Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
tight diet

ఈ సంచికలో >> కథలు >> బుచ్చిబాబు ఆరోగ్యం

bucchibabu arogyam

“ఏరా!ఇంకా టీఫన్ తింటున్నావా! వ్యానోడు తొందర చేస్తున్నాడు.త్వరగా కానీయ్ !"అన్నాడు బుచ్చిబాబుతో స్నేహితుడు శ్యాం ప్రసాదు.

"మీరైనా చెప్పండన్నయ్యగారూ!ఇప్పటికి నాలుగు దోశెల్ను సాంబారు,చట్నితో తిని ఇంకేమైనా వుందా జానూ అంటే...ఇవిగో  ఆలూ కూరతో ఈ నాలుగు పూరీలను తెస్తున్నాను"అంటూ పళ్ళెన్ని మొగుడి ముందుంచింది జానకి.

"ఏం తిండిలేరా !మరో గంటలో అరిగిపోయి మళ్ళీ ప్రేవులు ఆవురావురంటూ అరుస్తాయి. అందుకే అతి కష్టం మీద ఈ టిఫన్నుకడుపులోకి పంపిస్తున్నాను..ఏం తప్పా?"

"అబ్బే! తప్పని నేనంటానా?అన్నా... నువ్వూరుకొంటావా?రాజకీయనాయకుడిలా రాగాలు తీసి లా పాయింట్సు మాట్లాడి నా నోరు మూయించవూ!త్వరగా కానీయ్ "

"అయిపోయిందిరా!నీ వెంటనే వస్తున్నా.పద"అంటూ నాలుగు పూరీలను ఆలూ కూరతో రెండు నిముషాల్లో తిని ప్యాంటును తగిలించుకొని,బిర్రుగా బెల్టును బిగించి హాంకరుకున్న షర్టును వేసుకొంటూ వెళ్ళి వ్యానులో కూర్చొన్నాడు బుచ్చిబాబు.ఆయన వెంట ,నాటికి కావలసిన తిండి బాక్సులు,పళ్ళు వగైరాలతో భార్య, పిల్లలూ ఎక్కారు.

"సార్ ! మీరు అపమన్న చోటల్లా వ్యాను ఆగదు. ఒంటికి,రెంటికి ఇక్కడే ముగించుకొని ఎక్కండి"డ్రయివర్ హెచ్చరించాడు.

"తెలుసులేవోయ్ !ఇలాంటి కండిషన్లు మాకు పెట్టకు.చెప్పు ఓనరుతో మాట్లాడమంటావా?" అతికష్టంమీద లేచి నిలబడి అన్నాడు బుచ్చిబాబు హీరోలా పోజెట్టి భార్య వంక చూస్తూ,

డ్రయివరు కూడా తన సీట్లో నుంచి లేచి పైకి దూకినట్టు" ఏంటండీ మీరంటుంది? మహాబలిపురం దగ్గరేమి కాదు.రెండున్నర గంటలు ప్రయాణం.వెళ్ళి సైట్ సీయింగ్ అయిన తరువాత మిమ్మల్ని మళ్ళీ ఇక్కడ దిగబెట్టి పదిగంటలకల్లా వ్యాను షెడ్లోకి చేర్చాలి"అన్నాడు  కోపంతో.
"ఒరేయ్ బుచ్చీ...నువ్వాగు!గొడవ పడకుండా నువ్వు కదలవయ్యా బాబూ!"తొందరచేశాడు శ్యాం ప్రసాదు.

"అయినా ఇది గవర్నమెంటు బస్సు కాదు. మేము  అద్దెకు తీసుకున్న ప్రయివేటు వ్యాను. ఓనరుతో మాట్లాడుతాం.మేము చెప్పినట్టు పోనీయ్ !ఏమంటారు అన్నయ్యగారూ?"అంది జానకి.

"నువ్వంది కరక్టేనమ్మా.పోనీవయ్యా!"అన్నాడు మళ్ళీ శ్యాం ప్రసాదు. వ్యాను కదిలింది.

