Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> యువతరం >>

సోషల్‌.. గీత దాటితే తప్పదు జైల్‌!

social .. mind your limit

పబ్లిసిటీ..పబ్లిసిటీ.. ఏ పని చేసినా ఇప్పుడు పబ్లిసిటీ ఇమీడియట్‌గా ప్రపంచం దృష్టిని ఆకర్షించాలనే తపన ప్రతీ ఒక్కరిలోనూ పెరిగిపోయింది. చేతిలో స్మార్ట్‌ మొబైల్‌. క్లిక్‌మనిపిస్తే సెల్ఫీ. అంతే క్లిక్‌ మనిపించిన సెకన్‌లో ఆ ఫోటో సోషల్‌ మీడియాలో దర్శనమిస్తుంది. ఇదివరకటి రోజుల్లో జ్ఞాపకంగా ఫోటో తీసుకుని ఆల్బమ్‌లో జాగ్రత్త చేసుకునేవాళ్లం. ఇంటికి వచ్చిన వారికి మాత్రమే ఆ ఫోటోలను భద్రంగా చూపించి, ఆ జ్ఞాపకం తాలూకు ఆనందాన్ని పంచుకునేవాళ్లం. కానీ ఇప్పుడలా కాదు. సోషల్‌ మీడియా పుణ్యమా అని ప్రపంచం మొత్తం మన అనుభవాన్ని, ఆనందాన్ని ఇమీడియట్‌గా పంచేసుకోవాలని ఆత్రుత పడుతున్నాం. ఈ ఆత్రంలోనే అనేక తప్పులు చేసేస్తున్నాం. ఈ ఆరాటం ఇప్పుడు ఎక్కడి వరకూ చేరిందంటే, మన ప్రమోషనే కాదు, ఇతరుల ప్రమోషన్స్‌ పట్ల కూడా ఆశక్తి ఎక్కువైంది. పక్కింటి, ఎదురింటి మహిళల ప్రైవేట్‌ విషయాలనూ, పబ్లిక్‌ ప్లేసెస్‌లోని అనవరసరమైన విషయాలనూ కూడా మొబైల్స్‌లో బంధించి, వాటిని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తున్నారు. తద్వారా ఆయా ఫ్యామిలీలు ప్రమాదంలో పడే పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఒక్కోసారి సెల్ఫీల్లో మన ప్రమేయం లేకుండానే ఇతరుల మొబైల్స్‌లో మన కదలికలపై కూడా అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితులు న్నాయి. అలాంటి పరిస్థితులే ఈ మధ్య విషమించి, అత్యంత దారుణంగా ఆత్మహత్యలకు కూడా దారి తీస్తున్నాయి.

ముఖ్యంగా ఈ తరహా చేష్టలకు 15 నుండి 25 ఏళ్ల వయసు వారే ఎక్కువగా పాల్పడుతున్నట్లు ఓ సర్వేలో తేలింది. అంటే కరెక్ట్‌గా యవ్వన దశలోనే ఇలాంటి ఉత్సాహం ఉంటోందన్న విషయాన్ని గమనించాలి. కొన్ని కొన్ని ఇంపార్టెంట్‌ ఇష్యూస్‌ రీసెర్చ్‌ కోసం సోషల్‌ మీడియాని వినియోగిస్తే, ఆ వినియోగం ఆరోగ్యదాయకం. కానీ శృతిమించి ఇలా అనవసరమైన చెత్త పనులు చేస్తే, తద్వారా జరిగే పరిణామాలకు భారీ మూల్యం చెల్లించాల్సిందే. ప్రస్తుతం సోషల్‌ మీడియాలో భావ స్వేచ్ఛ పేరుతో జరుగుతున్న ఈ పరిణామాలకు చెక్‌ పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు నడుం బిగించాయి. ఇటువంటి చేష్టలకు పాల్పడే వారికి కఠినమైన శిక్షలు విధించేలా చట్టాలు సిద్ధం చేస్తున్నాయి. ఈ కోవలో తమ తమ పిల్లలు ఏం చేస్తున్నారు అనే విషయాన్ని తల్లితండ్రులు ఓ కంట కనిపెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చిన్న తనం నుండే సోషల్‌ మీడియా అవసరాలు, అనుకూలతలు, ప్రతికూలతలపై పిల్లలకు అవేర్‌నెస్‌ కల్గించాలి.

భావ స్వేఛ్చ పేరుతో ఎవరి నోటికి వచ్చింది వారు మాట్లాడతామంటే చెల్లే పరిస్థితి లేదు. శృతి మించిన కామెంట్స్‌ పెడితే, అట్టి వారిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, చట్ట పరంగా శిక్షించే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. తెలంగాణాలో ఈ తరహా చట్టాలు ఇప్పటికే అమలులో ఉన్నాయి. అయితే ఈ విషయాన్ని కాస్త గమనించాలి అంతే. ఈ చేష్టలకు పాల్పడేవారు తాము ఎక్కడో వున్నాం. ఎక్కడ నుండో పోస్ట్‌ పెడుతున్నాం. మన ఐడెంటిటీ ఎలా దొరుకుతుందిలే అనుకోవచ్చు. కానీ మన మొబైల్‌కి ఆధార్‌తో లింక్‌ ఉంటోంది. అలాగే ఇంటర్నెట్‌ నుండి పోస్ట్‌ చేస్తున్నాం కదా నో ప్రాబ్లం అనుకుంటారు కానీ దానికీ ఏదో ఒక లింకుంటుంది. ఐడెంటిటీని పట్టుకోవడం ఇప్పుడేమంత కష్టమైన పని కాదు. సో సోషల్‌ మాధ్యమాల్లో తప్పు చేస్తే అంతే సంగతి. తప్పించుకోవడం ఆషామాషీ కాదు. బీ వేర్‌ ఆఫ్‌ ఇట్‌!

మరిన్ని యువతరం
nestamaa...