన్ సైన్యం, ఆ సైన్యంలో ఏ ఒక్కరు తగ్గినా అత్యంత బాధపడే వ్యక్తి పవన్ అని త్రివిక్రమ్ చెప్పాడు. ఇలాంటివి ఈ ఆడియో ఫంక్షన్లో చాలా జరిగాయి. ఇదో ఆడియో ఫంక్షన్లా కాకుండా ఓ ఆత్మీయ ఫంక్షన్లా జరిగిందని చెప్పాలి.
|