మెగాస్టార్ చిరంజీవి 151 చిత్రం 'సైరా'ని వివాదాలు చుట్టుముట్టాయి. ఇటీవల హైద్రాబాద్ శివార్లలో వేసిన భారీ సెట్లో కథకు అత్యంత కీలకమైన యాక్షన్ ఎపిసోడ్స్ చిత్రీకరించిన సంగతి తెలిసిందే. అయితే అనుమతి లేకుండా నిర్మించిన ఆ సెట్లో చిత్రీకరణ జరుగుతోందంటూ, ఆ సెట్ని రెవెన్యూ అధికారులు కూల్చేశారు. గతంలో 'రంగస్థలం' చిత్రాన్ని అదే సెట్లో చిత్రీకరించారు. అయితే ఆ సినిమా కోసం అనుమతి తీసుకున్నారు. కానీ తాజాగా 'సైరా' కోసం అనుమతి తీసుకోలేదనే ఆరోపణతో ఈ సెట్ వివాదం తలెత్తింది. కాగా ఈ వివాదంపై చిత్ర యూనిట్ స్పందించలేదు. వాస్తవానికి ఆ సెట్లో సైరా షూటింగ్ పూర్తయిపోయిందనీ, ఆ కారణంగానే సెట్ కూల్చివేశారనేది చిత్ర సన్నిహితుల సమాచారమ్. ఏదేమైనా ఈ వివాదం సంగతిటుంచితే మరో కొత్త వివాదం తెరపైకి వచ్చింది.
ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వారసులు సైరా విషయమై చిత్రీకరణ ప్రారంభమయ్యాక తమను సంప్రదించలేదంటూ ప్రధానంగా ఆరోపణ చేస్తూ మీడియాకెక్కారు. ఇలాంటి వివాదాలు చిత్ర సీమకు కొత్తేమీ కాదు. ఆ మాటకొస్తే, 'మగధీర' టైంలో ఓ పాట విషయంలో కూడా ఇలాంటి రచ్చే జరిగింది. ఓ రకంగా ఇలాంటి వివాదాలు సినిమా పబ్లిసిటీకి బాగా ఉపకరిస్తుంటాయి. ఒక్కోసారి ఈ వివాదాలే సినిమాపై ఆశక్తిని రేకెత్తిస్తుంటాయి. అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతోన్న చిత్రమిది. పోరాట ఘట్టాలకు అత్యంత ప్రాధాన్యత ఉంది. మరుగున పరడిపోయిన తొలి తెలుగు స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత గాధే ఈ 'సైరా' నరసింహారెడ్డి. అత్యంత భారీ బడ్జెట్ చిత్రంగా కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్లో రామ్చరణ్ నిర్మిస్తున్నారు. తమిళ, హిందీ, కన్నడ భాషల్లో ప్రముఖ నటీనటులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు.
|