సినిమాకి సంబంధించి దాదాపు అన్ని విభాగాల పైనా పవన్ కళ్యాణ్కి కమాండ్ ఉంది. హీరోగానే కాదు, స్టంట్ కొరియోగ్రఫీ, డాన్స్ కొరియోగ్రఫీ, సినిమాటోగ్రఫీ. డైరెక్షన్, కాస్ట్యూమ్స్, స్టోరీ, డైలాగ్స్, స్క్రీన్ప్లే.. ఇలా అన్ని విభాగాల పైనా తనదైన ముద్ర వేసేందుకు ప్రయత్నించారాయన. దర్శకుడిగా 'జానీ' సినిమాని పవన్ తెరకెక్కించిన సంగతి తెలిసిందే. నిర్మాతగానూ పలు సినిమాల్ని రూపొందించారు. ఇప్పుడీ ప్రస్థావన ఎందుకంటే, పవన్ కళ్యాణ్ మేనల్లుడు సాయి ధరమ్తేజ్ కూడా చిన్న మేనమామ బాటలోనే నడుస్తున్నాడట. తేజు కొన్ని కథల్ని రెడీ చేసుకున్నాడనీ, ఆ కథల్ని పలువురు దర్శకులకు చెప్పి, సినిమాలు చేసే ఆలోచనలో ఉన్నాడనీ ప్రచారం జరుగుతోంది. అయితే ఈ విషయమై తేజు నుండి ఇప్పటిదాకా ఎలాంటి స్పందనా రాలేదు. ఇప్పుడు యంగ్ జనరేషన్ నటనతో పాటు, ఇతరత్రా అన్ని విషయాల పైనా శ్రద్ధ చూపుతున్నారు.
అయితే వరుస పరాజయాలతో డీలా పడ్డ తేజు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇలాంటి రిస్క్లు చేయకపోవడమే మంచిది. తేజు తాజా చిత్రం 'చిత్రలహరి' విడుదలకు సిద్ధంగా ఉంది. కళ్యాణీ ప్రియదర్శిన్, నివేదా పేతురాజ్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకి కిషోర్ తిరుమల దర్శకత్వం వహిస్తున్నారు.
|