బాలయ్య ప్రధాన పాత్రలో స్వర్గీయ నరదమూరి తారక రామారావు జీవిత చరిత్ర తెరకెక్కబోతోన్న సంగతి తెలిసిందే. తేజ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. అయితే 'గౌతమీ పుత్ర శాతకర్ణి' సినిమా మొదలుకొని, బాలయ్య వరుసగా మూడు సినిమాలు చేసేశాడు. దాంతో 2019 ఎలక్షన్స్ దగ్గర పడుతున్న నేపథ్యంలో బాలయ్య సినిమాలకు బ్రేక్ ఇస్తాడనీ, రాజకీయాలపైనే పూర్తి ఫోకస్ పెడతాడనీ అనుకున్నారంతా. కానీ కాదట. బాలయ్య చేయాల్సిన 'ఎన్టీఆర్' చిత్రం ఎలక్షన్స్కి ముందే పూర్తి చేయనున్నారు. ఇటీవలే ఈ విషయాన్ని బాలయ్య స్వయంగా ప్రకటించారు. త్వరలోనే ఈ చిత్రం సెట్స్ మీదికి వెళ్లనుందట.
త్వరలోనే లాంఛనంగా ప్రారంభం కానున్న ఈ చిత్రం ప్రారంభోత్సవానికి పెద్ద ఎత్తున సినీ, రాజకీయ ప్రముఖుల్ని బాలయ్య ఆహ్వానించనున్నారట. పెద్ద ఎత్తున ఈ సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించే యోచనలో బాలయ్య ఉన్నట్లు తెలుస్తోంది. పార్టీలకతీతంగా రాజకీయ ప్రముఖుల్ని కార్యక్రమానికి ఆహ్వానించనున్నారట. అలాగే స్వర్గీయ ఎన్టీఆర్ సొంతూరు అయిన నిమ్మకూరు ప్రజలకు కూడా ఈ కార్యక్రమానికి ఆహ్మానం పంపనున్నారట బాలయ్య. 'ఎన్టీఆర్ అందరివాడు' అనిపించేందుకే ఈ ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాతో బాలయ్య తొలిసారిగా నిర్మాతగా అవతారమెత్తుతున్నారు కూడా. ఎన్టీఆర్ సినీ, రాజకీయ ప్రస్థానంలోని ముఖ్య ఘట్టాలను ఈ చిత్రం ద్వారా తెరపై ఆవిష్కరించనున్నారు. ఈ చిత్రంలోని మిగతా నటీనటులు, ఇతర టెక్నీషియన్ల వివరాలను త్వరలోనే ప్రకటించనున్నారు బాలయ్య అండ్ టీమ్. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమాని విడుదల చేయనున్నామనీ బాలయ్య ప్రకటించారు.
|