జులై నెలాఖరున విడుదలవ్వాల్సిన ‘ఎవడు’ ఇంకా విడుదలకు నోచుకోలేదు. రెండు నెలల గ్యాప్ తర్వాత విధిలేని పరిస్థితుల్లో ‘అత్తారింటికి దారేది’ సినిమా విడుదలైంది. అంతే పెద్ద సినిమాల కోసం మొహం వాచిపోయినట్లు ఎదురు చూసిన తెలుగు ప్రేక్షకుల పంట పండింది. ‘అత్తారింటికి దారేది’కి సూపర్ హిట్ టాక్ రావడంతో, తెలుగు సినీ పరిశ్రమ కళకళ్ళాడుతోంది.
దసరా సీజన్ వచ్చేయడంతో, ఈ సీజన్ లో సినిమాల జాతర మొదలు కానుంది. ‘రామయ్యా వస్తావయ్యా’ ఈ నెల 10న విడుదల కాబోతోండగా, విష్ణు ‘దూసుకెళ్తా’నంటున్నాడు 11వ తేదీన. ఆ తర్వాత ‘భాయ్’ సినిమా లైన్లోనే వుంది. ఇవి కాక, ‘మసాలా’ సినిమా ఒకటి విడుదలకు సిద్ధమవుతోంది. వెంకటేష్, రామ్ కాంబినేషన్ లో తెరకెక్కుతోందీ సినిమా.
‘ఎవడు’ దీపావళికి గానీ, ఆ తర్వాత గానీ విడుదల అంటున్నారు. అంటే, ‘రామయ్యా వస్తావయ్యా’ తర్వాత తెలుగు ప్రేక్షకులకు ఫుల్ మసాలాయేనన్నమాట. వరుసగా పెద్ద సినిమాలొచ్చి, అన్నీ మంచి విజయాలు సాధిస్తే రెండు నెలలుగా వెలవెలబోయిన తెలుగు సినిమా మళ్లీ కళకళ్ళాడుతుంది.
|