ఇప్పటి ట్రెండ్కి గుడ్బై చెప్పేస్తున్నారు మన టాలీవుడ్ దర్శక నిర్మాతలు. దశాబ్ధాల వెనక్కి వెళ్లి అప్పటి నేటివిటీకి తగ్గట్లుగా కథలు ప్రిపేర్ చేస్తున్నారు. చూసే ప్రేక్షకులు కూడా కొత్తదనం కోరుకుంటున్నారు. ఆ దిశలో మన టైమ్ మిషన్ని వెనక్కి తీసుకెళ్లిపోతున్నారు. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి, సంచలనాలు సృష్టిస్తోన్న 'రంగస్థలం' సినిమా తీసుకుంటే, 1980ల కాలం నాటి కథ. కానీ ప్రేక్షకులకు ఏ స్థాయిలో చేరువైందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, అమెరికా వంటి అగ్రరాజ్యాల్లో కూడా ఈ కథకు పట్టం కట్టేశారు. రికార్డు స్థాయిలో బాక్సాఫీస్ వసూళ్లు కొల్లగొట్టేసిందీ సినిమా. ఇప్పుడు మరో సినిమా వస్తోంది ఈ తరహా నేపథ్యంలోనే. అదే రెండు మూడు దశాబ్ధాల ముందు చరిత్ర. 'మహానటి' చిత్రంలో చూపించబోతున్న స్టోరీ కూడా అదే.
అలనాటి మేటి నటి సావిత్రి జీవిత ఆధారంగా తెరకెక్కుతోన్న చిత్రమిది. ఈ సినిమాలో నటిస్తున్న నటీనటులంతా అలనాటి కాలానికి తగ్గట్లుగా మారిపోయారు. కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో సమంత, విజయ్ దేవరకొండలు కీలక పాత్రలు పోషిస్తున్నారు. తాజాగా విడుదలైన వీరిద్దరి ఫస్ట్లుక్స్ విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఇదిలా ఉంటే, 'బాహుబలి' సినిమా తర్వాత రాజమౌళి తెరకెక్కించబోయే మెగా ప్రాజెక్ట్ చరణ్ - ఎన్టీఆర్ మల్టీ స్టారర్ కథ కూడా 19ల కాలం నాటిదేనని ప్రచారం జరుగుతోంది. ఇవే కాక, పూరీ జగన్నాధ్ కొడుకు ఆకాష్ పూరీతో తెరకెక్కిస్తున్న 'మెహబూబా' చిత్రం కూడా స్వాతంత్య్రానికి ముందు ఇండియా - పాకిస్థాన్ యుద్ధ నేపథ్యంలో జరిగిన స్టోరీగా తెరకెక్కుతోంది. అలాగే రానా నటిస్తున్న '1945' కూడా ఈ తరహా నేపథ్యమే. ఇలా చెప్పుకుంటూ పోతే, టాలీవుడ్ సినిమా కొన్ని దశాబ్ధాల కాలం వెనక్కి వెళ్లిపోతోందనిపిస్తోంది.
|