ఓ సినిమా పూర్తయ్యాకే ఇంకో సినిమాకి కమిట్ అవుతూ ఉంటాడు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. అయితే ఈ సారి ట్రెండ్ మార్చినట్లున్నాడు. 'అజ్ఞాతవాసి' సినిమా షూటింగ్లో ఉన్నప్పుడే ఎన్టీఆర్తో సినిమాకి కమిట్ అయ్యాడు. లాంఛనంగా ప్రారంభమైంది ఆ సినిమా. ఆ సినిమా ప్రారంభోత్సవానికి పవర్స్టార్ పవన్ కళ్యాణ్ ముఖ్య అతిధిగా విచ్చేశారు కూడా. ఇక షూటింగ్ స్టార్ట్ అవ్వాల్సి ఉంది ఆ సినిమా. తర్వాత వెంకీతో ఓ సినిమా కన్ఫామ్ చేశాడు త్రివిక్రమ్. వరుసగా ఈ మూడు సినిమాలు హారికా, హాసినీ క్రియేషన్స్ బ్యానర్లోనే రూపొందుతుండడం విశేషం. ఒక సినిమా సెట్స్ మీద ఉండగానే మరో సినిమా, ఆ వెంటనే ఇంకో సినిమాకి కమిట్ అవ్వడం త్రివిక్రమ్ ఇదే తొలిసారి అని చెప్పొచ్చు. ఏకంగా త్రివిక్రమ్ చేతిలో ఈ క్షణం మూడు సినిమాలున్నాయి.
అందులో 'అజ్ఞాతవాసి' త్వరలో రిలీజ్కి రెడీగా ఉండగా, ఎన్టీఆర్ సినిమా రేపో మాపో సెట్స్ మీదికెళ్లనుంది. ఆ వెంటనే వెంకీ సినిమా పట్టాలెక్కనుంది. ఇవి కాక మరో రెండు ప్రాజెక్టులున్నాయి త్రివిక్రమ్కి. మహేష్బాబుతో త్రివిక్రమ్ ఓ సినిమా చేయాల్సి ఉంది. పవన్ కళ్యాణ్ - త్రివిక్రమ్ కాంబినేషన్లాగే, మహేష్ - త్రివిక్రమ్ కాంబోకీ మంచి క్రేజ్ ఉంది. ఈ సినిమా ఇంకా చర్చల దశలో ఉంది. అలాగే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్తో ఓ సినిమా పెండింగ్లో ఉంది. ఇలా చూస్తే త్రివిక్రమ్ డైరీ ఇప్పట్లో ఖాళీ అయ్యేలా లేదు. వరుస సినిమాలతో బిజీయెస్ట్ డైరెక్టర్ అయిపోయాడు త్రివిక్రమ్. తాజా సినిమా 'అజ్ఞాతవాసి'తో వచ్చే ఏడాది బోణీ కొట్టనున్నాడు మన మాటల మాంత్రికుడు. జనవరి 10న సంక్రాంతి కానుకగా 'అజ్ఞాతవాసి' ప్రేక్షకుల ముందుకు రానుంది.
|