Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
weekly-horoscope22nd february to 28th february

ఈ సంచికలో >> శీర్షికలు >>

తమిళనాడు తీర్థయాత్రలు - కర్రా నాగలక్ష్మి

అభిరామి మందిరం ( తిరుక్కడయూరు )

తమిళనాడులో వున్న మరో మహిమాన్వితమైన మందిరం గురించి ఈ వారం చదువుదాం .ఈ మందిరం అరవైవ వివాహదినోత్సవం జరుపుకునే ప్రదేశంగా పేరుపొందింది . ఇలా అరవైయ్యవ పెళ్లిరోజు జరుపుకునే మందిరం మనదేశంలో వున్నది యిదొక్కటేనేమో ? . ఈ మందిరం యెక్కడవుందో యేమిటో వివరాలు తెలుసుకుందాం .

ఈ మందిరం తిరుక్కడయూర్ అనే పట్టణం లో వుంది . ఈ పట్టణం తమిళనాడు రాష్ట్రం లోని నాగపట్నం జిల్లా లో ఉంది. ఈ తిరుక్కడయూర్ "మైలదుత్తురై "(మాయ వరం ) నుంచి "పోరయార్ "వెళ్ళేదారిలో మైలదుత్తురై కి 22కిమి దూరం , పోరయార్ నుంచి 8కిమి దూరం లో ఉంది. అలాగే కుజ స్థానం అయిన వైథీశ్వరన్ కోయిల్ కి 5 కిలోమీటర్ల దూరంలోనూ వుంది . ఈ మందిరానికి వెళ్లాలంటే తిరుక్కడయూరు మందిరం అనిగాని లేకపోతే అభిరామ మందిరం అనిగాని అడిగితే స్థానికులు చెప్తారు .

ముందు 60వ పెళ్లి రోజు ఇక్కడ చేయించుకునే వారు. తరవాత తరవాత ఈ కోవెలలో షష్టబ్దపూర్తి (60 సం.),భీమార్థ శాంతి(70 సం ..నిండిన తరువాత చేసుకొనే పూజ ),శతాభిషేకం(80 సం.. నిండేక చేయించుకొనే పూజ ) చేయించు కుంటున్నారు.

ప్రతి రోజు ఇక్కడ 50 నుంచి 60  ఇలాంటి పూజలు జరుగుతూ వుంటాయి .

కోవెల ముఖ్య ద్వారం లో ప్రవేసించగానే రెండు వైపులా పెద్ద పెద్ద మంటపాలు అవి దాటిన తరవాత గర్భ గుడి ద్వారం. ద్వారం దాటగానే పెద్ద ప్రాంగణం. ఆ ప్రాంగణం లో చిన్న చిన్న మంటపాలు వేసి షష్టి పూర్తి మొదలగు పూజలు జరుగుతూ ఉంటాయి. మొదటి ప్రాకారం దాటాక రెండో ప్రాకార ప్రవేశద్వారానికి కుడిచేతివైపున అమ్మవారి కోవెల వుంటుంద . ఈ కోవెలలో  పార్వతీదేవి అభిరామి దేవిగా పూజలందుకుంటోంది . మూడవ ప్రాకారంలో యెడమవైపున మార్కండేయుడు శివుని పాదాలను పట్టుకొని వుండగా శివుడు తన శూలంతో యమున సంహరిస్తున్నట్లుగా వున్న పెద్ద విగ్రహం వుంటుంది . గర్భగుడిలో మూలవిరాట్టుని చూడొచ్చు .

ఈ కోవెలలో మూలవిరాట్టు ఈశ్వరుడు "అమృత ఘటేశ్వరుడు "అనే పేరుతో పూజింప బడుతున్నాడు.

పాల సముద్రాన్ని మధించేటప్పుడు  దేవతలు వినాయకుడిని పూజించ లేదని అలిగిన వినాయకుడు పాల సముద్రంలోంచి అమృతం ఉద్భవించగానే అమృతాన్ని దొంగిలించి ఇప్పుడు మూలవిరాట్టు ఉన్న చోట దాచుతాడు ,దేవతలు తమ తప్పు తెలుసుకొని వినాయకుడికి పూజలు చేసి కుడుములు నివేదించాగా సంతుష్టుడైన వినాయకుడు అమృతాన్ని దేవతలకు తిరిగి ఇచ్చేస్తాడు. అందుకే కుడి వైపున ఉన్న చిన్న కోవెలలో ఉన్న వినాయకుడిని "దొంగ వినాయకుడు ( కల్ల వినాయరగర్ ) " అని పిలుస్తారు.ఆ అమృత భాండం పెట్టినచోట శివుడు స్వయంభు గా లింగాకారం లో ఉధ్భవించేడు అందుకే ఇక్కడ ఈశ్వరుడిని "అమృతఘటేస్వరుడు అని పిలుస్తారు.