బుజ్జిబాబు,శ్యాంప్రసాదులు మంచి న్నేహితులు.ఒకే ఆఫీసులో పని చేస్తున్నారు. ఒకే అపార్టుమెంటులో ప్రక్క ప్రక్క  వాటాల్లో అద్దెకుంటున్నారు .ఇద్దరికి ఇద్దరేసి పిల్లలు.వాళ్ళు అయిదు,మూడవ తరగతులు ఒకే స్కూల్లో చదువుతున్నారు.

ఇద్దరి తరపున పెద్దలంటూ లేని కారణాన వాళ్ళకు వాళ్ళే పెద్దలు,డిషిషన్ మేకర్సు కూడా! పిల్లలకు దసరా సెలవులు కనుక రెండు కుటుంబాలు ఫ్యామిలీ పిక్నికని మహాబలిపురానికి వెళుతున్నారు . వ్యాన్ తిరువాన్మియూరు దాటింది.

వ్యాన్లో ముందు సీట్లలో కూర్చొన్న పిల్లలు నలుగురూ కేరింతలు కొడుతూ కిటికిలలోంచి బయట కనబడే మల్టీ స్టోరేజ్ బిల్డింగులను, రిసార్ట్సును, విల్లాస్ ను,ప్రకృతి దృశ్యాలను,చూస్తూ ఆనందిస్తూ మాట్లాడుకొంటున్నారు.అదేవిధంగా బుచ్చిబాబు,శ్యాంప్రసాదు దంపతులు కూడా పిచ్చాపాటి మాట్లాడుకొంటున్నారు.కాస్త దూరం వెళుతూనే"డ్రయివరబ్బాయ్ !వ్యాన్ను కాస్త వి.జి,పి గోల్డన్ బీచ్ లో ఆపు.పిల్లలు చూడాలంటున్నారు"అంది జానకి.

"అది కుదరదమ్మా!నాకు ఓనరు చెప్పలేదు"డ్రయివర్ జవాబు.

"ఇదిగో! ఓనరు చెప్పని క్రొకడైల్ పార్కు కూడా ఇప్పుడు లిస్టులో చేర్చాను.నువ్వు చెప్పింది చేయవయ్యా"బుచ్చిబాబు వ్యంగ్యంగా అన్నాడు.
కోపం వచ్చింది డ్రయివర్కు."అది కుదరదండి.నేను స్ట్రెయిట్ గా మహాబలిపురానికే తీసుకువెళతాను"అన్నాడు.

"ఇదిగో! ఓనరుతో మేం మాట్లాడుకొంటాం.పదో పరకో ఎక్కువ ఇచ్చుకొంటాం.నువ్వు చెప్పింది చెయ్యవయ్యా "అన్నాడు శ్యాం ప్రసాదు.
 ఇక నోరు విప్పలేదు డ్రయివర్ .వ్యాన్ను పరుగులు తీయిస్తున్నాడు.

ఉదయాన్నే లేచి వంట చేసుకొని బయలుదేరడం వల్ల శ్యాం ప్రసాదు,అతని భార్య సుందరి, జానకిలు  బడలికతో అలా మాగన్నుగా కళ్ళు మూశారు.పది నిముషాల తరువాత మెల్లగా జానకి  చేతిని గిల్లాడు బుచ్చిబాబు.ఉలిక్కి పడ్డట్టు కళ్ళు తెరచి భర్తవంక చూసిందామె 'ఏమిటీ?' అన్నట్టు.

"ఇంట్లో పిల్లలకని బోలెడు పళ్ళు,చక్రాలు,చకోడీలు సర్దుతుంటే చూశాను.నాకు ఆకలిగా వుంది. ఏదైనా పెట్టవా?"మెల్లగా చెవిలో అన్నాడు బుచ్చిబాబు.

