Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
Can 'disability' stop if the mind runs out.

ఈ సంచికలో >> శీర్షికలు >>

గో గ్రీన్‌' అంటోంది యంగ్‌ జనరేషన్‌ - ..

go green

వినాయక చవితి అంటే ఉండ్రాళ్లు, దద్ధోజనం, పులిహోర.. వగైరా వంటకాలతో పాటు, వీధి వీధినా వెలిసే రంగు రంగుల బొజ్జ గణనాధులు కన్నుల పండగలా దర్శనమిస్తాయి. అయితే, అసలు 'వినాయక చవితి' అంటే, ఏంటో తెలుసా.? 'ప్రకృతి పండగ'. చెరువులు, కాల్వల్లోని బంక మట్టిని తవ్వి తీసుకొచ్చి, ఆ మట్టితో అందమైన గణనాధులకు ప్రాణం పోసం, ఆ మట్టి గణనాధున్ని 11 రోజుల పాటు, దీప, ధూప, నైవేద్యాలతో పూజించి, అనంతరం తిరిగి అదే నీటిలో నిమజ్జనం చేయడం ద్వారా ప్రకృతికి మన వంతు మేలు చేసినట్లవుతుంది. వర్షాకాలంలో వచ్చే వినాయక చవితి కారణంగా, పొలాలు, చెరువులు, కాలవల్లోని బంకమట్టిని తవ్వి తీయడం ద్వారా, అక్కడి నేల సారవంతమవుతుంది. మట్టి తీత కారణంగా, ఈ సీజన్‌లో వచ్చే వర్షాలకు చెరువులు, కాలవలు నిండి, నీరు లేని వేసవి కాలానికి ఆ నీరు ఉపయోగకరమవుతుంది. ఇదీ వినాయక చవితి విశిష్టత. ఇక చవితి రోజు వినాయకున్ని పూజించేందుకు వాడే రకరకాల పత్రిలో ఔషధ గుణాలుంటాయి. వాటిని అలాగే తిరిగి నీటిలో నిమజ్జనం చేయడం ద్వారా, నీటి శుధ్ది జరిగి, ఆరోగ్యకరమైన నీరు మానవులకు అందుతుంది.

కానీ ట్రెండ్‌ మారింది. పోటీ తత్వం పెరిగింది. వీధికో గణనాధుడు కాదు, ఇంటికో గణనాధుడు.. మా గణేష్‌ పెద్దగున్నాడంటే, మా గణేష్‌ పెద్దగున్నాడన్న పోటీతో భారీ స్థాయిలో రకరకాల వినాయకుని ప్రతిమలు రూపొందుతున్నాయి. భారీతనం పెరగడం, నిమజ్జనంలో ఎదుర్కొనే సమస్యల కారణంగా, సౌకర్యం కోసం మట్టి గణపతి స్థానంలో ప్లాస్టర్‌ ఆఫ్‌ ప్యారిస్‌తో తయారు చేసిన వినాయకుని ప్రతిమలకు గిరాకీ పెరిగింది. మట్టి నీటిలో కరిగిపోతుంది. కానీ, ప్లాస్టర్‌ ఆఫ్‌ పారిస్‌ నీటిలో కరగదు. అదే కాక, ఈ ప్లాస్టర్‌ ఆఫ్‌ పారిస్‌ బొమ్మలకు వాడే అత్యంత ప్రమాదకరమైన రసాయనిక రంగులు పచ్చని ప్రకృతిని నాశనం చేస్తున్నాయి. నీటిలో పెరిగే జలచరాలకు తీవ్రమైన హాని చేస్తున్నాయి. వాటి సంతతి నాశనమైపోతోంది. తద్వారా మానవాళి మనుగడకి హాని జరుగుతోంది. ఈ కారణంగా ఇటీవల గో గ్రీన్‌ గణేష్‌పై అవగాహన పెంచే దిశగా పలు కార్యక్రమాలు రూపుదిద్దుకుంటున్నాయి.

గత రెండేళ్లుగా మట్టి గణపతి ముద్దు, ప్లాస్టర్‌ ఆఫ్‌ పారిస్‌ వద్దు.. అనే నినాదంతో, మట్టి గణపతుల వాడకం కొంత పెరిగింది. అయితే, ఇది చాలదు. పూర్తిగా అవేర్‌నెస్‌ రావాలి. అసలు ఎక్కడా రసాయనిక రంగులతో మెరిసే గణనాధులు కనిపించకూడదు. మట్టిలోనే అసలు అందముంది. ప్రకృతి ప్రసాదించిన రంగులతోనే అసలు సిసలు కళ దాగుంది.. అని గుర్తించాలి. రసాయనిక రంగుల్ని తరిమికొట్టాలి. ఇదంతా జరగాలంటే, యువతలో మార్పు రావాలి. పోటీతత్వం ఉండాలి కానీ, ప్రకృతికి హాని చేసేందుకు అది ప్రోత్సాహకం కాకూడదు. ఇప్పటికే మట్టి గణపతిపై చాలా వరకూ అవేర్‌నెస్‌ వచ్చింది. యువత పర్సనల్‌గా తీసుకుని పలు అవగాహనా కార్యక్రమాలు కూడా చేపట్టింది. రిజల్ట్‌ బాగా వచ్చింది. స్కూళ్లు, ఇతర ప్రభుత్వ సంస్థలు కూడా గో గ్రీన్‌ గణేష్‌పై ప్రత్యేక అవగాహన పెంచే దిశగా తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ క్రమంలో ప్రకృతికి హాని చేసే ప్లాస్టర్‌ ఆఫ్‌ ప్యారిస్‌ విగ్రహాల నియంత్రణకై మన ప్రభుత్వాలు కూడా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి.

మరిన్ని శీర్షికలు
meghana art