అదే ప్రాంగణం లో ఎడమ వైపున మార్ఖండేయుడు శివుని పాదాలని  చుట్టుకొని ఉండగా శివుడు యముడిని సంహరిస్తున్న విగ్రహం ఉంటుంది . ఆ విగ్రహానికి ఎదురుగా బాల యముడి విగ్రహం ఉంటుంది.

ఈ విగ్రహాల వెనుకనున్న కధ కూడా తెలుసుకుందాం .

         "మృగాండు "అనే మహర్షి అతని భార్య "మరుదమతి" సంతతి కొరకై పరమ శివుని ప్రసన్నం చేసుకోనడానికై కఠోర తపస్సు నాచరిస్తారు.వారి తపస్సుకి మెచ్చి శివుడు ప్రత్యక్షమై వారి కోరిక తెలుసుకొని దీర్ఘాయుస్సు గల వంద మంది కుపుత్రులు కావాలా? ఆయుశ్శు లేని ఒక సుపుత్రుడు కావాలా? అని అడుగగా మృగాండు ముని ఆయుస్సు లేని ఒక సుపుత్రుడిని ఇవ్వమని కోరుతాడు.

        శివుడు అలానే వరమిచ్చి అంతర్ధానమౌతాడు.కాలక్రమం

లో మరుదమతి నెలతప్పి,నెలబాలుని వలె  ప్రకాశిస్తున్న కుమారుడికి జన్మ నిస్తుంది.ఆ కుమారునికి "మార్ఖండేయుడు "అని నామకరణం గావించి అల్లారు ముద్దుగా పెంచు కుంటూ ఉంటారు. 

  ఆ బాలుడు దినదినాభివృద్ధి చెందుతూ సకల విద్యాపారంగతుడై తల్లితండ్రులకు పేరుతెస్తాడు.అందరు అంతటి సుపుత్రుడికి జన్మనిచ్చినందుకు మృగాఁడు ముని అతని భార్య మరుదమతిని కొనియాడుతారు. పదునారేళ్ల వయసు వాడవగానే మృగాండు ముని అతనికి గల మృత్యువు గురించి చెప్తాడు. అదివిని మార్ఖండేయుడు తన మిగిలిన జీవితం శివ ధ్యానం లో గడపాలని నిర్ణయించు కొని తపస్సు చేయుటకు అనువైన ప్రదేశం కొరకు వెతుకుతూ  స్వయంభూ గా వెలసిన "అమృతఘటేస్వరుని "అనునిత్యం పూజించాలని నిర్ణయించు కొంటాడు .

        నిత్యం కావేరిలో స్నానమాచరించి అమృతఘటేస్వరుని సేవించుకుంటూ

ఉంటాడు.మొదటి సారి మహా మృతుంజయ మంత్రం మార్ఖండేయుని ద్వారా ఈ ప్రదేశం లో ఉఛ్ఛరించ బడిందని అంటారు. కాలాంతరాన మార్ఖండేయుని ఆయుశ్శుతీరి అతనిని తీసుకోని పోవుటకు యముడు పాశాన్ని తీసుకొని మార్ఖండేయుని వద్దకు వస్తాడు. అది చూచిన మార్ఖండేయుడు శివలింగాన్ని ఆలింగనం చేసుకొంటాడు.యముడు మార్ఖండేయునికై వేసిన పాశం శివలింగం పైన పడుతుంది. దానికి క్రోధించిన శివుడు తన త్రిశూలంతో యముడిని వధించుతాడు.యముని మరణం తో ముల్లోకాలు అల్లకల్లోలం అవుతాయి. దేవతలు శివుని ప్రార్ధించి యముని తిరిగి పునఃర్జీవితున్ని చేయమని ప్రార్ధిస్తారు.శివుడు దేవతల కోరికని మన్నించి యముణ్ణి పునఃర్జీవితుణ్ణి గావిస్తాడు. యముడు మార్ఖండేయుని చిరాయువుగా ఆశీర్వదిస్తాడు.

         అందుకు ఈ కోవేలని యముని మరణ స్థలము మరియు యముని జన్మస్థలంగా వ్యవహరిస్తారు.

         మార్ఖండేయుడు చిరంజీవిగా వరం పొందిన ప్రదేశం కాబట్టి ఇక్కడ ఆయిశ్శు హోమం చేయించు కుంటే అకాలమృత్యు దోషం పోతుందని భక్తుల నమ్మకం.తమిళ నాడు కోవెళ్ళలో కనిపించే మరో ప్రత్యేకత ఏమిటంటే కోవేలకి ప్రదక్షిణం చేసేటప్పుడు ముఖ్య మందిరానికి అనుకొని వున్న గోడలకి నాలుగు వైపులా ముందు దక్షిణామూర్తి,లింగోద్భవం,దుర్గాదేవి ఉంటాయి . దుర్గాదేవి కి ఎదురుగా చిన్న మందిరంలో "సందికేస్వరుడు "ఉంటాడు. భక్తుల కోరికలు సందికేస్వరునికి విన్నవించుకుంటే ఆతను స్వామి వారికి సిఫారిస్ చేస్తాడట.