"అయ్యోరామ ! పిల్లలకన్నా అద్వానమండీ మీరు.చూడండి వాళ్ళు నన్నేమీ అడక్కుండా ఎంచక్కా మాట్లాడు కొంటూ వస్తున్నారో!ఉదయం టిఫన్ ఎక్కువ తిన్న మీకు అప్పుడే ఆకలా" అంటూ సంచిలోనుంచి ఆపిల్ ,బనానా,బత్తాయి పళ్ళతో పాటు కొంచం చక్రాలు  తీసి  భర్త బుచ్చిబాబుకు అందించి అటు పిల్లల్నీ చూసిందామె!పాపమనుకొందేమో వాళ్ళకు తలా ఓ ఆపిల్ ఇచ్చింది.పిల్లలు తింటున్నారు. బుచ్చిబాబు కూడా చిన్న పిల్లాడిలా శబ్దం చేస్తూ తింటుంటే ఆ చప్పుడికి శ్యాం ప్రసాదు మేల్కొని చూశాడు.

"ఏమీ లేదన్నయ్యగారూ!కాసిన్ని చక్రాలను పెడితే వాటిని నములుతున్నారాయన.కదండీ?" అంది జానకి .అవునన్నట్టు గంగిరెద్దులా తలూపాడు బుచ్చిబాబు.

నవ్వొచ్చింది శ్యాం ప్రసాదుకు."వాడ్ని గూర్చి నాకు చెప్పకమ్మా.వాడి నోరు ఎప్పుడూ ఏదో ఒకటి తింటూ వుండాలి.అందుకే వాడలా స్థూలకాయంతో వుంటూ షుగరు,బి.పి లను వెంట పెట్టుకొని తిరుగుతున్నాడు.పోనీ...వుదయాన నాలా వాక్ చేస్తాడా అంటే అదీలేదు. పార్కుకొచ్చి  అక్కడున్న బెంచీకి అతుక్కు పోతాడు.వాడి వైటు ఎంతో తెలుసా? వంద  కిలోలు."అన్నాడు.

"వాడికి నామీద కుళ్ళులేవే జానూ! నేను బలంగా వున్నానని ఎప్పుడు ఏడుస్తుంటాడు" చక్రాలను పరపరా నములుతూ అన్నాడు బుచ్చిబాబు.నవ్వి వూరుకున్నాడు శ్యాంప్రసాదు. పావుగంట వ్యవధిలో వి.జి.పి గోల్జెన్ బీచ్లో ఆగింది వ్యాను.అందరూ దిగారు. బుచ్చిబాబుకూడా మెల్లగా దిగాడు.టిక్కెట్లు తీసుకొని లోనికెళ్ళారు.క్యాంటీన్ వద్ద ఆగి పోయాడు బుచ్చిబాబు.

"ఏరా ఆగిపోయావ్ !తిరిగి చూడ్డానికి మాతో రావట్లేదా?"అడిగాడు శ్యాం ప్రసాదు.

"అక్కడేముందిరా బొంద.పిల్లల్ని తీసుకొని నువ్వెళ్ళిరా! నేనిక్కడ కూర్చొంటాను"అంటూ అక్కడున్న బెంచిమీద కూర్చొన్నాడు బుచ్చిబాబు.

'అయ్యోరామ'అంటూ తలమీద కొట్టుకొంది  జానకి. నవ్వుకొంటూ ముందుకు నడిచారు అందరూ.

అటు క్యాంటీన్లోకి చూశాడు బుచ్చిబాబు.అక్కడ చాలామంది స్పెషల్ అనిపించుకొనే పెద్ద దోశెల్ను ముందుంచుకొని తింటున్మారు.నోట నీళ్ళూరాయి బుచ్చిబాబుకు.ఓ అర్థ గంటైన తరువాత అందరూ తిరుగు ముఖం పట్టి క్యాంటీన్ వద్దకొచ్చారు."టైమైంది పదరా! మహాబలిపురం వెళ్ళి తిరిగి చూసిన తరువాత భోంచేద్దాం"అన్నాడు శ్యాం ప్రసాదు.

శ్యాం ప్రసాదు మాటల్ని పట్టించుకోని బుచ్చిబాబు"ఒరేయ్ !అక్కడ రోలుగా చుట్టి ప్లేటులో వున్న ఆ దోశెను,దాన్ని నాలా బొద్దుగా వుండి తింటున్న ఆ పిల్లాడ్ని చూడు.అలాంటి దోశెను మీకు తినాలనిపించట్లేదా?" గుటకలు మింగుతూ అన్నాడు బుచ్చిబాబు.

