Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
health

ఈ సంచికలో >> శీర్షికలు >>

శ్రీ స్వామి వివేకానంద - సుధారాణి మన్నె

swami vivekananda

నిర్యాణం
అహర్నిశలూ లోక కళ్యాణం కోసమూ - భారత దేశోద్ధారణ కోసమూ కృషిసాగిస్తూ ఉండటం వల్ల స్వామి ఆరోగ్యం రోజు, రోజుకీ క్షీణించసాగింది. ఇక తాను ఎక్కువకాలం జీవించలేను అనే విషయం ఆయనే తెలుసుకున్నాడట. ఈ విషయాన్ని స్వామియే ప్రకటించాడట కూడా.

1902 వ సంవత్సరం జూలై 1 వ తేదీన స్వామి తన పూజామందిరానికి వెళ్ళి తలుపులు వేసుకుని తీవ్రంగా ధ్యానాన్ని జరిపాడు. తర్వాత ఆయన ఇవతలకు వచ్చి వివేకానందుడేమిచేశాడో మరొక వివేకానందుడుంటే గ్రహించేవాడు. అయినా కాలగర్భంలో ఎంతమంది వివేకానందులు ఉద్భవించనున్నారో! అని తనలో తాను అనుకున్నాడట. ఆమాట విన్న ప్రేమానందుడు ఆశ్చర్యచకితుడయ్యాడు. మధ్యాహ్నం భోజనానంతరం వివేకానందుడు బ్రహ్మచారులకు పాఠం కూడా చెప్పాడు. సాయంత్రం ప్రేమానందునితో షికారు కెళ్ళి అతని కనేక ముఖ్య విషయాలను బోధించాడు. రాత్రి మళ్ళీ పూజా మందిరానికి వెళ్ళి ఎన్నడూలేనంత ఎక్కువకాలం ధ్యాన నిమగ్నుడయ్యాడు. తర్వాత నేలమీద ఉన్నప్రక్కపై పడుకుని శిష్యునొకనిని పిలిచి విసరమన్నాడు. జపమాల మాత్రం స్వామి చేతిలోనే వుంది. అంతే మరొక గంట గడిచిన తర్వాత ఆ శిష్యునకు అనుమానం కలిగి మరొక సన్యాసిని పిలవగా అతడు వచ్చి చూసి స్వామి అవతారం చాలించాడని చెప్పాడు. అప్పటికి వివేకానందుని వయస్సు 39 సంవత్సరాల 5 నెలల 24 రోజులు మాత్రమే.

ఈ దుర్వార్త ఒక్కసారిగా ప్రపంచంలోని నలుమూలలకూ ప్రాకిపోయినది. దేశంలోని అన్ని ప్రాంతాల నుండి ప్రజలు ఆయన భౌతిక దేహాన్ని చివరిసారి దర్శించడానికి వచ్చారు. విదేశాల నుండి ఫోన్ ల ద్వారా లెక్కించలేనన్ని సంతాప ప్రకటనలు చేరాయి. భారతీయులంతా తమ సర్వసాన్నీ కోల్పోయినట్లు విలపించారు. ఇక స్వామీజీ శిష్యుల  విచారానికి అంతులేదు.

మరునాడు ఉదయం వేలాది జనసమూహం వెంటగా స్వామిశిష్యులు అత్యంత భక్తి ప్రవత్తులతో ఆయన బౌతికకాయాన్ని గంగానదీ తీరాన ఒకప్పుడు స్వామి చెప్పిన స్థలానికి తీసుకువెళ్ళి దహనం చేశారు. ఇప్పుడా ప్రదేశంలోని వివేకానందాలయం వున్నది.

వివేకానందుని భౌతికకాయం దహనం కాబడినా ఆ మహామహుని దివ్యజ్యోతి మాత్రం బ్రహ్మాండంగా ప్రకాశిస్తూనే వున్నది. ఆయన నెలకొల్పిన రామకృష్ణ మఠం - రామకృష్ణ సేవాసంఘం దినదినాభివృద్ధి చెందుతూ ప్రపంచ ప్రఖ్యాత సంస్థలుగా సుప్రతిష్ఠ నార్జించుకుంటున్నాయి. వివేకానందుని పేరు తలచుకున్నప్పుడల్లా భారతీయులు గర్వపడుతూనే వున్నారు.

అటువంటి మహాపురుషుని కన్న భారతమాత ధన్యురాలు.

మరిన్ని శీర్షికలు
dikku kaadu dikkayinavaadu mukhyam