        గర్భగుడిలోంచి  బయటికి వచ్చేక ఎడమ వైపు అమ్మవారి కోవెల ఉంటుంది. ఇక్కడ అమ్మవారిని "అభిరామి దేవి" అని అంటారు. 

       అభిరామ భట్టారకుడు అనే మహా భక్తునిచే స్తుతింప బడిందికాబట్టి ఇక్కడ పార్వతి దేవిని "అభిరామి" అని అంటారు.

        ఈ కధ ఇలా చెప్తారు.

      ఒక నాడు పార్వతీదేవి యొక్క పరమ భక్తుడైన అభిరామ భట్టారకుడు పార్వతీదేవి ధ్యానం లో ఉండి ఆ దేశాన్ని పాలించే మహారాజు రాకని కుడా పట్టించుకోడు.అందుకు ఆగ్రహించిన మహారాజు అభిరామ భట్టారకుని  ఆరోజు తిథి ఏమని అడుగగా అమ్మవారి ధ్యానం లో ఉన్న అభిరాముడు ఆరోజు "అమావాస్య "తిథి కాగా "పౌర్ణిమ"  అని చెప్తాడు దానికి ఆగ్రహించిన రాజు అభిరామునికి "శశరీర అగ్నిప్రవేశ "దండన విధిస్తాడు. ఆ శిక్ష లో భాగంగా చెక్కలతో బల్ల పైన కట్టిన చెక్క స్తంభానికి అభిరాముని కట్టి కింద ప్రజ్వలిస్తున్న మంటలో మెల్ల మెల్లగా చెక్క బల్ల కిందకి దింపుతూ ఉంటారు.ఈ లోకంలోకి వచ్చిన అభిరామ భట్టారకుడు అమ్మవారిని ప్రాణభిక్ష పెట్టమని వేడుకుంటూ అమ్మవారి పై అష్టోత్తరం చదవడం మెదలు పెడతాడు. ఈ అష్టోత్తరం లో ప్రత్యేకత ఏమిటంటే  మొదటి నామం యొక్క అంత్యఅక్షరంతో తరవాత నామం మొదలవుతుంది .అలా ఆశువుగా గానం చేస్తూ ఉంటాడు అభిరామ భట్టారకుడు 70వ నామం చదువుతూ ఉండగా అమ్మవారు తన కర్ణాభరణాన్ని ఆకాశంలోకి విసురుతుంది. ఆ కర్ణాభరణం అమావాస్య ఆకాసంలో పూర్ణచంద్రునిలా కాంతిని యిస్తుంది.అది చూసి మహారాజు అభిరామ భట్టారకుని క్షమించమని వేడుకొని అప్పటి నుండి అమ్మవారి పేరు అభిరామి గా మార్చి అమ్మవారి సేవ చేసుకొని కాలాంతరాన శివ సాన్నిధ్యం చెందు తాడు.అభిరామ భట్టారకుడు కుడా అమ్మవారి ధ్యానం చేసుకుంటూ కాలాంతరాన అమ్మవారిలో ఐఖ్యం చెందుతాడు.

    ఇవి తిరుక్కడయూర్ లోని అమృతఘటేస్వర్  కోవెల విశేషాలు.ఇక్కడకి రైలు మార్గం ద్వారా చేరుకోవాలంటే ఇక్కడకి దగ్గరగా ఉన్న రైల్వే స్టేషన్ తిరుక్కడయూర్ కి 22కిమి. . దూరంలో ఉన్న "మైలదుత్తురై" 

      కుంభకోణం నుంచి ,చిదంబరం నుంచి బస్సుల సౌలభ్యం ఉంది.

      తిరుక్కడయూర్ లో భోజన, వసతి సౌకర్యాలు ఉన్నాయి. 

              ఇక్కడ షష్టిపూర్తి మొదలయిన పూజలు ముందురోజ సాయంత్రం మొదలు పెట్టి మరునాడు పన్నెండుగంటలవరకు జరుగుతాయి . కాబట్టి ఈ పూజలు చేయించుకోదల్చుకున్నవారు ముందురోజు పగలు పన్నెండు గంటలలోపు వస్తే చాలు , పూజకు నిర్ణయించబడ్డ సొమ్ముచెల్లించుకుంటే వారే అన్నీ చూసుకుంటారు .

        వచ్చేవారం మరొక మందిరవిశేషాలతో మీ ముందుంటామన మనవి చేసుకుంటూ అంతవరకు శలవు .

 

మరిన్ని శీర్షికలు
pratapabhavalu