వర్మ 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమా అనుకున్నప్పట్నుంచీ వివాదాలే వివాదాలు. ఏదో మూల నుండి వివాదాలు తలెత్తుతూనే ఉన్నాయి. ఎన్టీఆర్ జీవితంలోకి లక్ష్మీ పార్వతి ఎంటర్ అయిన నాటి నుండి ఆయన జీవితంలో కలిగిన పరిణామాలు, రాజకీయ పరిణామాల దృష్టి కోణంలో ఈ సినిమా తెరకెక్కిస్తానని వర్మ చెప్పారు. ఇక అంతే, ఆక్కడి నుండి మొదలైంది వివాదాల పర్వం. ఈ సినిమా నుండి ఆ ఒక్క పర్వమే తీసుకుని వర్మ సినిమా తెరకెక్కిస్తానన్నారు కానీ, ఒక్కో వివాదం ఒక్కో సినిమాగా తెరకెక్కించగలిగేటంతగా చెలరేగుతోంది. సోషల్ మీడియాలో అనేక రకాలుగా విమర్శలు ఎదుర్కొంటున్నాడు వర్మ. మరో పక్క టీడీపీ నాయకుల నుండి ఒత్తిడి ఎక్కువైంది. అలనాటి నటి వాణీ విశ్వనాథ్ ఈ సినిమా ద్వారా నెగిటివ్ని చూపించే ప్రయత్నం చేస్తే ఊరుకోననీ, హెచ్చరించింది.
ఇక ఎన్టీఆర్ పాత్రలో ప్రకాష్రాజ్ అనీ, లక్ష్మీ పార్వతిగా రోజా నటించబోతున్నారంటూ అదో వివాదం తలెత్తింది. ఇవన్నీ చాలవన్నట్లుగా తాజాగా సీఎం చంద్రబాబు కూడా ఈ విషయంపై స్పందించారు. ఎన్టీఆర్ చరిత్ర తెరిచిన పుస్తకం, వాస్తవాలను వక్రీకరిస్తే ప్రజలు హర్షించరు..సో ఈ విషయంపై పెద్దగా స్పందించాల్సిన అవసరం లేదంటూ సీఎం పార్టీ నాయకులనుద్దేశించి వర్మకి తెలిసేలా వివరించారు. ఇలా ఒకటి కాదు, అనేక రకాలుగా వివాదాలు ఈ సినిమాని చుట్టుముడుతూనే ఉన్నాయి. సినిమా ఇంకా సెట్స్ మీదికి వెళ్లనే లేదు. ఇప్పుడే ఇన్ని వివాదాలు.. ఈ వివాదాలు ఓ రకంగా మంచివే. సినిమాకి ఫ్రీగా బోలెడంత పబ్లిసిటీ తెచ్చిపెడుతున్నాయి. ఇక నటీ నటుల విషయంలో అంతా కొత్త వారినే ఈ సినిమా కోసం ఎంచుకోనున్నారనీ వర్మ స్పష్టం చేశారు. త్వరలోనే నటీనటుల వివరాలు వర్మ స్వయంగా ప్రకటించనున్నారు. సినిమా ఫిబ్రవరిలో సెట్స్ మీదికి వెళ్లనుంది. వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే సి. రాకేష్రెడ్డి నిర్మాతగా వ్యవహరించనున్నారు.
|