లాంగ్ గ్యాప్ తర్వాత వచ్చాడు. రవితేజకిది సెకండ్ ఇన్నింగ్స్గానే భావించాలి. అలాంటిది వస్తూ వస్తూనే నార్మల్ ఎంటర్టైనర్ కాకుండా కొంచెం కొత్తగా ఆలోచించాడు. ప్రయోగం చేశాడు. అయినా లక్ కలిసొచ్చింది. హిట్ కొట్టాడు. ఇదంతా ఇప్పుడెందుకు చెప్పుకుంటున్నామంటే, మన మాస్ రాజా రవితేజ ఇకపై ప్రయోగాల జోలికి పోనంటున్నాడు ఎందుకో మరి. ఈ సంగతిలా ఉంచితే, 'రాజా ది గ్రేట్' సినిమాలో అంధుడిగా కనిపించి రవితేజ రిస్క్ చేశాడేమో అనుకున్నారంతా. కానీ అంధత్వం అనే లోపం హీరో క్యారెక్టర్కి ఎక్కడా ఆటంకం కలిగే ప్రయత్నం చేయకుండా ఆ పాత్రని డిజైన్ చేశాడు డైరెక్టర్. దాంతో ఇది ప్రయోగం అయినా కానీ ఆ ఛాయలు ఎక్కడా కనిపించలేదు. అయితే అసలు ప్రయోగాలు ముందున్నాయని చెప్పిన రవితేజ ఇప్పుడు మాట మార్చేస్తున్నాడట.
ఇకపై ప్రయోగాల జోలికి పోనంటున్నాడట. ఎప్పటిలాగే ఎనర్జిటిక్ మాస్ ఎంటర్టైనర్స్తోనే మెప్పిస్తానంటున్నాడు. అయితే అందులోనే కొంచెం కొత్తదనం ట్రై చేస్తానంటున్నాడు తప్ప ప్రయోగాల జోలికి పోడట. తాజాగా రవితేజ 'టచ్ చేసి చూడు' సినిమాతో ప్రేక్షకలు ముందుకు వచ్చాడు. ఈ సినిమా నిర్మాణంలో ఉండగానే ఆల్రెడీ కొత్త కథలు చాలానే విన్నాడట. వాటిలో కొన్ని చర్చల దశలో ఉండగా, మరికొన్ని ఓకే చేసేంతవరకూ వచ్చాయనీ తాజా సమాచారమ్. అందులో భాగంగా శీను వైట్ల దర్శకత్వంలో రవితేజ ఓ సినిమాకి కమిట్ అయ్యాడనీ తెలుస్తోంది. 'అమర్ అక్బర్ ఆంటోనీ' టైటిల్తో తెరకెక్కే ఈ సినిమాని మైత్రీ మూవీస్ సంస్థ నిర్మిస్తోంది. ఏప్రిల్లో ఈ సినిమా సెట్స్ మీదికి వెళ్లనుందట. రవితేజ ప్రయోగాలు చేస్తాడా? లేదా? అనే సంగతి పక్కన పెడితే, ఇదివరకటిలాగే ఏడాదికి రెండు మూడు సినిమాలైతే చేస్తాననీ కాన్ఫిడెంట్గా చెప్పేస్తున్నాడు. రవితేజ నుండి ఫ్యాన్స్ ఇంతకన్నా కోరుకునేదింకేముంటుంది..!
|