"అయితే మీరిప్పుడు దోశె తినాలంటారు,అంతేగాండీ?"అంది జానకి.

"అవును.నాకొక్కడికే ఒక్క దోశ కావాలి"అని గట్టిగా తలూపాడు బుజ్జిబాబు.

"అయ్యోరామ.తప్పుతుందా పదండి"అంటూ లోనికి నడిచారు.నాలుగు దోశెలను తీసుకున్నారు.ఒకటి బుచ్చిబాబు ముందుంచి తతిమ్మా మూడు దోశెల్ను ఏడుగురు తిన్నారు. చెయ్యి కడుక్కొని వ్యానెక్కి కూర్చొన్నారు. కొంతదూరం వెళ్ళింది వ్యాను.

"ఇంకేమన్నా వున్నాయా తినటానికి?"ఉన్నట్టుండి అడిగాడు బుచ్చిబాబు భార్యను.

"అయ్యో రామ!ఇదిగో అన్ని వున్నై.అయితే ఇప్పుడు పెట్టను.భోజనాలైయ్యాకే!ఓ గంటసేపు ఆ నోటికి తాళం వెయ్యండి"అంటూ విసుక్కొంది జానకి.కిమ్మనకుండా కూర్చొన్నాడు బుచ్చిబాబు . కాస్సేపటికి మహాబలిపురమొచ్చింది. అందరూ దిగారు.బుచ్చి బాబు దిగి అక్కడ చెట్టుక్రింద వున్న బండమీద కూర్చొన్నాడు.

"ఏంట్రా?తిరిగి చూడ్డానికి నువ్వు రావట్లేదా?"అడిగాడు శ్యాంప్రసాద్ .

"ఏముందక్కడ బొంద!?మీరెళ్ళి చూసిరండి"అయాసపడుతూ అన్నాడు బుచ్చిబాబు.

"ఇక్కడే కూర్చొని వుండు.ఓ గంటలో తిరిగొస్తాం .ఇదిగో!అకలౌతోందని ఆ పల్లీలు, ,బొండాలు, బజ్జీలని  తిని కడుపును పాడు చేసుకోకండి.మీరు పదండన్నయ్యగారూ!"అంటూ ముందుకు నడిచింది జానకి.

'అక్కడికి వీడేదో పుడ్డు విషయంలో కంట్రోలుగా వున్నట్టు.ఆ బోండాలు,బజ్జీలను  తినకపోతే సరి'అని మనసులో అనుకొని నవ్వుకొంటూ"పదండి...పదండి"అంటూ వాళ్ళను వెంబడించాడు శ్యాం ప్రసాదు.

"వొదినా !నాకు తెలీకడుగుతున్నాను.మీ వారు ఎప్పుడూ ఇంతేనా?కడుపుకు తినడం ఓ పనిగా చేసుకొన్నారు.అలా తింటే ఊబకాయం రాక సన్నబడతారా?అందునా షుగర్ పేషంటని చెపుతున్నారాయే.పార్కులో కూడా ఒక్క రౌండుకూడా నడవరట.అర్థగంటో లేక నలభై నిముషాలో మా వారు నడిచేవరకూ వీరు బల్లమీద పడుకొని నిద్రపోతారట.అలా అయితే ఆరోగ్యం కుంటు పడదూ?"అంది శ్యాం ప్రసాదు భార్య సుందరి.

"ఏమిటోలేమ్మా!అది నా ఖర్మనుకొంటున్నాను.మరి కన్నానుగా వారికి ఇద్దరు పిల్లల్ని" ముఖం మూడు వంకలు తిప్పుతూ అంది జానకి.

"అమ్మాయ్ !మాట్లాడకుండా రావా!ఇప్పుడు నీకు వాడి సంగతి అవసరమా!నోరుమూసుకొని పద"మందలించినట్టు అన్నాడు భార్య సుందరిని శ్యాం ప్రసాదు.

