తన కుమారుడ్ని హీరోగా పరిచయం చేస్తూ ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ 'మెహబూబా' అనే సినిమా తెరకెక్కించేందుకు రంగం సిద్ధం చేశారు. అక్టోబర్లో సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. హిమాచల్ప్రదేశ్లో షూటింగ్ జరుగుతుందని పూరి జగన్నాథ్ ప్రకటించారు. ఇది భారత్ - పాక్ మధ్య 1971లో జరిగిన యుద్ధ నేపథ్యంలో సాగే ప్రేమకథ అట. పూరి జగన్నాథ్ నుంచి వచ్చిన చిత్రాలన్నిటిలోకీ ఇది ఓ భిన్నమైన ప్రేమకథగా చెప్పుకోవచ్చేమో. ఈ సినిమా నేపథ్యం అలాంటిది. 'చాలా కాలం తర్వాత మంచి ప్రేమకథ తీయబోతున్నాను' అని ఇంతకు ముందే పూరి, తన కుమారుడితో చేయబోయే సినిమా గురించి ప్రకటించారు.
ఆ మాట ప్రకారమే ఇప్పుడీ సినిమా టైటిల్ని అనౌన్స్ చేయడం జరిగింది. పూరి తనయుడు ఆకాష్, ఇప్పటికే పలు సినిమాలతో తానేంటో నిరూపించుకున్నాడు. 'చిరుత' సినిమాలో హీరో చిన్నప్పటి క్యారెక్టర్లో కన్పించిన పూరి ఆకాష్, ఆ తర్వాత మరికొన్ని సినిమాల్లోనూ కనిపించాడు. 'ధోనీ' సినిమాతో నటుడిగా మెప్పించి, విమర్శకుల ప్రశంసలు కూడా అందుకున్నాడు పూరి ఆకాష్. నటన మాత్రమే కాకుండా సినిమాకి సంబంధించిన అన్ని విభాగాలపైనా పూరి జగన్నాథ్, తన కుమారుడు పూరి ఆకాష్కి శిక్షణ ఇప్పించాడు. ఇంకో వైపున ఆకాష్ కూడా సినిమా పట్ల పూర్తి ప్యాషన్తోనే ఈ రంగంలోకి వచ్చాడు. ఏదేమైనప్పటికీ 'మెహబూబా' అనే టైటిల్తోనే సినిమాపై పూరి క్యూరియాసిటీ పెంచేశాడు. ఆయన సినిమా టైటిల్స్ భిన్నంగా ఉంటాయని ఇప్పుడు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. అది ఆయనకు అలవాటైపోయిందంతే.
|