'పిల్లా నువ్వు లేని జీవితం', 'సుబ్రహ్యణ్యం ఫర్ సేల్' సినిమాలతో మంచి పేరు తెచ్చుకున్న మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ తర్వాత 'సుప్రీమ్' సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. ఇక తేజుకి తిరుగు లేదు. మెగా కాంపౌండ్ నుండి, మాస్ హీరోగా సెటిలైపోయినట్లే అనుకున్న టైంలో 'తిక్క', 'విన్నర్' తదితర వరుస ఫ్లాపులు తేజుని వెంటాడాయి. ఇటీవల వరుసగా వచ్చిన 'జవాన్', 'ఇంటెలిజెంట్' సినిమాలు డిజాస్టర్స్ అని చెప్పలేం కానీ, హిట్స్ లెక్కలోనికి రావనే చెప్పాలి. ఇప్పుడు 'తేజ్ ఐ లవ్యూ'తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు సాయి ధరమ్ తేజ్. ఈ సినిమా పైనే తేజు ఆశలన్నీ. ఎలాగైనా ఈ సినిమాతో హిట్ కొట్టి తీరాలనుకుంటున్నాడు. ఈ నెల 29న ప్రేక్షకుల ముందుకు రావల్సిన ఈ చిత్రం కాస్త వెనక్కి వెళ్లింది. జూలై 6న విడుదల కానుంది. ఈ సినిమాలో అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్గా నటిస్తోంది.
అనుపమాని ఒకింత లక్కీ బ్యూటీగా చెప్పుకోవచ్చు. 'శతమానం భవతి' వంటి బ్లాక్ బస్టర్ హిట్ ఈ ముద్దుగుమ్మ ఖాతాలో ఉంది. తొలిసారి తేజుతో జత కడుతోందీ బ్యూటీ. ఇదిలా ఉంటే, మరోవైపు డైరెక్టర్ వైపు నుండీ ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. కరుణాకరన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. పవన్ కళ్యాణ్కి 'తొలిప్రేమ' వంటి సెన్సేషనల్ విజయం అందించిన ట్రేక్ రికార్డుతో పాటు, పలు లవ్స్టోరీస్ని విజయవంతంగా తెరకెక్కించిన ఘనత కూడా గతంలో ఈయన డైరీలో ఉంది. అంతేకాదు, ఆల్రెడీ విడుదలైన ప్రోమోస్ సినిమాపై అంచనాలు మరీ పెంచేస్తున్నాయి. చూడాలి మరి, ఇన్ని అంచనాలతో తేజు ఈ సారైనా అగ్ని పరీక్ష నెట్టుకొని, రేసులో ముందుకెళ్తాడా ? లేదా ?
|