రాజమౌళి 'ఈగ'తో సినిమా చేశాడు కాబట్టి రవిబాబు పందిపిల్లతో సినిమా తీసేశాడు అనుకుంటున్నారా? ఆ ఈగ వేరు. ఈ పంది వేరు. ఈగ ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్. పైగా రాజమౌళి ఆలోచన అది. పందితో సినిమా ఏంట్రా బాబూ.? అని ముందే చిరాకు పడిపోతాం. అదే రవిబాబు ప్రత్యేకత. అవును పందితో ఎందుకు సినిమా తీయకూడదు.? అసలు పందికేం తక్కువ అనుకున్నాడు కాబట్టే, పందిపిల్లతో ధైర్యంగా సినిమా తీసేశాడు. ఆ సినిమా పేరే 'అదుగో'. పంది మాట్లాడడం, డాన్సు చేయడం, ఫైట్లు చేయడం, రకరకాల ఫీట్లు చేయడం పిల్లల్ని అలరించేస్తాయి. కానీ పందితో సినిమా తీయడానికి రవిబాబు ఎన్ని కష్టాలు పడ్డాడో తెలుసుకుంటే అతని మీద జాలి కలుగుతుంది.
గౌరవం పెరుగుతుంది. ఒకటి కాదు రెండు కాదు, ఏకంగా 150కి పైగా పందిపిల్లల్ని ఈ సినిమా కోసం ఉపయోగించాడు రవిబాబు. ఎందుకిలా అంటే చాలా తక్కువ వ్యవధిలోనే బాగా బరువు పెరిగిపోతుంది పంది. సినిమా నిర్మాణమేమో ఎక్కువ టైం పట్టేసింది. అదీ అసలు సంగతి. పరిస్థితిని ముందే ఊహించి చాలా చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు. సినిమాలో గ్రాఫిక్స్ ఉంటుంది అయినా కానీ పందితో రవిబాబు పడ్డ పాట్లు మాత్రం తక్కువేం కాదు. సో ఇది తెలుగు సినిమాలోనే ఇండియన్ సినిమా హిస్టరీలోనే చాలా చాలా స్పెషల్. ఈ ప్రయోగం ఫలించాలని, ఇలాంటి సినిమాలు ఇంకా ఇంకా రావాలని ఆశిస్తూ రవిబాబుకు హ్యాట్సాఫ్ చెప్సేద్దాం.
|