Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
book review

ఈ సంచికలో >> శీర్షికలు >>

ప్రపంచ తెలుగు మహాసభలు - - ప్రతాప వెంకట సుబ్బారాయుడు

prapancha telugu mahasabhalu

ప్రపంచ తెలుగు మహాసభలను స్పృశించిన ఓ రచయిత కలం!

"2017 డిసెంబర్ 15వ తేది నుండి 19 తేదీ వరకు"

ప్రపంచంలోని ఏ మూల ఉన్న తెలుగు భాషాభిమానికైనా ఇంతకంటే సంతోషాన్నిచ్చే విషయం ఉంటుందా?

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొట్టమొదటి సారి ఈ వేడుకలు హైద్రాబాదులో జరుగుతున్నాయి. అందుకే శ్రీ కే సిఆర్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని సుమారు 50 కోట్ల కర్చుతో వైభవంగా తెలుగుకు పట్టం కడుతోంది.

నెల రోజులముందు నుంచి తెలుగు భాష పండుగ సంబురాలు వేడందుకున్నాయి. అందరూ ఆ విషయం గురించే మాట్లాడుకోవడం మొదలెట్టారు. ఆన్ లైన్లోనూ, వ్యక్తిగతంగాను రెజిస్ట్రేషన్ చేసుకోవచ్చని ప్రభుత్వం తెలియజేయడంతో దరఖాస్తులు వెల్లువెత్తాయి.

 

 

 

సరిగ్గా మూడు నాలుగు రోజులముందు, వేదికలకు దారి తీసే రహదారుల మీద మహనీయుల పేరిట ఏర్పాటు చేసిన  స్వాగత తోరణాలు స్ఫూర్తిదాయకంగా ఉండి ఆ మహానుభావులను స్మరించుకునే అవకాశం కల్పించాయి.

రవీంద్రభారతిలో 14/12/17 న రెజిస్ట్రేషన్ చేయించుకున్నవారికి కిట్ల (సామాగ్రీ) పంపిణీ చేపట్టారు.

సంచిలో-

1. ప్రతినిధి గుర్తింపు పత్రం

2. కార్యక్రమ కరదీపిక

3. ప్రశంసా పత్రం

4. మన తెలుగు లఘు పుస్తకం

5. వాగ్భూషణం భూషణం-డా. ఇరివెంటి కృష్ణమూర్తి

6. తెలంగాణ వైభవం పరిచయ దీపిక -ఉన్నాయి.

 

సంచితో సహా ఎందులోనూ నాణ్యత విషయంలో ఎక్కడా రాజీపడలేదు. పది కాలాల పాటు దాచుకో తగ్గట్టుగా ఉన్నాయి.

అనుకున్న 15 వ తారీకు రానే వచ్చింది. ఎల్ బి స్టేడియం కి వెళ్లే రహదారులన్నీటీతో సహా స్టేడియమూ విద్యుద్దీపాలతో, తెలుగు మాటల గుబాళింపులతో అంగరంగ వైభవంగా ముస్తాబయింది.

ప్రారంభ వేడుకలకు ముఖ్య అథిధిగా విచ్చేసిన ఉప రాష్ట్రపతి శ్రీ వెంకయ్యనాయుడు, రాష్ట్ర గవర్నర్ శ్రీ నరసింహన్, మహరాష్ట్ర గవర్నర్ శ్రీ  సి హెచ్ విద్యాసాగర్ రావ్, ముఖ్యమంత్రి శ్రీ కే సి ఆర్ తమ తెలుగు ముచ్చట్లను ఆహూతులతో పంచుకున్నారు.

ఇప్పటివరకు ఏ వేదికపై కూడా తెలుగులో మాట్లాడని ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ తొలిసారిగా తెలుగులో ప్రసంగించి అందరినీ అశ్చర్యచకితులను చేశారు.

తెలంగాణ సంస్కృతిని, సంప్రదాయాను ప్రతిబింబించే సాంస్కృతిక కార్యక్రమాలు అందర్నీ అలరించాయి.

కార్యక్రమానంతరం పెద్దఎత్తున బాణసంచా కాల్చారు. ఆకాశంలో  మిరమిట్లుగొలికే వెలుగు రేఖల్ని చూసి అందరు అచ్చెరువందారు.

ఎల్బి స్టేడియం, తెలుగు విశ్వవిద్యాలయం, రవీంద్రభారతి, తెలంగాణ సారస్వత పరిషత్ సభా భవనాలలో జరిగిన సాహిత్య సభలు, కవి సమ్మేళనాలు, అష్టావధానం, బాల కవి సమ్మేళనాలు ఆహూతుల్ని ఎంతగానో రంజింపజేశాయి.

పోలీసులు, ట్రాఫిక్ పోలీసులు, ఇతర రాష్ట్ర సిబ్బంధి విదేశాల నుంచి, రెండు రాష్ట్రాల నుంచి విచ్చేసిన అథితులకు తమవంతు సహకారం అద్భుతంగా అందించారు. బయట నుంచి వచ్చినట్టుగా ఎవరూ భావించట్లేదంటే దానికి అదే కారణం. అందరిని హైద్రాబాదు ఒకటి చేసింది. ఒక ఇల్లయింది.

పుస్తకాల దుకాణాలు, తెలంగాణ వంటలు కొలువుదీరిన చిన్న చిన్న దుకాణాలు సరసమైన ధరకు చక్కటి ఆహార పదార్థాలు అందజేసి జనాన్ని ఆకట్టుకున్నారు.

ఇది గాకుండా రాష్ట్ర ప్రభుత్వం అందరికీ పెట్టిన షడ్రశోపేతమైన విందు ప్రత్యేక మార్కులేయించుకుంది. అందరూ మరీ మరీ నెమరేసుకున్నారు.

ఆరంభం ఎంత ఆర్భాటంగా జరిగిందో రాష్ట్రపతి శ్రీ రామనాథ్ కోవింద్ చేతుల మీదుగా ముగింపూ అంతే ఆడంబరంగా జరిగింది.

తెలంగాణ సాహిత్య అకాడమి అధ్యక్షులు శ్రీ నందిని సిధారెడ్డి, భాషా సాంస్కృతిక శాఖ కార్యదర్శి శ్రీ బుర్రా వెంకటేశం, తెలంగాణ సాహిత్య అకాడమి ఆర్యదర్శి డా. ఏనుగు నరసింహారెడ్డి లతో పాటు ప్రపంచ తెలుగు మహా సభలు న భూతో న భవిష్యతిగా విజయవంతమవడానికి తెరవెనుక ఎంతగానో శ్రమించిన ప్రతిఒక్కరికి ధన్యవాదాలు చెప్పుకోక తప్పదు.

ప్రతి భాషాభిమాని పదికాలాల పాటు తలచుకుని మురిసిపోయే పండగ సంబురమిది అనడంలో అతిశయోక్తి లేదు. కార్యక్రమాల అనంతరం ఎంతో ఆనందం,  సభలు అయిపోయాయే అని ఒకింత బాధతో సొంత గూళ్లకు పయనమయ్యారు తెలుగు భాషాభిమానులు.

మరిన్ని శీర్షికలు