అలనాటి మేటి నటి సావిత్రి జీవిత ఆధారంగా తెరకెక్కిన 'మహానటి' చిత్రంలో సావిత్రి పాత్రకు కీర్తి సురేష్ను ఎంచుకోవడంలో చాలా విమర్శలు ఎదుర్కొంది కీర్తిసురేష్. కానీ సినిమా విడుదలైంది. మంచి టాక్ తెచ్చుకుంది. నిజానికి సావిత్రి కథ అందరికీ తెలిసిందే అయినా కానీ, కొందరికి తెలియని సావిత్రి జీవిత గాధలోని కొన్ని చీకటి కోణాలను డైరెక్టర్ నాగ్ అశ్విన్ చూపించిన తీరు ప్రేక్షకులను మెప్పించింది. అలాగే సావిత్రిగా కీర్తి సురేష్ తనను తాను మలచుకున్న తీరుకు అందరూ హ్యాట్సాఫ్ అంటున్నారు. సావిత్రిలా తెరపై కనిపించేందుకు కీర్తి సురేష్ బాగా కష్టపడిందని సినిమా చూశాక అందరికీ అర్ధమైంది. చాలా తక్కువ చిత్రాలు చేసిన అనుభవం ఉన్న కీర్తి సురేష్ ఇంత బరువైన పాత్రను ఎలా డీల్ చేస్తుందా అని అందరూ భావించారు.
కానీ ఈ పాత్రకు పూర్తి న్యాయం చేసిందనే కామెంట్స్ వస్తున్నాయి. పతాక సన్నివేశాల్లో కీర్తిసురేష్ నటనకు అంతా ఫిదా అవుతున్నారు. ఈ ప్రాజెక్ట్తో కీర్తి సురేష్ నటిగా మరో మెట్టు ఎక్కిందనే భావించాలి. ఈ ప్రోత్సాహంతోనే తెలుగులో బయోపిక్స్కి కీర్తిసురేష్ పేరును ముందు వరుసలో చేర్చేశారు. ప్రస్తుతం కీర్తి చేతిలో తెలుగులో అవకాశాలు లేవు కానీ, ఈ సినిమా తర్వాత కీర్తికి మంచి మంచి ఆఫర్స్, ప్రాధాన్యత ఉన్న క్యారెక్టర్స్ దక్కుతాయనడం నిస్సందేహం. మరోవైపు తమిళంలో సూర్య హీరోగా తెరకెక్కుతోన్న సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్గా నటిస్తోన్న సంగతి తెలిసిందే. సెల్వ రాఘవన్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.
|