అలనాటి మేటి నటి సావిత్రి జీవితాధారంగా తెరకెక్కుతోన్న చిత్రం 'మహానటి'. యంగ్ అండ్ డైనమిక్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. షార్ట్ ఫిలింస్ నుండి ఫిలిం డైరెక్టర్గా మారి నేచురల్ స్టార్ నానితో 'ఎవడే సుబ్రహ్మణ్యం' సినిమాని తెరకెక్కించి, విమర్శకుల ప్రశంసలు అందుకున్న డైరెక్టర్ నాగఅశ్విన్. ఎక్కువ సినిమాలు తెరకెక్కించిన అనుభవం లేదు కానీ, మంచి విజన్ ఉన్న డైరెక్టర్ నాగ్ అశ్విన్. 'మహానటి' సినిమాని ఓ యజ్ఞంలా భావించి తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాలో సావిత్రి పాత్ర కోసం పలువురు సీనియర్ నటీమణుల్ని పరిశీలించి, చివరికి ఆ పాత్రలో ముద్దుగుమ్మ కీర్తి సురేష్ని ఎంపిక చేశాడు.
కీర్తిసురేష్తో పాటు, సీనియర్ నటి సమంత కీలక పాత్ర పోషిస్తోన్న ఈ సినిమా మే 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలు వేగవంతం చేసింది. జర్నలిస్టు మధురవాణి పాత్రలో సమంత నటిస్తుందంటూ, ఆమె ఫస్ట్లుక్ పోస్టర్ మొదట విడుదల చేసింది. తర్వాత 'పెళ్లిచూపులు', 'అర్జున్రెడ్డి' తదితర చిత్రాలతో పాపులర్ అయిన విజయ్ దేవరకొండ లుక్ రిలీజ్ చేసింది. ఈయన కూడా ఓ జర్నలిస్టేనని తెలుస్తోంది. ఇకపోతే, అక్కినేని నాగేశ్వరరావు పాత్రను ఆయన మనవడు నాగచైతన్య, ఎస్వీ రంగారావు పాత్రను సీనియర్ నటుడు మోహన్బాబు పోషిస్తున్నారు. వీరితో పాటు రాజేంద్రప్రసాద్, భానుప్రియ తదితర సీనియర్ నటీనటులకు ఈ సినిమాలో చోటుంది. అలాగే షాలినీ పాండే వంటి అప్కమింగ్ ముద్దుగుమ్మలు కూడా ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. సావిత్రి భర్త జెమినీ గణేశన్ పాత్రను దుల్కర్ సల్మాన్ పోషిస్తున్నాడు. ఇటీవలే ఈ సినిమా టీజర్ విడుదలైంది. మంచి రెస్పాన్స్ అందుకుంటోంది. మే 1న సినిమా ఆడియో ఫంక్షన్ జరగనుంది.
|