- రాజా, మ్యూజికాలజిస్ట్
' సింహాలై గర్జిద్దాం - సంహారం సాగిద్దాం '
ఇదీ ' గోల సీను' సినిమాలో సిరివెన్నెల రాసిన ఓ పాట పల్లవి.
చాలా మంది సినీ సంగీతాభిమానులకు ఈ పల్లవి వినగానే 'అల్లూరి సీతారామ రాజు' సినిమాలో 'తెలుగు వీర లేవరా' పాట గుర్తొస్తుంది. ఎందుకంటే ఆ పాటలో శ్రీ శ్రీ ఇలాటి లైన్లే రాశారు కాబట్టి. కాకపోతే ఆ రెండు లైన్లూ తప్పుగా రాశానని తర్వాత కాలం లో గ్రహించి శ్రీ శ్రీ పత్రికాముఖంగా ఒప్పుకున్నారు. 'ప్రతి మనిషి తొడలు గొట్టి' అంటూ సింగ్యులర్ నంబర్ లో చెబుతూ 'సింహాలై గర్జించాలి' అని బహువచనం వాడడం తప్పు ఆయనంతట ఆయనే చెప్పుకునే వరకూ చాలామంది గ్రహించలేదు. 'గోల శీను' లో 'సింహాలై గర్జిద్దాం - సంహారం సాగిద్దాం' అని సీతారామ శాస్త్రి గారు రాయడం వెనుక ఈ శ్రీ శ్రీ తన తప్పు ఒప్పుకున్న విషయం కచ్చితంగా ఆయన మనసులో స్ఫురించి వుండాలి.
సీతారామ శాస్త్రి గారికి ఈ రకపు సంస్కారయుతమైన వాడుక ఇది మొదటి సారి కాదు. లోగడ 'దసరా బుల్లోడు' లోని 'ఎట్టాగో వున్నాది ఓ లమ్మీ' పాటని 'నేనున్నాను' సినిమా కోసం రీమిక్స్ చేసినప్పుడు ఒరిజినల్ పాటలో ఆత్రేయ రాసిన
జడ చూస్తి , మెడ చూస్తి , జబ్బల నునుపు చూస్తి -
కనరాని వంపులన్ని ఓ లమ్మీ కసి కసిగా చూస్తినే చిన్నమ్మీ'
అనే ఇబ్బంది కరమైన సాహిత్యాన్ని -
జడవూపి...నడువూపి నిగనిగల నిధులు చూపి
నువ్వు వీరంగం వేస్తుంటే ఓ లమ్మీ ఊరంత ఊగిందే చిన్నమ్మీ
- అంటూ అతి సంస్కారం గా వుండేట్టు మార్చాడాయన .
|