"వదినమ్మగారు వున్నదే అడిగారు అన్నయ్యగారూ!అది నా ఖర్మేగా మరి.ఆయనంతే!  ఒక్కోసారి నేనే ఆయన్ను తినటానికే పుట్టాడేమోననుకొంటా"ముక్కు చీదింది జానకి పిల్లలతో నడుస్తూ.

వాళ్ళటు కనుమరుగౌతూనే రెండు బజ్జీలు,రెండు బోండాలు ,బాటిల్ నీళ్ళను కొనుక్కొని శుభ్రంగా తిని నీళ్ళు తాగి వెళ్ళిన వాళ్ళకోసం ఎదురు చూస్తూ కూర్చొన్నాడు బుచ్చిబాబు.

మధ్యాహ్నం వరకూ తిరిగి చూసి రెండు గంటల ప్రాంతంలో బుచ్చిబాబు దగ్గరకు వచ్చారు. చెట్టుక్రింద దుప్పటి పరిచి అందరూ కూర్చొన్నారు బచ్చిబాబు తప్ప.ఎందుకంటే తను క్రింద కూర్చొంటే లేవలేడు పాపం.

రెండిళ్ళలో నుంచి తెచ్చిన పులిహోరా,పెరుగన్నం,దుంప వేపుడు,ఆవకాయతో డ్రయివరుతో పాటు అందరూ  భోంచేశారు. పళ్ళు,చక్రాలు,చకోడీలను కూడా కాజేశారు.గంట రెస్టు తీసుకొని బ్యాక్ టు హోమని ముడున్నర గంటలకు కదిలారు.ఏటూ దారిలో క్రొకడైల్ పార్కును కూడా చూడాలిగా మరి.

సమయం నాలుగు గంటలు.వ్యాను వేగంగా వెళుతోంది.అందరూ అలా కన్ను మూశారు జానకితో పాటు.అమె ప్రక్కన కూర్చొన్న బుచ్చిబాబుకు స్టమక్ అప్ సెట్టయ్యిందేమో కడుపు పట్టుకొని కళ్ళు మూసుకొని ఇబ్బంది పడుతూ మెలికలు తిరిగి పోతున్నాడు.అప్పటికే తనకు ముచ్చెమటలు పోసి మైకం వచ్చేట్టువుంది.ఇక లాభం లేదనుకొన్న బుచ్చిబాబు మెల్లగా భార్యను గిల్లాడు.

"ఏమైందండీ?"అని టక్కున మేల్కొని అడిగింది జానకి.

"స్టమక్ అప్సెట్ అయినట్టుంది జానూ!.వీపరీతమైన నొప్పి .షుగర్ , బి.పిలు రైజై మైకం వచ్చేట్టు వుంది.దగ్గర్లో ఆసుపత్రి వుంటే వెళదాం"అన్నాడు ఇబ్బంది పడుతూ బుచ్చిబాబు.

జానక్కి ఏమీ పాలు పోలేదు.ఆమెకు భయం పట్టుకొంది.వెంటనే "అన్నయ్యగారూ!వీరు అదోలా అయిపోతున్నారు.ఆసుపత్రికి తీసుకెళ్ళాలి"అంది శ్యాం ప్రసాదుతో.శ్యాం ప్రసాదు

గూగుల్ మ్యాప్లో ఆసుపత్రిని వెతికాడు.కిలో మీటరుకవతల ఓ మల్డీ స్పెసాలిటీ హాస్పిటల్ వున్నట్టు గుర్తించి డ్రయివర్తో చెప్పి అక్కడికి వెళ్ళ మన్నాడు.పాపం బుచ్చిబాబు పిల్లలు ఏడ్పులంఖించుకున్నారు.జానకి కళ్ళనుంచి కన్నీళ్ళు కారుతూనే వున్నాయ్ !
కాసువాలిటీకి తీసుకు వెళ్ళారు బుజ్జిబాబును. డాక్టరుగారు పరిశీలించిన తరువాత స్ట్రెచ్చర్లో తీసుకెళ్ళి బెడ్డు మీద పడుకోబెట్టి ఇ.సి.జి.తీశారు.బి.పి.చూశారు. బ్లెడ్ టెస్టు చేశారు. అర్థగంటలో  అన్ని రిపోర్టులు డాక్టరు వద్దకొచ్చాయి.అన్నిటిని పరిశీలనగా చూసి మెల్లగా నవ్వాడు డాక్టర్.ఈ లోపు రెండు సూదులు వేసి,సెలైన్ ఎక్కిస్తున్నారు బుచ్చిబాబుకు.

