గట్టిగా వెయ్యి మంది సభ్యులు కూడా లేని మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్కి ఎన్నికలు జరిగాయి. 500 మంది సభ్యులు కూడా ఓటింగ్లో పాల్గొనలేదు. పరిస్థితి ఇలాగే ఉంటుందని అందరికీ తెలుసు. కానీ అనవసర హంగామా చాలా జరిగింది. పొద్దున్న లేస్తే ఒకరి ముఖాలు ఒకరు చూసుకోవాల్సిన నటీ నటులు ఒకరి మీద ఒకరు బురద చల్లుకున్నారు. మీడియాకెక్కి నానా యాగీ చేశారు. అంత ఆయిపోయాక మేమంతా ఒక్కటే అని చెబుతున్నారు. సినీ కళామతల్లి బిడ్డలుగా సినీ పరిశ్రమ ఎప్పుడూ ఒక్క తాటిపైనే ఉండాలి. అందరికీ అదే మంచిది. ఇక్కడ ఆధిపత్య పోరు అనవసరం. అయితే గతంతో పోల్చితే ఇప్పుడు వివాదాలు కొంత తక్కువే.
ఇంకో ఆశక్తికరమైన విషయమేంటంటే ఓటింగ్ కూడా కొంచెం బెటర్గానే జరిగింది. నరేష్ అధ్యక్షుడిగా ఎంపికయ్యారు. శివాజీ రాజా రెండోసారి పదవి కోసం ప్రయత్నించి చతికిల పడ్డారు. శ్రీకాంత్ ఓటమి చాలా మందికి బాధ కల్పించింది. నటి హేమ సోలోగా పోటీ చేసి గెలవడం గమనార్హం. అయితే ప్యానెల్తో సంబంధం లేకుండా గెలిచిన వారంతా ఇప్పుడు ఒక టీమ్గా పని చేస్తారు. పేద కళాకారుల్ని ఆదుకోవడం, నటీనటులు వివాదాల్లోకి ఎక్కినప్పుడు ఆ వివాదాల్ని పరిష్కరించడం ద్వారా సినీ పరిశ్రమ గౌరవాన్ని పెంచడం గెలిచిన టీమ్ బాధ్యత.
|