దీపికా పదుకొనె ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం 'పద్మావతి'. ఇప్పుడు టైటిల్ మారింది. 'పద్మావత్'' అయ్యింది. జనవరి 25న ఈ సినిమా రిలీజ్ కానుంది. అయితే రాజస్థాన్ సహా కొన్ని రాష్ట్రాలు ఈ సినిమాని ఇప్పటికే బ్యాన్ చేశాయి. తాజాగా హర్యానా రాష్ట్రం కూడా ఈ లిస్టులో చేరింది. ఇంకా దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాలు ఈ సినిమాని బ్యాన్ చేసే దిశగా ఆలోచన చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఓ ప్రత్యేక సమీక్షా కమిటీ ఆధ్వర్యంలో సెన్సార్ పనులు పూర్తి చేసుకుని, యు/ఎ సర్టిఫికెట్ అందిపుచ్చుకుంది 'పద్మావత్'. కొన్ని కత్తెరలు, మరికొన్ని ఆంక్షలతో సినిమాని విడుదల చేసేందుకు సెన్సార్ బోర్డ్ అనుమతించింది.
ముందుగానే ఈ కమిటీ సినిమా చూసి ఓకే చేసిన తర్వాతే సర్టిఫికెట్ ఇచ్చింది. అయినా కానీ సినిమాపై వస్తున్న వివాదాలు వీడలేదు. ఓ పక్క ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఓ పాఠశాలలో ఈ సినిమాలోని ఘుమర్ పాటను ఆలపించినందుకు కర్ణిసేన ఆ పాఠశాలపై దాడికి దిగిందట. తాజాగా ఈ పాటలో హీరోయిన్ నడుం చూపిస్తోందంటూ మరో కొత్త వివాదం తలెత్తింది. సినిమా విడుదల చేస్తే ధియేటర్లు బద్దలు కొట్టేస్తామంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇలా సినిమాపై ఏదో ఒక రకంగా కొత్త వివాదాలు తలెత్తుతూనే ఉన్నాయి. ఇంత గందరగోళం నడుమ అనుకున్న టైంకి ఈ సినిమా విడుదలవుతుందో లేదోననే సస్పెన్స్ ప్రస్తుతానికి కొనసాగుతూనే ఉంది. సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో దీపికాపదుకొనె ప్రధాన పాత్ర పోషిస్తోంది. రణ్వీర్ సింగ్, షాహిద్ కపూర్ ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. అన్నీ కలిసొస్తే ఈ సినిమా ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకు వస్తుంది.
|