"ఏం భయపడకండి.మరో మూడు గంటల్లో తను బాగా కోలుకొంటాడు.ఏదో పనికిరాని పుడ్డును మితిమీరి తిన్నందున అది కాస్తా పాయిజనై స్టమక్ అప్ సెట్ అయ్యింది.ఇక పర్వాలేదు.పల్స్ రేట్ ,హార్టు బీటింగ్ క్రమంగానే వున్నాయి.కాని బి.పి.,షుగరు అంతగా కంట్రోల్లో లేవు. ఆ  విషయంగా మీరు జాగ్రత్త తీసుకోవాలి.ముఖ్యంగా తను తినే డైట్  కంట్రోల్గా వుండాలి" అన్నాడు డాక్టరు.

"అడుగో!కదులు తున్నాడు,అందర్ని చూస్తున్నాడు. ఇప్పుడు మామూలుగా వుందేమో!ఆ సంగతి వాడికే చెప్పండి డాక్టరుగారూ!"అన్నాడు శ్యాంప్రసాదు.

తండ్రి కదలికలను చూస్తూనే పిల్లలు శోకాలు పెట్టటం ఆపేశారు.డాక్టరు మాటలు జానక్కి ధైర్యాన్నిచ్చాయి.

"మీ పేరేమిటండీ?"డాక్టురుగారు బుచ్చిబాబును అడిగాడు.

"బుచ్చిబాబు సార్ "దీనంగా చెప్పాడు.

"ఇక మీ ఆరోగ్యానికి డోకా లేదు.అయినా తప్పకుండా షుగర్ ,బి.పి లను  కంట్రోల్లో వుంచుకోవడం ఎంతైనా అవసరం.ఉబకాయాన్ని తగ్గించుకోవడం కూడా అంతే అవసరం. లేకుంటే త్వరగా చెల్లు కుంటారు.మీ ఫ్యామిలీ డాక్టరు చెప్పిన విధంగా ఉదయం టిఫన్ కు రెండు ఇడ్లీలు,మధ్యహ్నానం భోజనానికి ఓ కప్పు అన్నం సాంబారుతో, కాసిన్ని మజ్జిగ,ఇక రాత్రి డిన్నరుకు రెండు చిన్న చపాతీలు ఏదేని కాయకూరలతోనో లేక ఆకు కూరలతోనో తీసుకొండి. పడుకోబోయే ముందు ఓ కప్పు పాలు తాగండి.ఆ డైటును కంటిన్యూ చేస్తూ రోజూ కంపల్సరిగా ముఫ్ఫైనుంచి నలభై నిముషాలు వాక్ చేయండి. ఓకే" అంటూ వెళ్ళిపోయాడు డాక్టర్ .బుచ్చిబాబు నోటికి తాళం వేయడంతో నోట్లో వెలక్కాయ పడ్డట్టయ్యింది.ఆ సమయానే రెండు వేలు బిల్లుకట్టమని కౌంటరునుంచి పిలిచారు. వెంటనే శ్యాం ప్లసాదు వెళ్ళి బిల్లుకట్టొచ్చి అందరికి రాత్రి డిన్నర్కు ఏం  కావాలో చెప్పమని మెను అడిగాడు.అందరూ రకరకాలుగా చెప్పుకున్నారు. "ఓకే"అంటూ అటు తిరిగి "నీకురా బుచ్చీ!"అన్నాడు శ్యాంప్రసాదు.

"నాకు ఒక్క చపాతీ"అని చూపుడు వ్రేలితో చూపి తల దించుకున్నాడు బుచ్చిబాబు.మరది సిగ్గుతోనో లేక దిగులుతోనోనన్నది ఎవ్వరికీ అర్థం కాలేదు.

మరిన్ని కథలు
patang