వర్మ ఎంచుకునే సినిమాలే వెరీ వెరీ స్పెషల్ అనుకుంటే, ఆ సినిమాల కోసం వర్మ ఎంచుకునే పాత్రలూ మరీ ప్రత్యేకంగా ఉంటాయి. యదార్ధ గాధల్లోని వ్యక్తులకు అచ్చంగా సూటయ్యే నటీ నటుల్ని ఎంచుకుంటాడు వర్మ. వర్మలోని స్పెషాలిటీ అదే. స్క్రీన్పై సదరు నటీనటులను చూస్తుంటూ పాత్రలు కనిపించవు, యదార్ధ వ్యక్తులే కనిపిస్తారు. అలాంటి వారిని ఏరి కోరి ఎంచుకుని తీసుకొస్తాడు వర్మ. వర్మ ఇంతవరకూ తెరకెక్కించిన బయోపిక్స్ తీసుకుంటే, 'రక్తచరిత్ర' కోసం పరిటాల రవి పాత్రలో వివేక్ ఒబెరాయ్ని, పరిటాల సునీతగా రాధికా ఆప్టేని, మద్దెల చెరువు సూరి పాత్రకి హీరో సూర్యని తీసుకొచ్చాడు.
ఈ ముగ్గురూ అచ్చంగా ఒరిజినల్ వ్యక్తుల్లానే సెట్ అయిపోయారు తమ తమ పాత్రల్లో. అలాగే 'వీరప్పన్' సినిమా కోసం వీరప్పన్ పాత్రకి ధియేటర్ ఆర్టిస్ట్ని తీసుకురావడం వర్మకే చెల్లింది. ఆ పాత్ర పోషించిన సందీప్ భరద్వాజ్ వీరప్పన్ పాత్రకి జీవం పోసేశాడు. ఇక 'వంగవీటి' సినిమా కోసం సందీప్ కుమార్నీ, వంగవీటి రత్నకుమారిగా నయనా గంగూలీని తీసుకొచ్చాడు వర్మ. అలా తాజా సినిమా 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమా కోసం వర్మ తీసుకురాబోయే ఆ నటీమణి ఎవరా అని ఇండస్ట్రీలో చర్చ జరుగుతోంది. స్వర్గీయ ఎన్టీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా వర్మ ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. తాజాగా విడుదలైన ఫస్ట్లుక్ ఆశక్తిని కలిగిస్తోంది. గడపలో అడుగుపెడుతున్న ఓ లేడీ పాదం, ఇంట్లోని కుర్చీలో కూర్చున్న ఓ పెద్దాయన.. ఈ లుక్కి వస్తోన్న రెస్పాన్స్ అదిరిపోతోంది. అలాగే సంచలనాలకూ వేదికైంది.
|